భక్తులు మొదట నెట్టి కంటి ఆంజనేయస్వామి వారిని దర్శించుకొన్న తర్వాత, ఆలయానికి దగ్గరలోని గుట్టపై వెలిసిన బాల ఆంజనేయస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. ప్రధాన ఆలయం నుండి కొద్ది దూరంలో ఒక గుట్టపై ఉన్న కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని కూడా భక్తులు దర్శిస్తారు. ఇంకా కసాపురం నుండి తిరుగు ప్రయాణంలో గుంతకల్ వెళ్లే మార్గంలో శనీశ్వరుని ఆలయం మరియు అయ్యప్ప స్వామి ఆలయం కూడా గమనించవచ్చు. మీకు సమయం కుదిరితే 14 కిలోమీటర్ల దూరంలోని చిప్పగిరి లో గల శ్రీ భోగేశ్వర స్వామి వారి ఆలయం కూడా దర్శించండి. కసాపురం నెట్టి కంటి ఆంజనేయస్వామి ఆలయ మహత్యం విషయాలకొస్తే ..
రాష్ట్రంలో ఉన్న ఆంజనేయస్వామి భక్తులకు సుపరిచితమైన పేరు శ్రీ నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం. ఈ ఆంజనేయస్వామి ఆలయం, అనంతపురం జిల్లాలోని గుంతకల్ పట్టణంలో గల కసాపురం అనే గ్రామంలో ఉన్నది. ఈ ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు, పక్క రాష్ట్రమైన కర్నాటక నుండి కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. అన్నట్టు ఈ ఆలయం మన రాష్ట్రంలో ఉన్న హనుమాన్ ఆలయాలన్నింటిలోకి అతి పెద్దది.
ఆలయ చరిత్ర
ఆలయ చరిత్ర చదవటానికి పెద్దగా ఉంటుంది కానీ మీకు అర్థమయ్యే రీతిలో విడమర్చి చిన్నగా చెబుతాను. అనగనగా విజయనగర సామ్రాజ్య కాలం. క్రీ.శ.1521 లో శ్రీ వ్యాసరాయలవారు తుంగభద్ర నది ఒడ్డున ధ్యానం చేసేవాడు. ఆలయ చరిత్ర వ్యాసరాయలవారు గొప్ప చిత్రకారుడు. ప్రతిరోజు తాను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న ఒక రాయి మీద శ్రీ ఆంజనేయ స్వామి రూపం చిత్రించేవాడు. అలా చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు నిజరూపం ధరించి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడట ...!
ఆలయ చరిత్ర
ఇది గమనించిన వ్యాస రాయలవారు హనుమంతుని శక్తిని వేరోకచోటికి వెళ్ళనీయకుండా, స్వామివారి ద్వాదశ నామాల బీజాక్షరాలతో ఒక యంత్రం తయారు చేసి, దానిలో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజరూపాన్ని చిత్రించారట. దాంతో స్వామి ఆ యంత్రంలో బంధింపబడి అందులో ఉండిపోయారట.
ఆలయ చరిత్ర
ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉన్న చిప్పగిరి మండలంలో ఉన్న శ్రీ భోగేశ్వరి స్వామి వారి ఆలయంలో ఒకరోజు వ్యాసరాయల వారు నిద్రిస్తుండగా ఆంజనేయస్వామి కలలో వచ్చి" నేను ఫలానా ప్రాంతంలో ఉన్నాను, నాకు గుడి కట్టించు" అని చెప్పాడట.
ఆలయ చరిత్ర
ఆ ప్రాంతం ఎక్కడుందో ఉపదేషించమని వ్యాస రాయల వారు కోరగా స్వామి వారు ఈ విధంగా అనుగ్రహించాడు. ఏమనగా - " దక్షిణం వైపున వెళితే ఒక ఎండిన ఒక వేప చెట్టు కనిపిస్తుందని, దానికి దగ్గరగా వెళితే ఆది చిగురిస్తుందని, అక్కడ భూమిలో తాను ఉంటాను" అని చెప్పారట.
ఆలయ చరిత్ర
మరునాడు ఉదయాన్నే లేచి దక్షిణం వైపు ప్రయాణంగావించి చివరకు ఆ ఎండిన వేప చెట్టును కనుగొంటాడు వ్యాస రాయలు. రాయల వారు ఆ చెట్టు వద్దకు చేరుకోగానే, ఆ చెట్టు కాస్త ఆకుపచ్చగా చిగురిస్తుంది.
ఆలయ చరిత్ర
ఆశ్చర్యచకితుడైన వ్యాసరాయల వారు వెంటనే అక్కడ భూమిని తవ్విస్తాడు. తవ్వకాల్లో ఒంటి కన్ను గల ఆంజనేయస్వామి వారి విగ్రహం కనిపిస్తుంది. రాయలవారు ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్టించి, ఆలయాన్ని నిర్మిస్తాడు.
నెట్టి కంటి ఆంజనేయస్వామి ఆలయం
నెట్టి కంటి అంటే ఒకే ఒక కన్నుగలవాడని అర్థం. స్వామికి కుడి కన్ను మాత్రమె ఉంటుంది. భక్తులకు ఈయనే "కల్పతరువు" మరియు "వరప్రదాత" కూడానూ. ప్రతిరోజు వేలాది మంది దర్శించుకునే ఈ ఆలయం భూత, ప్రేత, దుష్ట గ్రహపీడ నివారణ క్షేత్రంగా ఖ్యాతికెక్కింది.
నెట్టి కంటి ఆంజనేయస్వామి ఆలయం
ఏటా నెట్టి కంటి ఆంజనేయస్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి హనుమ దీక్షలు తీసుకుంటారు. హనుమద్ వ్రతానికి, పూజలకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి. ఇందులో బస చేయడానికి తగినన్ని సత్రాలు, కాటేజీలు అందుబాటులో ఉన్నాయి.
నెట్టి కంటి ఆంజనేయస్వామి ఆలయం
భక్తుల నమ్మకం
ప్రతి ఏడాది ఒక చర్మకారుడు ఏక భుక్తం ఉంటూ, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆంజనేయ స్వామికి చెప్పుల జత తయారు చేసి సమర్పిస్తాడు. మర్నాడు వచ్చి చూస్తె అది అరిగిపోయినట్లు, చిరిగిపోయినట్లు కనిపించటం విశేషం. స్వామి ఆ చెప్పులు ధరించి రాత్రి పూట విహారానికి వెళ్ళి వస్తూంటాడని భక్తుల నమ్మకం.
నెట్టి కంటి ఆంజనేయస్వామి ఆలయం
స్వామి వారి అనుగ్రహం
ప్రతి ఏటా వైశాఖ, శ్రావణ, కార్తీక, మాఘ మాసాలలో శనివారం నాడు అసంఖ్యాకంగా భక్తులు స్వామిని సందర్శించి తమ మనోభీష్టాలను నెరవేర్చుకుంటారు.
నెట్టి కంటి ఆంజనేయస్వామి ఆలయం
ఇక్కడికి ఎలా చేరుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా విమాన మార్గం విషయాని వస్తే, కసాపురానికి 60 కి. మీ. దూరంలో ఉన్న బళ్లారి లోని విమానాశ్రయం సమీప విమానాశ్రయంగా ఉన్నది. అక్కడ దిగి ప్రభుత్వ బస్సుల్లో లేదా రైలు మార్గంలో ప్రయాణించి చేరుకోవచ్చు. ఒకవేళ మీరు సౌండ్ పార్టీ అయితే క్యాబ్ లేదా ప్రవేట్ వాహనాలను అద్దెకు తీసుకొని కసాపురం చేరుకోవచ్చు. ఒకవేళ రైలు మార్గంలో వచ్చే వారు కసాపురానికి సమీపంలో ఉన్న గుంతకల్ రైల్వే జంక్షన్ లో దిగి ప్రభుత్వ బస్సుల్లో గానీ, షేర్ ఆటో లో గానీ ఎక్కి చేరుకోవచ్చు. ఈ రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని పెద్ద నగరాలతో, పట్టణాలతో అనుసంధానించబడి ఉంది. కనుక రైలు మార్గం ఉత్తమమైనదిగా నా అభిప్రాయం. చివరగా రోడ్డు మార్గం విషయానికి వస్తే ... గుంతకల్ నుండి ప్రభుత్వ ఆర్డినరీ బస్సుల్లో(పల్లె వెలుగు బస్సులు) ప్రయాణించి చేరుకోవచ్చు. ఒకవేళ మీకు బస్సు తప్పిపోతే గుంతకల్ పాత బస్ స్టాండ్ నుండి ప్రతి 5 నిమిషాలకు ఒక ఆటో ఉంటుంది. కనుక 4 కిలోమీటర్ల దూరలో ఉన్న నెట్టి కంటి ఆంజనేయస్వామి ఆలయాన్ని ప్రశాంతంగా దర్శించుకోవచ్చు.