కొద్ది క్షణాల శాంతి అనుభవం కావాలంటే సేవాగ్రాం అనే చిన్న ప్రశాంత పట్టణాన్ని సందర్శిస్తే సరిపోతుంది. పచ్చని చెట్లతో నిండిన వనాల మధ్య ఆధ్యాత్మికతకు, ధ్యాన కేంద్రానికి చక్కటి ఎంపిక ఈ చిన్న పట్టణం.
సేవాగ్రాం, మహారాష్ట్రలోని వార్ధా జిల్లాకు చెందినది. నాగ్ పూర్ నుండి 77 కిలోమీటర్ల దూరంలో, వార్ధా నుండి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో కలదు. సేవాగ్రాం అంటే 'సేవకోసం ఉన్న ఊరు' అని అర్థం. గాంధీ గారు 1934 వ సంవత్సరం లో ఈ ఊరికి వచ్చినప్పుడు ఆ పేరు పెట్టారు. అంతకు పూర్వం దీనిని 'షేగావ్' అని పిలిచేవారు.
బాపు కుటీరం
చిత్ర కృప : parthjdave
సేవాగ్రాం ఆశ్రమం గాంధీజీ జీవన విధానానికి దగ్గరి సంబంధం కలిగి వుంటుంది. తన భార్య కస్తూర్బా గాంధీతో కలిసి ఆయన నివసించిన కుటీరం ఇప్పటికీ చెక్కు చెదరకుండా వుండి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఈ కుటీరాల్లో ఎలాంటి అలంకరణలూ లేవు మరియు చూడటానికి అంత కళాత్మకంగానూ వుండవు. అయినా భారతదేశం యొక్క ఆతిథ్యానికి, సేవలకు ఉత్తమ స్మారకంగా ఉన్నది. పైగా వెదురు చాపలు, బొంగులు మట్టి ఇటుకలతో తయారైన ఈ కుటీరం, గాంధీగారు అవలంబించిన నిరాడంబర జీవన విధానాన్ని మన కళ్ళకి కడుతుంది.
కస్తూర్బా గాంధీ తో గాంధీజీ
చిత్ర కృప : Yann
ఈ ఆశ్రమంలో మనకి మాహాదేవ్ కుటీ, కిశోర్ కుటీ, పర్చురే కుటీ, రుస్తం భవన్ , ఆఖిరి నివాస్ కనబడతాయి. చరిత్ర అంటే మక్కువ కలవారందరికీ స్వాతంత్రానికి పూర్వం వున్న అనుభూతుల్ని మిగులుస్తుంది ఈ ప్రదేశం.
ఇది కూడా చదవండి : మహారాష్ట్రంలోని బుద్ధుని అవశేషాలు !
గతంలో గాంధీజీ ఇక్కడ తన ఆశ్రమాన్ని నెలకొల్పినప్పుడు కేవలం ఓ వెయ్యి మంది నివాసం వుండేవారు. కానీ నేడు, ప్రపంచంలోని అత్యంత శక్తివంతుడైన వ్యక్తి జీవనవిధానాన్ని తెలుసుకునేందుకు ఏడాది పొడవునా వచ్చే పర్యాటకులతో కళకళలాడుతోంది. సేవాగ్రాం పర్యటన మిమ్మల్ని తన అందంతో మంత్రముగ్ధుల్ని చేస్తుంది, తన సేవా నిరతితో ప్రేరణనిస్తుంది.
ఆఖరి నివాస్
చిత్ర కృప : Muk.khan
సేవాగ్రాం లో బాపు 1934 నుండి 1940 వరకు ఆశ్రమం నిర్మించుకొని నివసించాడు. సాధారణ ప్రజలు నివశించే విధంగానే కరెంటు లేకుండా, ఫోన్ సౌకర్యం లేకుండా నిరాడంబర జీవనాన్ని గడిపాడు. బాపు గారి వంటగది ని ఆశ్రమంలో చూడవచ్చు.
ఆఖిరి నివాస్ : గాంధీ ఆశ్రమంలో నిర్మించిన మొదటి గుడిసె ఆఖరి నివాస్. దీని చుట్టూ ప్రార్థనా స్థలం ఉంటుంది. ఇందులో గాంధీజీ వాడిన వెయిటింగ్ మెషీన్ భద్రపరిచారు. దీనిని అప్పట్లో 100 రూపాయలతో నిర్మించారు. 1942 వ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం లో భాగంగా ఇక్కడ నిత్యం సభలు, సమావేశాలు జరిగేవి.
బాపు వాడిన వెయిటింగ్ మెషీన్
చిత్ర కృప : Sunder Dasika
పర్చూరె కుటి : పర్చూరె ఒక సంస్కృత స్కాలర్. ఇతను కుష్టు వ్యాధితో బాధపడేవాడు. గాంధీ ఇతనిని చేరదీసి ఆశ్రమంలో ఒక గదిలో ఉండనిచ్చెను. అతను ఉన్న ఆ కుటీరమే పర్చూరె కుటి గా స్థిరపడిపోయింది.
పర్చూరె తో గాంధీజీ
చిత్ర కృప : bablu22
మహాదేవ్ కుటి : మహాదేవ్ దేశాయ్, గాంధీజీ కి సెక్రెటరీ. ఆశ్రమంలో ఇతను నివశించిన ప్రదేశం మహాదేవ్ కుటి.
కిశోర్ నివాస్ : ఇటుకలతో, సిమెంట్ తో ఆశ్రమంలో నిర్మించిన ఇల్లు కిషోర్ నివాస్. ఇందులో హరిజన పత్రిక పార్ట్ టైం ఎడిటర్, గాంధీజీ కి అత్యంత సన్నిహితుడు కిషోర్ లాల్ మష్రువాలా ఉండేవాడు.
ఇది కూడా చదవండి : ఉత్తర మహారాష్ట్ర ప్రధాన ఆకర్షణలు !
రుస్తం భవన్ : ఇది నాలుగు గదుల గెస్ట్ - హౌస్.
గాంధీజీ గౌరవార్ధం ప్రభుత్వం వారు 1991 వ సంవత్సరంలో గాంధీజీ జ్ఞాపకాలతో ఒక ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. అలాగే 1982 వ సంవత్సరంలో యాత్రి నివాస్ ను ఇక్కడి వచ్చే అతిథుల సౌకర్యార్థం, ట్రైనింగ్ మరియు కాన్ఫరెన్స్ కోసం స్థాపించారు.
గాంధీజీ మ్యూజియం, సేవాగ్రాం
చిత్ర కృప : Vignesh Babu
సేవాగ్రాం ఎలా చేరుకోవాలి ?
వాయు మార్గం
సేవాగ్రాం సమీపాన నాగ్ పూర్ అంతర్జాతీయ విమానాశ్రయం (75 కి. మీ) కలదు. టాక్సీ లేదా క్యాబ్ లలో ఎక్కి రెండున్నర గంటల్లో ఆశ్రమం చేరుకోవచ్చు.
రైలు మార్గం
సేవాగ్రాం సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ వార్ధా. ఇది 8 కిలోమీటర్ల దూరంలో కలదు. ముంబై నుండి 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న వార్ధా స్టేషన్ కు రైళ్లు నడుస్తుంటాయి.
సేవాగ్రాం కు సమీపాన ఉన్న మరో రైల్వే స్టేషన్ నాగ్ పూర్ స్టేషన్ (75 కి. మీ). ఇక్కడికి ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, బెంగళూరు ,చెన్నై, కోల్కత్త ల నుండి ఎక్స్ ప్రెస్ రైళ్లు, పలు సూపర్ ఫాస్ట్ రైళ్లు వస్తుంటాయి.
రోడ్డు / బస్సు మార్గం
వార్ధా మరియు నాగ్ పూర్ ల నుండి తరచూ ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు సేవాగ్రాం వరకు తిరుగుతుంటాయి.
సేవాగ్రాం రోడ్డు మార్గం
చిత్ర కృప : parthjdave