విజ్ఞానం కలిగి ఉండే ప్రదేశాలంటే అందరికీ ఇష్టమే. ఖాళీ సమయం దొరికిందంటే వాటి వద్దకు వెళ్లి ఆనందిస్తుంటారు. అలాంటి ప్రదేశాలలో ఒకటి హైదరాబాద్ లోని హరిణ జాతీయ పార్క్. హైదరాబాద్ నుండి విజయవాడ కు వెళ్లే మార్గంలో జాతీయ రహదారిపై 18 కిలోమీటర్ల దూరంలో వనస్థలిపురం లో కలదు.
హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో, ఆటో నగర్ కు అనుకోని దాదాపు మూడువేల ఎకరాల్లో విస్తరించి ఉంది. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్క్ యొక్క బాగోగులను పర్యవేక్షిస్తుంది.
మహావీర్ హరిణ వనస్థలి పార్క్ లో కెమెరాకు చిక్కిన అందమైన పక్షి
చిత్ర కృప : J.M.Garg
నిజాం కాలంలో ఈ ప్రదేశాన్ని శికార్ గర్ అని పిలిచేవారు. అప్పుడంతా ఈ ప్రదేశం అరణ్యాలతో, జంతువులతో నిండి ఉండేది. వారు ఏమాత్రం తీరిక దొరికిన వేటాడటానికి వచ్చేవారు. హైదరాబాద్ పాలకులలో చివరి వాడైన నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వేటాడడానికి వుపయోగించిన దట్టమైన ఈఅటవీ ప్రాంతమే ప్రస్తుతం వున్న ఈ జింకల పార్కు.
సందర్శన శాల
పార్క్ ఆవరణలో సందర్శన శాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యార్థులు కూర్చొని చదువుకునేందుకు లేదా యాత్రికులు కూర్చొనేందుకు తగిన ఏర్పాట్లు ఉన్నాయి. పాము, తాబేలు, నెమలి, ముంగీస, మొసలి, ఎలుగుబంటీ, జింక మొదలైన జంతువుల బొమ్మలు కనిపిస్తాయి. లోపల ఒక మినీ ధియేటర్ కూడా ఉంది. విద్యార్థులు లేదా యాత్రికులు ధియేటర్ లో కూర్చొని జంతువుల ప్రదర్శన చూడవచ్చు.
మహావీర్ హరిణ వనస్థలి పార్క్ లోని సీతాకోక చిలుకల పార్క్
చిత్ర కృప : Santosh Kumar
సీతాకోక చిలుకల పార్క్
పార్క్ లో చూడవలసిన మరో ప్రదేశం సీతాకోక చిలుకల పార్క్. వివిధ రకాల పూల మొక్కలు ఇక్కడ చూడవచ్చు. సుమారు 20 నుండి 30 రకాల సీతాకోక చిలుకలను పార్క్ లో చూడవచ్చు.
జంగల్ సఫారీ
జాతీయ పార్క్ లో బస్సు సఫారీ ప్రత్యేక ఆకర్షణ. సుమారు 3 కిలోమీటర్ల మేర బస్సు సఫారీ ఆనందించవచ్చు. మొసలి, పాములు, దుప్పులు, జింకలు, అడవి పందులు, నెమళ్ళు, కోతులు మొదలైన వన్య జంతువులను బస్సులో నుంచి తిలకించవచ్చు.
మహావీర్ హరిణ వనస్థలి పార్క్ సఫారీ
చిత్ర కృప : vijay MENON
ఈ జంతువుల పార్క్ ని వర్ధమాన మహావీర్ జ్ఞాపకార్థం 'మహావీర్ హరిణ వనస్థలి' గా 1994 వ సంవత్సరంలో జాతీయ పార్క్ గా గుర్తించారు. ఇందులో వవన్య జంతువులే కాక ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. వీటిని విరివిగా ఆయుర్వేద, అల్లోపతి మందులలో వినియోగిస్తుంటారు.
ఇది కూడా చదవండి : హైదరాబాద్ సమీపంలో గల జలపాతాలు !
ఏటా పార్క్ వారోత్సవాల సమయంలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తారు. పర్యాటకుల వినోదార్థం ఇక్కడ వసతి గృహాలు, హోటళ్లు ఉన్నాయి . కార్తీక మాసం సమయంలో ఇక్కడ వన భోజనాలు సైతం జరుగుతాయి.
సందర్శించు సమయం : ఉదయం 9 గంటల నుండి 6 గంటల వరకు
ప్రవేశ రుసుము : ఇదివరకు రూ. 10/- తో లోనికి అనుమతి + బస్సు సఫారీ ఉండేది. కానీ, మొన్నీమధ్యనే లోనికి ప్రవేశం రూ. 10/-గా , బస్సు సఫారీ రూ. 20/- గా నిర్ధారించారు.
వనస్థలిపురం ఆలయం
చిత్ర కృప : Bhaskaranaidu
ఆలయాలు
వనస్థలి పురం లో ఆలయాలకు కొదువ రాలేదు. సాయిబాబా ఆలయం, పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం, గణేశా ఆలయం, పరమేశ్వరి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం ,రాముని గుడి, ఎల్లమ్మ గుడి ఉన్నాయి. పక్కనే ఉన్న పెద్ద గుట్టపై సోమనాథ ఆశ్రయం కలదు. ఇక్కడ శివరాత్రి నందు పెద్ద ఉత్సవం జరుగుతుంది.
వనస్థలిపురం వెళ్లే రోడ్డు మార్గం
చిత్ర కృప : prashanth reddy
వనస్థలిపురం ఎలా చేరుకోవాలి ?
హైదరాబాద్ లోని అన్ని ప్రదేశాల నుండి వనస్థలి పురం చేరుకోవటానికి సిటీ బస్సులు లభ్యమవుతాయి. కోఠి నుండి 100V నెంబర్ గల బస్సు, సికింద్రాబాద్ నుండి 1V నెంబర్ బస్సు, మెహదీపట్నం నుండి 156V బస్సు మరియు కెపిహెబి కాలనీ నుండి 187D/V బస్సులు వనస్థలిపురం వెళతాయి.
ఇక్కడ క్లిక్ చేయండి : హైదరాబాద్ ఎలా చేరుకోవాలి ?