దశావతారాల్లో ఒకటైన నారసింహుడి రూపం భయం గొలిపేదిగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచంలో ఒకే ఒక చోట మాత్రం నారసింహుడు లింగం రూపంలో ఉన్నారు. ఓ సామాన్య రైతు పొలంలో జన్మించిన ఆ నారసింహుడు వేలాది సంవత్సరాలుగా భక్తుల కొంగు బంగారమై కొలువై ఉన్నాడు.
శివ, వైష్ణవ బేధం లేదని చెప్పడానికి వీలుగా ఆయనకు అడ్డు, నిలువు నామాలు కూడా ఉన్నాయి. ఇంతేకాకుండా ఆయనకు ఒక కన్ను పైకి మరో కన్ను కిందికి కూడా ఉంటుంది. ఈ విశిష్ట దేవాలయ దర్శనం కోసం విదేశాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు.
ఇక ఈ క్షేత్రంలోని పుష్కరిణిలో నిత్యం నీళ్లు ఉంటాయి. ఎంతటి నీటి ఎద్దడి ఎదురైనా ఈ పుష్కరిణిలో నీరు ఎండిపోవు. ఈ పుష్కరిణిలో బెల్లం వేసి స్నానం చేస్తే చర్మరోగాలన్ని సమిసిపోతాయని భక్తులు వేలాది ఏళ్లుగా నమ్ముతున్నారు. ఇంతటి విశిష్టమైన దేవాలయం గురించిన పూర్తి వివరాలు మీ కోసం...
దశావతారాలు
P.C: You Tube
విష్ణు భగవానుడి దశావతారాల్లో నారసింహ అవతారం కూడా ఒకటి. హిరణ్య కసిపుడనే రాక్షసుడిని సంహరించడానికి ఆయన నారసింహుడి అవతరం ఎత్తినట్లు మన పురాణాలు చెబుతున్నాయి.
సింహం తల
P.C: You Tube
ఈ నేపథ్యంలో నారసింహుడు అన్న తక్షణం మనకు సింహపు తలతో ఉగ్ర రూపంలో ఉన్న ఆ విష్ణుభగవానుడే గుర్తుకు వస్తాడు. ఎందుకంటే నరసింహుడు సగం మానవ రూపం, సగం జంతు రూపం.
దేశంలో ఎక్కడా మనకు కనిపించడు
P.C: You Tube
భారత దేశంలోని ఏ దేవాలయంలోనైనా మనకు నరసింహుడు ఇదే రూపంలో కనిపిస్తాడు. ఆయనకే మనం పూజలు, అభిషేకాలు చేస్తాం. అయితే ప్రపంచంలో ఒకే ఒక చోట మాత్రం నారసింహుడు లింగం రూపంలో వెలిశాడు.
వేల సంవత్సరాలుగా
P.C: You Tube
ఈ లింగానికే ప్రజలు వేల సంవత్సరాలుగా పూజలు చేస్తున్నారు. తమ కోర్కెలు తీర్చే ఈ నరసింహుడిని చాలా మంది విదేశాల నుంచి వచ్చి కూడా సందర్శించుకొంటున్నారు. ఆ దేవాలయం మన తెలుగు నేల పైనే ఉంది.
తెలంగాణ
P.C: You Tube
ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలో 9 కిలోమీటర్ల దూరంలో సింగోటం ఉంది. ఇక్కడ నారసింహుడు లింగం రూపంలో కొలువై ఉన్నాడు. ఇందుకు సంబంధించిన స్థానికంగా ఒక కథనం ప్రచారంలో ఉంది.
సింగమనాయుడు
P.C: You Tube
సుమారు రెండు, మూడువేల ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని సురభి వంశానికి చెందిన సింగమనాయుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించేవాడు. ఆయన సమయంలోనే ఆ విష్ణు రూపమైన నారసింహుడు ఇక్కడ సాక్షాత్కరించాడు.
పొలాన్ని దున్నుతుంటే
P.C: You Tube
సింగాటాన్ని అప్పట్లో సింగపట్టణం అనే వారు. ఈ గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో దున్నే సమయంలో ప్రతి సారి ఒక రాయి నాగలికి అడ్డు వచ్చేది. ఎన్నిసార్లుఆ రాయిని పొలం గట్టుమీద ఉంచినా తిరిగి మరుసటి రోజు పొలం దున్నే సమయంలో రాయి నాగలికి అడ్డు తగిలేది.
కలలో
P.C: You Tube
అదే సమయంలో ఒకరోజు రాత్రి నారసింహుడి రూపంలో సింగమనాయుడికి కలలో కనిపించి తాను ఓ శిల రూపంలో సింగ పట్టణంలో ఉన్నానని ఓ చెబుతాడు. దీంతో రాజు తన పరివారంతో కలలో ఆ విష్ణుభగవానుడు చెప్పిన చోటుకు చేరుకొంటారు.
కాంతులు వెదజల్లుతూ
P.C: You Tube
పరివారం మొత్తం అక్కడ గాలించగా లింగ రూపంలో ఉన్న ఒక శిల కాంతులీనుతూ కనిపించింది. పూజలు చేసి ఆ రాతిప్రతిమను ఊరేగింపుగా రాజధానికి తీసుకువెళ్లాలని ప్రణాళికలు రచిస్తారు. అనుకొన్నట్లుగానే ఊరేగింపు మొదలవుతుంది.
రెండు పాదాలు
P.C: You Tube
అయితే ఊరేగింపు ప్రస్తుత ఆలయం ఉన్న ఎత్తైన బండ దగ్గరికి వచ్చేసరికి అక్కడ రెండు పాదాలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఆ రాతి శిలను మోస్తున్న వ్యక్తి ఎంతగా ప్రయత్నించినా ఒక్క అడుగు కూడా ముందుకు పడకుండా పోతుంది.
పాదం గుడి
P.C: You Tube
ఇక రాజుతో పాటు మిగిలిన వారు ఇది స్వామివారి ఆదేశం అని భావించి అక్కడ శిలను మొదటిసారిగా దించారు. దీంతో ఈ ప్రాంతాన్ని పాదం గుడి అని పిలుస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇక్కడ పూజుజరుగుతున్నాయి.
నాపరాయితో
P.C: You Tube
అటు పై స్వామి వారు ఎండకు ఎండకుండా, వానకు తడవకుండా ఒక నాపరాయితో చిన్న మండపాన్ని నిర్మించారు. ఆ మండపాన్ని ఇప్పటికీ గర్భగుడిలో సందర్శించుకోవచ్చు. ఇక ఆలయం చిన్నగా ఉన్న గొప్ప మహత్యం కలిగినదని చెబుతారు.
కమలం
P.C: You Tube
ఇక్కడ నారసింహుడికి ఒక కన్ను కిందకు, మరో కన్ను ఎగువకు ఉంటుంది. ఎడమ కన్ను కింది భఆగంలో కమలం ఉంది. కమలం లక్ష్మీకి ప్రతీక కాబట్టి ఇక్కడ ఉన్న నారసింహుడిని లక్ష్మీ నారసింహుడు అని పిలుస్తారు. ఇక కొండను శేతాద్రి అని పిలుస్తారు.
అడ్డనామాలు, నిలువు నామాలు
P.C: You Tube
ఈ స్వామి హరి హరులకు బేధం లేదని తన రూపం ద్వారా స్పష్టం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా స్వామికి త్రిపుండ్రం (అడ్డనామాలు), ఊర్థ్వ పుండ్రాలు (నిలువు నామాలు) ఉంటాయి. అడ్డనామాలు శైవానికి ప్రతీక అయిన నిలువు నామాలు వైష్ణవానికి ప్రతీకలు.
తీవ్ర వాగ్వాదం
P.C: You Tube
ఇదిలా ఉండగా ఇక్కడ స్వామివారికి వైష్ణవులు అర్చకత్వం వహించాలా లేక శైవ మతం ఆచరించే పూజారులు పూజాధికార్యక్రమాలు నిర్వహించాలా అన్న విషయం స్థానిక బ్రాహ్మణుల్లో తీవ్ర విభేదాలకు దారి తీసింది. ఈ విషయం ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న రాణి రత్నమాంబకు తెలిసింది.
పీఠాధిపతులు
P.C: You Tube
వివాద పరిష్కారానికి పుష్ఫగిరి పీఠాధిపతులతో పాటు మరికొంతమందిని ఆచారులను ఆమె స్వయంగా ఈ క్షేత్రానికి ఆహ్వానించింది. వారు అన్ని రకాలుగా పరీక్షలు చేసి అర్చకత్వాన్ని వైష్ణవ, శైవ క్షేత్రానికి మధ్యస్థంగా ఉండే స్మార్తులైన ఓరుగంటి వంశీయులకు ఇచ్చారు.
పుష్కరిణి
P.C: You Tube
ఇప్పటికీ ఆ వంశం వారే అక్కడ అర్చకత్వాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఘటన జరిగనప్పుడే ఆలయానికి పక్కన శివాలయం, పుష్కరిణి కూడా నిర్మించారు. ఈ పుష్కరిణిలో భక్తి శ్రద్ధలతో స్నానం చేస్తే అన్ని రోగాలూ పోతాయని భక్తులు విశ్వాసం.
నిత్యం జలం
P.C: You Tube
ఈ ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడినా కూడా ఈ పుష్కరిణి ఎండిపోలేదని ఇక్కడి పెద్దవారు చెబుతారు. అంతేకాకుండా ఈ పుష్కరిణిలో బెల్లం గడ్డలు వేసి స్వామికి మొక్కుకొంటే గడ్డలు, కురుపులు చర్మపు రోగాలన్ని పోతాయని చెబుతారు.
రత్నగిరి కొండ
P.C: You Tube
ఈ నారసింహస్వామి ఆలయానికి ఎదురుగా అరకిలోమీటరు దూరంలో రత్నగిరి అనే కొండ ఉంది. ఈ కొండమీద క్రీస్తు శకం 1857లో రాణి రత్నమాంబ లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కొండమీద కనిపించే భవనం కొల్లాపూర్ రాజావారి పురాతన విడిది భవనం
సంక్రాంతి, జాతర
P.C: You Tube
సంక్రాంతి నుంచి దాదాపు 30 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు, జాతరలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు విదేశాల్లో ఉన్నవారు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతారు. కొల్లాపూర్ నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూంరలో ఉన్న ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం బాగుంది.