తెలంగాణాలో ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రాల్లో అతి పురాతనమైన ఆలయం ఓదేల మల్లన్న ఆలయం. తెలంగాణ శ్రీశైలం మల్లికార్జున స్వామిగా ఈ మల్లన్న స్వామి పూజలందుకుంటున్నారు. ఎందుకంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి, ఓదెల మల్లికార్జునస్వామి ఆలయానికి చాలా దగ్గరి పోలికలున్నాయి. ఈ రెండు ఆలయాలు ఒకే కాలం నాటివని ప్రచారం లో ఉంది. ఈ ఆలయంలో వెలసిన శివలింగానికి ఒక పురాణ గాథ ఉంది. మరి ఆ స్థల పురాణం ఏంటి? ఇంకా ఈ ఆలయ విశేషాలు ఏంటో తెలుసుకుందాం...
ఓదెల గ్రామానికి కొంత దూరంలో శ్రీ మల్లికార్జునస్వామి వారి ఆలయం
తెలంగాణ రాష్ట్రంలో, కరీంనగర్ జిల్లా, ఓదెల మండలంలోని ఓదెల గ్రామానికి కొంత దూరంలో శ్రీ మల్లికార్జునస్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయం ఓదెల మల్లన్న స్వామిగా ప్రసిద్ది. భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ఈ ఆలయ నిర్మాణక్రమం, స్తంభ వర్ణ శిలల శిల్పాల ఆధారంగా చాళుక్యుల కాలంలోనే నిర్మింపబడి,క్రీ.శ.1300 మధ్యకాలంలో కాకతీయుల కాలంలో ఆలయాన్ని పునర్నిర్మాణం చేసినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి.
Image source: www.facebook.com/OdelaMallanna
స్థలపురాణం
ఇక్కడ స్వయంభూలింగంగా వెలసిన మహాశివుణ్ని పంకజ మహామునీశ్వరుడు నిత్యం కొలుస్తూ తపస్సు చేసేవాడని ప్రతీతి. ఆయన తర్వాత పూజ చేసేవారు లేక శివలింగంపై పెద్ద ఎత్తున పుట్ట పెరిగిపోయింది. అయితే చింత గుట్ట ఓదెలు అనే రైతు సేద్యం చేస్తుండగా..నాగలి కర్ర పుట్టలోని శివలింగానికి తగిలిందట, ఆ తాకిన గాయం ఇప్పటికీ శివలింగంపై ఉన్నట్లుగా చెబుతారు. ఒక్కసారిగా కాంతి రేఖలు విరజిమ్మి ఓంకార శబ్దం వినిపించిందని ప్రతీతి.
ఓదెలు పేరు మీద స్వామి అక్కడే మల్లికార్జున స్వామిగా
ఓదెలు పేరు మీద స్వామి అక్కడే మల్లికార్జున స్వామిగా కొలువై శరణన్నవారికి కష్టాలు తీరుస్తున్నాడని భక్తుల విశ్వాసం
Image source: youtube
శ్రీ బ్రమరాంభక సమేత మల్లన్న ఆలయంలో
శ్రీ బ్రమరాంభక సమేత మల్లన్న ఆలయంలో ఉత్తర దిశగా వీరభద్ర స్వామి ఆలయం, ఖండేశ్వర స్వామి, మెడలాదేవి, కేతమ్మల విగ్రహాలు కూడా ఉన్నాయి. అపరభక్తులైన కొండవీటి వంశంలో మల్లన్న ఖండేశ్వరుడిగా అవతరించాడు.
Image source: wikipedia.org
కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా
బలిజ వంశానికి చెందిన మెడలాదేవీ, యాదవ కులానికి చెందిన కేతమ్మలనే కన్యలు ఖండేశ్వరస్వామిని భక్తితో సేవించి ఆయనలో లీనమయ్యారు. ఇందుకు తార్కాణంగానే ఆ ఆలయానికి ఈశాన్యదిశలో ఖండేశ్వర స్వామి, మేడలాదేవి, కేతమ్మల విగ్రహాలు ప్రతిష్టించారనీ పండితులు చెబుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా ప్రఖ్యాతిగాంచిన ఈ ఆలయానికి జిల్లా నలుమూల నుండి కాక ఇతర జిల్లాల నుండి, మహారాష్ట్ర నుండి కూడా భక్తులు తరలి వస్తుంటారు.
ఏటా ఉగాది నుండి బ్రహ్మోత్సవాలు
ఈ ఆలయంలో ఏటా ఉగాది నుండి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అనంతరం 5 మాసాలపాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే జూలై నెలలో జరిగే పెద్దపట్నం, అగ్రిగుండం బ్రహోత్సవాలతో ముగుస్తుంది. ఈ ఆలయంలో వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారంగా శ్రీశైల పండితారాధ్య పీఠానికి చెందిన వృభ గోత్రోద్భవులైన మహేశ్వరులచే స్వామి వారికి నిత్య పూజలు నిర్వహిస్తారు.
Image source: www.facebook.com/OdelaMallanna
ప్రతి సంవత్సరం మహా శివరాత్రితో మొదలయ్యే ఈ జాతర పెద్దపట్నం
ప్రతి సంవత్సరం ఈ దేవాలయంలో జరిగే జాతరకు పెద్దపల్లి జిల్లా నుండేకాక సరిహద్దు జిల్లాలైన కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతోపాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి భక్తులు తండోపతండాలుగా వస్తారు. ప్రతి సంవత్సరం మహా శివరాత్రితో మొదలయ్యే ఈ జాతర పెద్దపట్నం అనే కార్యక్రమంతో ముగుస్తుంది.
Image source: youtube
మరో పురాణగాథ -సీతారాములు నడయాడిన ప్రదేశం:
రాముడు వనవాసం చేసిన కాలంలో సాక్షాత్తూ ఆ శ్రీరాముడు దర్శించి కొలిచిన సర్వేశ్వరుడు..ఓదెల మల్లన్న. శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రదేశంలో సేద తీరినందువల్ల ఆ సమయంలో సీతారాములు కొలిచిన దేవుడనేందుకు నిదర్శనంగా స్వామివారి మల్లన్న ఆలయానికి సమాంతరంగా శ్రీసీతారమచంద్రస్వామి ఆలయాన్ని కూడ ప్రతి ష్టించినట్టు స్థల పురాణం చెబుతుంది. గత యాభై ఏళ్లుగా దేవదాయదర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్న మల్లన్న ఆలయం క్రమేణా అభివృద్ది చెందుతూ భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగావిలసిల్లుతోంది.
ఆదాధనలు, అభిషేకాలు:
ఫిబ్రవరి నెలలో నిర్వహించే బ్రహ్మోత్సవాల సందర్భంగా మల్లికార్జున స్వామి -భ్రమరాంబ దేవిల కల్యాణ మహోత్సవం అత్యంత రమణీయంగా జరుగుతుంది. కార్తీక, శ్రావణ మాసాల్లో జరిపే ప్రత్యేక పూజలు మహాశివరాత్రి సందర్బంగా నిర్వహించే మహారుద్రాభిషేకాలు విశిష్టతను సంతరించుకుంటాయి. మల్లికార్జున స్వామి జాతర ప్రతి ఏడాది జరుగుతుంది. జాతర ముగింపులో బ్రహ్మోత్సవాలు, పెద్దపట్నం, అగ్నిగుండం మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. జాతర సమయంలో భక్తులు అనేక దూర ప్రాంతాల నుండి వచ్చి తమ మొక్కుబడులు తీర్చుకుంటుంటారు, పట్నాలు, బోనాలు, కోడెమొక్కులు సమర్పించి భక్తులు తరిస్తుంటారు.
Image source:youtube
ప్రతి ఆది, బుధవారాల్లో సందడి
మల్లికార్జునస్వామి జాతర ప్రతి ఏడాది ఉగాది పర్వ దినంతో మొదలై జులై మాసంలో జరిగే పెద్దపట్నం, అగ్రిగుండం బ్రహ్మోత్సవాలతో జాతర ముగుస్తుంది. శ్రీబ్రమరాంభ సమేత మల్లన్న ఆలయంలో ఉత్తర దిశగా వీరభద్ర స్వామి ఆలయం, ఖండేశ్వరస్వామి, మేడుదులదేవి, కేతమ్మల విగ్రహాలున్నాయి. అలాగే మధునం పోచమ్మ, బంగారు పోచమ్మల ఆలయాల్లో కూడ భక్తులు మొక్కులు సమర్పిస్తారు. ఈ ఆలయానికి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్గడ్ తదితర ప్రాంతాల నుంచి కూడ రైలు, బస్సు మార్గాల్లో యాత్రికులు తరలి వస్తుంటారు. పట్నాలు, బోనాలు, కోడె మొక్కులు సమర్పించి తరిస్తుంటారు.
Image source: youtube
ఉత్సవాల వివరాలు
శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో ప్రతి రోజు ఉదయం 5గంటలకు ప్రాతఃకాల మేలు కొలుపు, మంగళ వాయిద్యసేవ, సుప్రభాత సేవ, గంగాసేకరణ, ప్రాతఃకాల పూజ, భక్తులకు స్వామి దర్శనం.
మధ్యాహ్నం: స్వామి వారికి అన్నపూజ, మహా నివేదన, హారతి, అనంతరం ద్వార బంధనం.
ఉదయం: పదిన్నరకు స్వామివారికి నిత్య కల్యాణం, అభిషేకాలు
సాయంత్రం: 4గంటలకు హారతి అనంతరం భక్తుల స్వామి దర్శనం, 6నుంచి 7వరకు ప్రదోశకాల పూజ, ఆరగింపు, హారతి అనంతరం ద్వార బంధనం.
Image source: youtube
ఉత్సవాల వివరాలు
మహా శివరాత్రికి, ఉగాది పర్వదినాలతో పాటు ప్రతి పండగ సమయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. మహాశివరాత్రికి మూడు రోజుల పాటు కల్యాణోత్సవం, స్వామివారి గ్రామసేవ, గ్రామ పర్యటన చేపడతారు. ఏటా ఉగాది నుంచి జులై మాసం వరకు జాతర జరుగుతుంది. జాతర ముగింపులో బ్రహ్మోత్సవాలు, పెద్దపట్నం, అగ్నిగుండ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
Image source: youtube
ఎలా వెళ్లాలి:
కరీంనగర్ జిల్లాకు సుమారు 40కిలోమీటర్ల దూరంలో శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రం ఉంది. రైలు, రోడ్డు మార్గాల ద్వారా ప్రయాణించి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. కరీంనగర్ బస్సు డిపో నుండి పెద్దపల్లి చేరుకునే ప్రతి బస్సూ ఓదెల మీదుగానే వెళుతుంది. వరంగల్ జిల్లా నుండి 60కిలోమీటర్ల రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి ఇక్కడకు చేరుకోవచ్చు.
image source:wikipedia.org