ఇంతవరకు మనము శివాలయాలను అందులోని శివలింగాలను చూసి ఉంటాం. దాదాపు ప్రతి చిన్న, పెద్ద శివాలయాలలో శివలింగాలను దర్శించి ఉంటాం. సాధారణంగా ప్రతి శివాలయంలో శివలింగం లేదా శివుని ప్రతిమ (విగ్రహం) ఉండటం సహజం అవునా ? కానీ ... ఒక దేవాలయం ఉంది. పేరుకు శివాలయాలమే కానీ శివలింగం ఉండదు. అదేంటో తెలుసుకుందామా.. !
ఈ అరుదైన శివాలయం కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లాలో కలదు. త్రిశూర్ పట్టణాన్ని కేరళ రాష్ట్ర సాంస్కృతిక రాజధాని అని అభివర్ణిస్తారు కారణం ఎందరో కవులు, మరెందరో సాహితీవేత్తలు ఈ జిల్లాలో పుట్టారు. త్రిశూర్ అన్న పేరు పట్టణంలో కొలువైన శివుని ఆలయం పేరు మీద వచ్చిందని చెబుతారు.
త్రిశూర్ - మహాశివుడు కొలువైన ప్రాంతం. ఇక్కడున్న వడ్డక్కుంనాథన్ దేవాలయం పరమశివుడికి అంకితం చేయబడింది. దీనిని స్వయాన పరుశురాముడు నిర్మించాడని పురాణ గాధ.
వడ్డక్కుంనాథన్ దేవాలయం, త్రిశూర్
చిత్ర కృప : Rameshng
వడ్డక్కుంనాథన్ దేవాలయం
పురాతన మరియు చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్న వడ్డక్కుంనాథన్ దేవాలయం అనేక కళలకు నిలయం. ఇది చాలా పురాతన ఆలయం కదా మరి పరుశురాముడు ఇక్కడ శివలింగం ప్రతిష్టించలేదా ? అన్ని చోట్లా ప్రతిష్టించి ఇక్కడ ఒక్కటే ప్రతిష్టించకపోవడానికి కారణం ఏమిటి ? మరిచిపోయాడా ? లేక మరేదైనానా ? ఇలా ఏమైనా ఆలోచిస్తున్నారా ? దయచేసి ఆలోచించకండి. ఇక్కడ శివలింగం ఉంది!!
ఇది కూడా చదవండి : త్రిశూర్ వేడుకలు - ఏనుగుల పండగ !
ఆలయంలోని శివలింగానికి వందల ఏళ్లుగా నెయ్యితో అభిషేకాలు చేయగా చేయగా అది ఒక పెద్ద గుట్టలా పేరుకుపోయిందని అంటారు. సుమారు అయిదారు మీటర్ల ఎత్తున్న నెయ్యిగుట్ట శివలింగాన్ని పూర్తిగా కప్పేసిందట. దాని కింద శివలింగం ఉందట.
అందంగా ముస్తాబైన ఏనుగులు
చిత్ర కృప : Manojk
ఆలయ ప్రత్యేకత
మంట ఉండే చోట నెయ్యిని వేడి చేస్తే అది కరుగుతుంది వాసనను వెదజల్లుతుంది అవునా ? కానీ ఈ నెయ్యిగుట్ట మండే ఎండల్లోనూ కరగదు, వాసననూ వెదజల్లదు. అంతేకాదు సంవత్సరం లోపు పిల్లలను గుడిలోకి రానివ్వరు. గుడిలోకి ప్రవేశించాలంటే సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి.
ఉత్సవాలు
వడ్డక్కుంనాథన్ దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం ఘనంగా నిర్వహిస్తారు. ఆరోజున భక్తులు లక్ష దీపాలను వెలిగించి తమ జీవితాలలో కూడా ఇలాగే వెలుగునివ్వాలని ప్రార్థిస్తారు. బహుశా భూమి మీద శివలింగం కనపడని ఏకైక శివాలయం ఇదొక్కటేనేమో!
మహాశివరాత్రి నాడు ముస్తాబైన ఆలయం
చిత్ర కృప : Adarsh Padmanabhan
త్రిశూర్ ఇతర ఆకర్షణలు
దైవత్వం, ప్రకృతి మరియు సంస్కృతి ల సమ్మేళనం త్రిశూర్ నగరం. ఈ ప్రాంతం లో ఉండే ప్రాచీన ప్రార్ధనా స్థలాల నిర్మాణ కళలు, దస్తావేజులలో, మ్యూజియం ల లో పొందుపరచిన చారిత్రక సమాచారం, మరెన్నో తరచి తరచి చెప్పించుకోవాలనే విశేషాలు పర్యాటకులలో ఉన్న ఉహాశక్తి ని చైతన్యపరుస్తాయి. ఎన్నో జలపాతాలు, బీచ్ లు, డ్యాం వంటి వివిధ ఆకర్షణలతో ఈ ప్రాంతం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది.
టౌన్ హాల్, త్రిశూర్
చిత్ర కృప : കാക്കര
పట్టణంలోని సందర్శనీయ స్థలాలు
అరట్టుపూజ ఆలయం, కేరళ కళామండలం, పరంకేవు భగవతి ఆలయం, తిరువంబడి కృష్ణ ఆలయం, తిరువిల్వమల, పుతేన్ పల్లి, శక్తాన్ తంపురన్ ప్యాలెస్, పిచీ డ్యాం, పరాంబిక్కులం వన్య ప్రాణి అభయారణ్యం, చవక్కడ్ బీచ్, బైబిల్ టవర్, ఆర్కె లాజికల్ మ్యూజియం మొదలైనవి చూడదగ్గవి.
త్రిశూర్ రైల్వే స్టేషన్
చిత్ర కృప : Arjuncm3
త్రిశూర్ ఎలా చేరుకోవాలి ?
వాయు మార్గం : త్రిశూర్ కు సమీపాన 58 కిలోమీటర్ల దూరంలో కొచ్చి అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కలదు. ఇక్కడికి దేశ, విదేశాల నుండి విమానాలు వస్తుంటాయి. క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని త్రిశూర్ వెళ్ళవచ్చు.
రైలు మార్గం : త్రిశూర్ లో రైల్వే స్టేషన్ కలదు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, తిరువేండ్రం తదితర ప్రాంతాల నుండి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి.
రోడ్డు మార్గం : కేరళ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి త్రిశూర్ కు బస్సులు వస్తుంటాయి.