ఆదోని ... కర్నూలు జిల్లాకు చెందిన ముఖ్య పట్టణం మరియు జిల్లాలోని అతిపెద్ద పట్టణాలలో మూడవది (మొదటిది - కర్నూలు, రెండవది - నంద్యాల). ఈ పట్టణం కర్నూలు నగరానికి 97 కిలోమీటర్ల దూరంలో, నంద్యాల పట్టణానికి 165 కిలోమీటర్ల దూరంలో కలదు. కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు ప్రాంతానికి చేరువలో ఈ పట్టణం ఉంది కనుక ఇక్కడి ప్రజలు తెలుగు, ఉర్దూ తో పాటు కన్నడ భాష మాట్లాడుతారు.
ఆదోని బంగారు, బట్టల మార్కెట్ కు ప్రసిద్ధి చెందినది. వందకు పైగా ప్రత్తి మిల్లులు, నూలు మిల్లులు ఇక్కడ ఉన్నాయి (ప్రస్తుతం వీటిలో కొన్ని మూతపడ్డాయి). అప్పట్లో దీనికి "దక్షిణ భారతదేశపు ముంబై" గా, 'రెండో ముంబై' గా పేరుండేది. దక్షిణాది దేశపు ధాన్యపు మార్కెట్ గా కూడా ప్రసిద్ధి చెందింది. ఆదోని లో మరియు చుట్టుప్రక్కల చూడటానికి అనేక పర్యాటక ప్రదేశాలు, దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటి వివరాలలోకి వెళితే ...
నవాబు హాలు, ఆదోని కోట
చిత్రకృప : S. Praveen Bharadhwaj
ఆదోని కోట
ఆదోని క్రీ.పూ. 1200 బీదర్ రాజు భీం సింగ్ పాలనలో చంద్రసేనుడు స్థాపించాడని ప్రతీతి. ఆతరువాత విజయనగర రాజులు, తళ్ళికోట యుద్ధం తర్వాత అదిల్ షా పాలనలోకి వెళ్ళిపోయింది. అదిల్ షా వంశపాలకులు ఆదోని కోటకు మరమ్మత్తులు చేయించి పటిష్టం చేశారు. కోటలో 4 వేలమంది అశ్వదళాలు, 8 వేలమంది సైన్య దళాలు ఉండేవి.
16 వ శతాబ్దంలో ఔరంగజేబు దుర్గం పై దండెత్తి వశపర్చుకొని, మొఘల్ రాజ్యంలో కలిపేసాడు. మొఘల్ సామ్రాజ్యం అస్తమించిన తర్వాత ఆదోని సామంతరాజ్యమైంది. నిజాం ప్రభువులు కూడా ఆదోని కోటను రాజధానిగా చేసుకొని ఈ ప్రాంతాన్ని పాలించారు. 17 వ శతాబ్దంలో టిప్పు కోట మీద దండెత్తి కొల్లగొట్టాడు. సంధి జరిగిన తర్వాత నిజాం కే తిరిగి ఇచ్చివేశాడు. 18 వ శకం ఆరంభంలో నిజాం ఆదోని కోటను ఆంగ్లేయులకు ఇచ్చివేసిరి.
కోట పశ్చిమ ద్వారం
చిత్రకృప : S. Praveen Bharadhwaj
ఆదోనికి క్రీ.శ. 16 వ శతాబ్దంలో యాదవులు పాలించేవారు. అప్పుడు దీనిని యాదవగిరి అని పిలిచేవారు. ముస్లిం ల పాలనలోకి వచ్చేసరికి ఆదవోని అని అయ్యింది. బ్రిటీష్ కాలంలో మద్రాస్ ప్రావిడెన్సీ లోని బళ్ళారి జిల్లాలో ఆదోని ఉండేది.
కోట 800 -900 అడుగుల ఎత్తులో మూడువేల ఎకరాలపైగా విస్తీర్ణంలో 50 కిలోమీటర్ల చుట్టుకొలతలో నిర్మించారు. కోట 7 వృత్తయేలా కోట గోడలు, 12 కోటలు కలిగిఉండేది. ఒక్కో కోట గోడ మందం 25-35 అడుగులు. శత్రువులు కూడా చొరబడలేని విధంగా దీనిని కట్టించారు.
కొండ మీదకి చేరుకోవటానికి మెట్లు
చిత్రకృప : RameshSharma1
దేవాలయం
ఆదోని పట్టణానికి సమీపంలో గల రణమండల ఆంజనేయస్వామి దేవాలయం ఒక గట్టుపై ఉన్నది. రాముడు తపస్సు చేస్తున్న సమయంలో రాక్షసులు భంగం కలిగిస్తున్నారని గమనించిన ఆంజనేయుడు వారిని ఇక్కడే సంహరిస్తాడు. అందుకే ఈ ప్రదేశానికి రణ మండల అని పేరు. సందర్శించు సమయం : ఉదయం 7 నుండి రాత్రి 8 గంటల వరకు.
కొండమీదకు ఎక్కేందుకు 600 మెట్లు ఎక్కాల్సిఉంటుంది. ప్రతిసంవత్సరం శ్రావణ మాసంలో శ్రీరణమండల వీరాంజనేయస్వామివారికి ఉత్సవాలు జరుగుతాయి.
దేవాలయం సన్నిధి
చిత్రకృప : RameshSharma1
కొండగట్టు మీద ఇతర దేవాలయాలు : శ్రీవామన తీర్థుల బృందావనం, శివమారుతీ ఆలయం, వినాయకుని విగ్రహం, నందీశ్వరుని విగ్రహం, శివాలయం, శ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయసమేత రామాలయం, అమ్మవారి సన్నిధి, గణేశ మందిరం, శ్రీవేణుగోపాలా స్వామి ఆలయం, నవ తీయత హనుమాన్ ఆలయం దర్శించదగ్గవి. అలాగే పట్టణంలో షాహి జామియా మసీద్ చూడదగ్గది.
శ్రీభగవాన్ మహా యోగి లక్ష్మమ్మ
చిత్రకృప : RameshSharma1
శ్రీభగవాన్ మహా యోగి లక్ష్మమ్మ అవ్వ
శ్రీమహాయోగి లక్ష్మమ్మ వారు ఆదోనికి 7 కి. మీ ల దూరంలో ఉండే మూసానిపల్లె లో జన్మించారు. బాల్యం నుంచే అవధూతగా సంచరిస్తూ ఉండేవారు. లక్ష్మమ్మ అవ్వ ను మొదట పిచ్చిదని భావించినవారు ఆతర్వాత జరిగిన కొన్ని సంఘటనల ఫలితంగా నిజమైన శక్తులు ఉన్నాయని తెలుసుకొని ఆమె సేవలో తరించారు. శ్రీభగవాన్ మహా యోగి లక్ష్మమ్మ అవ్వ కు దేవాలయాన్ని నిర్మించి ఏటా రథోత్సవాలను నిర్వహిస్తున్నారు ఆదోని వాసులు. ఈ ఉత్సవాలను తిలకించటానికి బళ్ళారి, కర్నూలు, రాయచూర్, అనంతపురం, మహబూబ్ నగర్ నగర్ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు.
రోమన్ క్యాథలిక్ చర్చి
చిత్రకృప : ArnoldPlaton
చర్చి
కొన్ని ఏళ్ళ క్రితం ఇక్కడ చర్చి లు ఉండేవి కావు. గోవా నుండి గుర్రపు బండ్ల పై వచ్చి ఫాదర్స్ క్రీస్తు సందేశాలను వినిపించేవారు. వారు రాయల సీమలో క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయాలనే భావనతో క్రీ.శ. 1690 లో రోమన్ క్యాథలిక్ చర్చి ని శుక్రవార పేటలో స్థాపించారు. దీనికి అనుబంధంగా బోర్డింగ్ స్కూల్ ను నడుపుతున్నారు.
ఆదోని చుట్టుపక్కల గల దర్శనీయ స్థలాలు : మంత్రాలయం, ఉరుకుంద స్వామి సన్నిధి.
మంత్రాలయం గురించి ఇక్కడ క్లిక్ చేయండి.
ఉరుకుందస్వామి సన్నిధి గురించి ఇక్కడ క్లిక్ చేయండి.
వసతి : ఆదోని లో ఉండటానికి 2 స్టార్, 3 స్టార్ హోటళ్లు, లాడ్జీలు ఉన్నాయి. వాటిలో లగ్జరీ, ఏసీ, నాన్ ఏసీ గదులతో పాటు డీలక్స్, సెమీ డీలక్స్ గదులు అద్దెకు దొరుకుతాయి. వెజ్, నాన్ - వెజ్ భోజనాలు రుచికరంగా ఉంటాయి.
ఆదోని రైల్వే స్టేషన్
చిత్రకృప : Jpullokaran
ఆదోని ఎలా చేరుకోవాలి ?
విమానాశ్రయం : బళ్లారి విమానాశ్రయం సమీపాన కలదు. ఎయిర్ పోర్ట్ నుండి 66 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదోని చేరుకోవటానికి టాక్సీ, క్యాబ్ సదుపాయాలూ ఉన్నాయి.
రైల్వే స్టేషన్ : ఆదోని లో రైల్వే స్టేషన్ కలదు. ఈ స్టేషన్ నుండి దేశంలోని ప్రధాన నగరాలకు రైలు సౌకర్యం ఉన్నది. ముంబై, హుబ్లీ, బళ్లారి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల నుండి రైళ్ళు వస్తుంటాయి.
బస్సు మార్గం : కర్నూలు, నంద్యాల, ఆదోని, రాయచూర్, బెంగళూరు, హైదరాబాద్ మరియు సమీప నగరాల నుండి ఆదోని పట్టణానికి ప్రభుత్వ/ప్రవేట్ బస్సులు దొరుకుతాయి.