అట్టహాస దసరా ఉత్సవ వేడుకలలో మడికేరి దసరా వేడుకలు మైసూరు దసరా తర్వాత రెండవ స్తానాన్ని ఆక్రమిస్తాయి. మడికేరి, కర్ణాటక రాష్ట్రం లోని కూర్గ్ జిల్లాలో ఒక ప్రధాన హిల్ స్టేషన్. ఇక్కడ అనేక సుందర ప్రకృతి దృశ్యాలు చూడవచ్చు. చల్లటి వాతావరణం. దక్షిణ భారత దేశ పర్యాటక ఆకర్షనలలో మడికేరి ప్రధానమైనది. అట్టహాసంగా ఇక్కడ జరిగే పది రోజుల నవరాత్రి ఉత్సవాలు అత్యధిక పర్యాటకులను ఇక్కడకు వచ్చేలా చేస్తాయి. సుమారు వంద సంవత్సరాల చరిత్ర కల ఈ దసరా వేడుకలు శక్తి పూజకు సంబందించినవి. నలుగురు మాతలు అయిన, కుందూరు మొత్తే చౌతి మరియమ్మ, దండిన మరియమ్మ, కోటే మరియమ్మ మరియు కంచి కమలాక్షి లను ఈ సమయంలో ఊరేగింపు చేస్తారు. ఈ పది రోజులలో కరగ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మడికేరి లో చెడుపై మంచి సాధించిన విజయానికి గాను నాలుగు కరగాలు, పది మండపాలు (దశ మండపాలు ) పెట్టి పూజలు చేస్తారు. ఇక్కడ జరిగే మడికేరి దసరా ఉత్సవాలలో సాధారణంగా ప్రభుత్వ అధికారుల జోక్యం వుండదు. ఈ ఉత్సవ వేడుకలు పూర్తిగా ప్రజలే నిర్వహిస్తారు. కనుక దీనిని వారు ‘జనోత్సవం' అని కూడా అంటారు. అనేక కచేరీలు, వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీటిని జరపటంలో దేశ వ్యాప్త కళాకారులు ఇక్కడకు వస్తారు. పండుగ వేడుకలు తొమ్మిది రాత్రులు జరుగుతాయి. పదవ రోజు ఒక ఊరేగింపు జరిపి బన్ని చెట్టు కొట్టటంతో ఉత్సవం ముగుస్తుంది.
మడికేరి లో దసరా వేడుకలే కాక, అనేక పర్యాటక ఆకర్షణలు కూడా కలవు. ప్రసిద్ధి గాంచిన రాజాస్ సీట్, మడికేరి ఫోర్ట్, ఓంకారేశ్వర టెంపుల్ వంటివి తప్పక సందర్సిన్చదగినవి. రాజాస్ సీట్ చాలా అందంగా వుంటుంది. ఇక్కడ నుండి పచ్చటి మడికేరి ప్రదేశాలు ప్రపంచంలో అన్నిటికంటే మిన్నగా కనపడతాయి. చక్కగా నిర్వహించబడుతున్న గార్డెన్ లు అనేక ఫౌంటెన్ లు పిల్లలను ఆనందించ చేస్తాయి.
మడికేరి ఫోర్ట్ - మడికేరి ఫోర్ట్ సహజంగా ఒక మట్టి కోట కాగా తర్వాతి కాలంలో టిప్పు సుల్తాన్ దీనిని రహస్య సొరంగ మార్గాలతో పునరుద్ధరించాడని చెపుతారు. కోటలో కల ఒక రాతి తాబేలు ఆసక్తి కలిగిస్తుంది. కోట ఆవరణలోని వీర భద్ర టెంపుల్ శిల్ప శైలి సెయింట్ మార్క్స్ చర్చి శిల్ప శైలి ని పోలి వుంటుంది. కోట లో చరిత్ర కు సంబంధించిన కళాకృతులు పర్యాటకులకు ఒక మ్యూజియం భావన కలిగిస్తాయి.
మడికేరి పట్టణ నది బొడ్డున కల ఓంకారేశ్వర టెంపుల్ నిర్మాణం ఇస్లాం మత శిల్ప తీరు ప్రభావం కలిగి వుంటుంది. ఇక్కడి శివ లింగాన్ని కాశి నుండి తెచ్చి ప్రతిష్ట చేసారని చెపుతారు.
మడికేరి కి రైలు స్టేషన్ లేకపోయినప్పటికీ రోడ్డు మార్గం చక్కగా వుంటుంది. మైసూరు - మంగలూర్ రాష్ట్ర హై వే 88 మడికేరి గుండా వెళుతుంది. మడికేరి మైసూరు నుండి 120 కి. మీ. లు, మంగలూర్ నుండి 136 కి. మీ. ల దూరంలో కలదు. దీనికి సమీప రైలు స్టేషన్ లు హస్సన్, కాసర్గోడ్, కన్హాన్గడ్ మరియు తలస్సేరి ల లో కలవు. వీటి దూరం సుమారుగా 115 కి. మీ. లు వుంటుంది.