శ్రీ వేంకటేశ్వరుడు తన భక్తులను దుష్టుల నుండి కాపాడటం కోసం ... వారి పాపాలను హరించి వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం కొన్ని పవిత్ర ప్రదేశాలలో వెలుస్తుంటాడు. అలాంటి ప్రదేశాలలో ఒకటి 'మన్యంకొండ'.
మన్యంకొండ ను భక్తులు 'పేదల తిరుపతి' అని, 'రెండవ తిరుపతి' అని, 'తెలంగాణ తిరుపతి' అని, 'చిన్న తిరుపతి' అని, 'పాలమూరు తిరుపతి' అని పిలుస్తుంటారు. ఈ క్షేత్రం మహబూబ్ నగర్ కు 17 కిలోమీటర్ల దూరంలో, మహబూబ్ నగర్ - రాయచూర్ వెళ్లే మార్గంలో కలదు.
సిద్దులు, మునీశ్వరులు వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారని అందుకే అప్పట్లో దీనిని 'మునుల కొండ' అని పిలిచారని, ఆతర్వాత అరణ్యప్రాంతంలో ఉండటంతో 'మన్యంకొండ' గా పేరు నిలిచిపోయిందని ఇక్కడివారు చెబుతారు.
ఇది కూడా చదవండి : ప్రకృతి అందాల ... దేవచర్ల !
ఆలయ చరిత్ర
మొదటిది
అలహరి కేశవయ్య నిద్రిస్తున్న సమయంలో శ్రీనివాసుడు ప్రత్యేక్షమై, కృష్ణా నది తీరాన గల మునుల కొండ వద్ద నేను స్వయంభూవుగా వెలిశాను. నీవు వెంటనే అక్కడికి వెళ్లి ప్రతిరోజూ దూపదీపనైవేద్యాలతో నా సేవలో తరించు అని చెప్పాడట. కేశవయ్య తన భార్యా పిల్లలతో కలిసి మునులకొండ చేరుకొని స్వామి వారికి సేవ చేసుకున్నాడని ప్రతీతి.
చిత్రకృప :Ramesh Dhobi
ఆలయ చరిత్ర
రెండవది
ఒక ముసలావిడ తరచూ శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్లివచ్చేది. ఓసారి తిరుపతి వెళ్లివస్తుండగా అలసిపోయిన ఆ ముసలావిడ - స్వామీ ! నీ దర్శనం కోసం ఇంతదూరం రాలేకపోతున్నాము, మాకు చేరువలో ఎక్కడైనా దర్శనం ఇవ్వాలని ప్రార్థించగా, మన్యంకొండ లో నేను స్వయంభూవుగా వెలిశానని, అక్కడి కి వెళ్లి నా దర్శనం చేసుకో అని శ్రీవారు చెప్పారని అక్కడి స్థానికుల కధనం.
చిత్రకృప :Madhavi Kuram
క్షేత్ర విశేషాలు
మన్యంకొండ క్షేత్రం అచ్చం తిరుమల శ్రీవారి క్షేత్రాన్ని పోలి ఉంటుంది. కొండ చిన్నదైనప్పటికీ ఒకవైపు మెట్ల మార్గం, మరోవైపు ఘాట్ రోడ్డు మార్గం ఉన్నాయి. ఏడు ద్వారాలు దాటి వెంకటేశ్వరున్ని ఎలా దర్శించుకుంటున్నామో, అలాగే మన్యంకొండ లో కూడా ఏడు ద్వారాలు దాటి కొండగుహలో ఆదిశేషుని పడగనీడలో శ్రీ లక్ష్మి సమేతుడైన శ్రీనివాసుడిని దర్శించుకోవాలి. తిరుమల లాగే భక్తులు తలనీలాలను చెల్లిస్తుంటారు.
చిత్రకృప : wikipidia
స్వామివారి మహిమలు
కొండపై గల స్వామి వారికి ఎక్కడ లేని ప్రత్యేకతలు ఉన్నాయి. చెయ్యని పాదాలు, తవ్వని కోనేరు, కట్టని గుడి, ఉలితో చెక్కని విగ్రహం లా స్వామి వారు ఇక్కడ దర్శనమిస్తాడు. అందుకే ఈ దేవాలయానికి ఎక్కడలేని ప్రతేకత సంతరించుకుంది.
చిత్రకృప :Manohar Borancha
స్వామివారి మహిమలు
కొండ దిగువన ఉన్న అలివేలు మంగమ్మ అమ్మవారిని తప్పక దర్శించాలి. కొండ మార్గాన ఒకవైపు శ్రీవారి అడుగులు కనిపిస్తాయి. బహుశా శ్రీవారు ఇదే దారిన కొండపైకి చేరుకొనిఉంటారు. కొండపై పరిసరాలు భక్తులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
చిత్రకృప : wikipidia
బ్రహ్మోత్సవాలు
స్వామివారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఏటా ఉత్సవాలు మాఘశుద్ధ దశమి నాడు ప్రారంభమై మాఘ బహుళ విదియ వరకు ఎనిమిది రోజులు పాటు నిర్వహిస్తారు. ఆ సమయంలో రోజుకోరోజు ఉత్సవమూర్తిని అలంకరిస్తారు, కళ్యాణోత్సవం జరిపిస్తారు.
చిత్రకృప :Madhavi Kuram
వసతి సదుపాయాలు
యాత్రికులు బస చేయటానికి సత్రాలు ఉన్నాయి. ఇక్కడ సత్రాలు అందుబాటు ధరల్లో లభిస్తాయి. ఏసీ గదులు, డీలక్స్ గదులు కోరుకొనేవారు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహబూబ్ నగర్ లో బస చేయవచ్చు.
చిత్రకృప :Rajib Ghosh
మన్యంకొండ ఎలా చేరుకోవాలి ?
మహబూబ్ నగర్ నుండి రాయచూర్ వెళ్లే బస్సులలో ఎక్కితే మన్యంకొండ చేరుకోవచ్చు.
హైదరాబాద్ నుండి రాయచూర్, నారాయణపేట, ఆత్మకూర్ వెళ్లే బస్సులలో ఎక్కినా మన్యంకొండ వెళ్ళవచ్చు.
మన్యంకొండలో రైల్వే స్టేషన్ కలదు. గద్వాల్, కాచిగూడ, సికింద్రాబాద్, గుంటూరు ప్రాంతాల నుండి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి.
కొండ కింద నుండి పైకి చేరుకోవటానికి ఉచిత బస్సులు, ఆటోలు, ప్రవేట్ వాహనాలు కలవు.