పచ్చని ప్రకృతిని ఆస్వాదించని వారుండరు. ఎత్తయిన గిరులను అధిరోహించి చుట్టు పరిసరాలను పరిశీలిస్తే కలిగే ఆనందమే వేరు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ఎన్నో గిరుల్లో 'అమరగిరి'ఒకటి. పెద్దాపురం పట్టణానికి దగ్గర్లో ఇవి ఉన్నాయి వీటిని సాధారణంగా'పాండవుల మెట్ట'గా పిలుస్తుంటారు. పాండవుల వనవాస సమయంలో కొంతకాలం ఇక్కడే బస చేసారని చెబుతారు. అందుకు తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయి.
ఇక్కడికి వెళ్లితే...పెళ్లి ఆ పై శోభనం కూడా
ముఖ్యంగా భీముని పాద ముద్రికలు.. ద్రౌపది రజస్వల చాప.. పాండవులు రహస్య మార్గముగా వాడిన గుహ, భీముడు వండి వార్చిన వంటశాల వంటి ఆనవాళ్లు స్పష్టంగా ఇక్కడ కనువిందు చేస్తాయి. అంతేకాక ఆధునిక కాలంలో నిర్మించబడిన శ్రీ సూర్యనారాయణమూర్తి దేవస్థానం సందర్శకులకు భక్తి ముక్తిమార్గంగా నిలుస్తుంది.చుట్టూ పచ్చటి పరిసరాలతో చిట్టడవిని కలిగి ఉంటుంది.
1.భీముని పాద ముద్రికలు
Image source:
పాండవ వనవాస సమయంలో భీముడు తొలిసారిగా ఈ ప్రదేశాన్ని సందర్శించి గిరి అగ్రభాగాన్ని చేరి ప్రకృతి పరికించిన సమయంలో ఆ ప్రదేశం భీముని పాదాల ఒత్తిడికి కొంత కృంగిందని చెబుతారు. ఆ విధంగా ఆ ప్రదేశంలో భీముని పాదముద్రికలు నేటికీ దర్శనమిస్తాయి. మెట్ట ప్రాంతమంతా రాతితో వుండడంవలన పాద ముద్రికలు రాతిపై చాలా స్పష్టంగా ముద్రితమై సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పాండవుల మెట్ట దర్శించే వారిలో ఎక్కువ భాగం భీముని పాదాలను చూడాలనుకునేవారే ఉండడం విశేషం!
2.ద్రౌపది రజస్వల చాప
Image source:
చతురస్రాకారంలో చాప మాదిరి రాతి నిర్మాణం కనిపిస్తుంది. వనవాస సమయంలో ద్రౌపది రజస్వల అయినప్పుడు ఈ ప్రాంతంలోనే కూర్చున్నదని చెబుతారు. అయితే పాండవుల భార్య అయిన ద్రౌపది ఇక్కడ ఇప్పుడు రజస్వల కావడమేమిటనేది చాలామందికి అంతు చిక్కని ప్రశ్న. ఈ విషయంలో రెండు విభిన్న కథనాలను ఆలోచించాల్సి ఉంది. రాజవంశీయులు కన్యను వివాహమాడేవారు. కన్య అంటే రజస్వల కాని స్త్రీ అని కూడా అర్థం.
3. చతురస్రాకార నిర్మాణం
Image source:
ఆ విధంగా చూస్తే పాండవులు ద్రౌపదిని వివాహమాడిన తర్వాత ఆమె ఈ ప్రాంతంలో రజస్వల అయి ఉండవచ్చు. రజస్వల అయినవారు మంగళకర స్నానమాచరించే వరకు వేరుగా కూర్చుండడం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ రాతి ప్రాంతంలో ఆమె కూర్చుండుటకువీలుగా చాప మాదిరి చతురస్రాకారంలో నిర్మాణం చర్యలు చేసి వుండవచ్చునని ఇప్పటికీ నమ్ముతారు.
4. మరో కథనం ప్రకారం....
Image source:
రెండవ కథనంగా ఆలోచిస్తే ద్రౌపది బహిష్టుల సమయంలో ఆమె ఆయా దినాల్లో గృహ సంబంధిత కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఇక్కడ కూర్చుని ఉండవచ్చునని చెబుతారు. సనాతన కాలంనుండి ఆచార సంప్రదాయాలను అత్యంత నిష్టగా పాటించేవారు నేటికీ బహిష్టు రోజులను అపవిత్ర రోజులుగా భావించి వేరుగా ఏదో మూలన గృహ కార్యక్రమాలకు దూరంగా గడపడం జరుగుతుంది. ఆ మూడు రోజులు గడిచిన తర్వాత మంగళకర స్నానం ఆచరించి గృహ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆచారంగా వస్తోంది.
5. ఇక్కడ కుర్చొంటే...
Image source:
సాధారణ వయసులో సంభవించే రజస్వల సంభవించని ఆడపిల్లలను పాండవుల మెట్ట ఈ ద్రౌపది రజస్వల చాపవద్దకు తీసుకువచ్చి దానిపై కూర్చుండబెడితే వారు రజస్వల అవుతారన్న నమ్మకం ఇప్పటికీ ఇక్కడ కొనసాగుతోంది. మూఢనమ్మకం అని కొట్టిపారేయకపోతే ఈ రాతిచాపలో దాగివున్న సైన్సు అద్భుతం ఈ కార్యానికి కారణం కావచ్చునన్నది కొంత మంది ప్రజల నమ్మకం.
6.రహస్య మార్గము.. నివాసము
Image source:
పాండవుల మెట్టపైనున్న ఈ గుహకు సంబంధించి అనేక కథనాలు ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి. వనవాస సమయంలో పాండవులు ఈ గుహలో జీవించుటయే కాక గుహ మధ్య భాగానగల జలప్రాంతంలో స్నానాలు ఆచరించేవారని చెబుతారు. ఈ జలప్రాంతం దాటి పదుల కిలోమీటర్లు ప్రయాణిస్తే రాజమహేంద్రవరం (ప్రస్తుత రాజమండ్రి) చేరకునేవారని అంటారు. ఈ గుహకు సంబంధించి అనేక కథనాలు వినిపిస్తున్నాయి.
7. ఒక మేకల గుంపు
Image source:
ఒక మేకల గుంపును ఈ గుహలోకి పంపితే రెండు మేకలు మాత్రమే ఆవలివైపుకు ఈదుకుంటూ చేరాయని ఓ కథనం ప్రాచుర్యంలో ఉంది. మరో కథనం ప్రకారం కొంతమంది పరిశోధకులు దీనిగుండా కొంతదూరం ప్రయాణించి వెనుదిరగడమే కాకుండా మార్గమధ్యంలో ఆక్సిజన్ సరిపోవడం లేదని భయంకరమైన విషపుజంతువులు, తోడేళ్లు వంటివి ఉన్నాయని వివరించినట్టు వాడుకలో ఉంది. అంతుచిక్కని ఈ గుహ రహస్యం ఇప్పటికీ తేలలేదు. భూగర్భ పరిశోధకులు మాత్రమే పరిశోధించగల ఈ పరిశోధనలపై వారు కూడా ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశం.
8.భీమ వంటశాల
Image source:
గుహకు అతి దగ్గరగా గుహ మాదిరిగా రాతిని వొలిచిన ప్రాంతం కనిపిస్తుంది. ఇక్కడ పాండవులు భోజనాల తయారీకి వాడుకున్నారని చెబుతారు. ఈ ప్రాంతంలో కనిపించే డొప్ప వంటి భాగాన్ని ‘గంజి వార్చే భాగము'గా వర్ణిస్తారు. నల భీములు అత్యంత రుచికరమైన వంటలు వండి వార్చేవారని పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి ఇతిహాస చారిత్రక ఆధారాలు కలిగిన ఈ అమరగిరి ప్రాంతం పాండవుల మెట్టగా ప్రసిద్ధి గాంచింది. ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి గతంలో చాలా కష్టపడాల్సి వచ్చేది. ప్రస్తుతం 108 మెట్ల నిర్మాణం జరగడంతో పర్యాటకులకు అనుకూలమయ్యింది.
9. శ్రీసూర్యనారాయణమూర్తి ఆలయం
Image source:
పాండవుల మెట్టకి వచ్చే పర్యాటకులకు విశ్రాంతి కలగచేయడంతోపాటు భక్తిని ముక్తిని ప్రసాదించడానికి స్వచ్ఛంద అగ్రహార బ్రాహ్మణుల చేత శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయం నిర్మాణం జరిగింది. ఈ ఆలయ ప్రాంగణం పర్యాటకులను విశేషంగా ఆకర్షించడమే కాకుండా అమరగిరికి సరికొత్త శోభను సంతరించేలా చేసింది. అష్టోత్తర (108) మెట్ల నిర్మాణం కూడా మెట్ట మధ్య భాగంలో సుందరంగా దర్శనమిస్తుంది.
10. ఉత్సవాలు ఇక్కడ ప్రత్యేకం...
Image source:
వేసవి కాలంలో వచ్చే సూర్యభగవాన్ ఉత్సవాలు ఇక్కడ గుడికి భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చేలా చేస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి షష్టికి కూడా ఇక్కడ ప్రాధాన్యత ఉంది. అమరగిరి ఆలయంనుండి బయల్దేరి ఊరంతా జరిగే ‘వరద పాశ ఉత్సవం' (నీళ్లు చిమ్మే ఉత్సవం) వలన ఆ రోజునుండి వర్షాలు సంభవిస్తాయని ప్రజలు విశ్వసించి ఉత్సాహంతో పాల్గొంటారు. పెళ్లి ముహూర్తాలు జోరందుకున్న సమయాల్లో ఈ ఆలయంపై వందలాది పెళ్లిళ్లు చుట్టుపక్కల గ్రామాలనుండి వచ్చి మరీ జరుపుకోవడం చెప్పుకోదగ్గ విషయం.
11. త్రికోణాకారంలో...
Image source:
రాజమండ్రికి వెళ్లే రోడ్డు మార్గం ఓవైపు వుండగా మరోవైపు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లే రోడ్డు మార్గం వుండడంతో మెట్ట త్రికోణాకారంలో కనిపిస్తుంది. మెట్ట దిగువ ప్రాంతంలో గల శ్రీ సత్తెమ్మ అమ్మవారి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతంగా భాసిల్లిన పాండవుల మెట్ట ప్రాంతంలో రకరకాల కీటకాలు, పక్షులు, జంతువులు కనిపించేవి. నేడు జరుగుతున్న విస్తరణలో భాగంగా సంపద తరుగుతున్నట్టు చూస్తేనే తెలుస్తుంది.
12. మరిడమ్మ ఆలయం
Image source:
మరిడమ్మ ఆలయం పర్యాటకులు ఇక్కడికి రావడానికి ఒక చిన్న ట్రిప్ వేసుకొని రావచ్చు. ఇక్కడికి రావడానికి పెద్ద ఖర్చు వేసుకోవలసిన అవసరం లేదు. పెద్దాపురం నుంచి 100 - 150 రూపాయల ఖర్చుతో మెట్టతో పాటుగా దగ్గరలోని పురాతన ఆలయాలను సందర్శించవచ్చు వాటిలో మరిడమ్మవారి ఆలయం, శ్రీ శివాలయం/ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ( పెద్దాపురం నుంచి 1 కి. మీ. దూరంలో), శ్రీ నూకాళమ్మ వారి ఆలయం( కంద్రకోట గ్రామం, పెద్దాపురం మండలం 8 కి. మీ ) , శ్రీ శృంగార వల్లభ స్వామి వారి ఆలయం (తిరుపతి గ్రామం, పెద్దాపురం మండలం. 11 కి. మీ. పెద్దాపురం, 3 కి. మీ. కంద్రకోట) ఉన్నాయి.
13. అతి ఎతైన ఆంజనేయ విగ్రహం..
Image source:
ఆంజనేయస్వామి విగ్రహం ఆంజనేయ స్వామి వారి ఆలయం సామర్లకోట - పెద్దాపురం మధ్యలో సుమారు 4 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ ఆసియా ఖండంలోనే పెద్దదైన ఆంజనేయస్వామి విగ్రహం ఉన్నది. 52 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం కంచి శృంగేరి పీఠం చేత పరిరక్షించబడుతున్నది. ఈ విగ్రహాన్ని చూడటానికే సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ముఖ్యంగా హనుమాన్ జయంతి ఇక్కడ చాలా బాగా జరుగుతుంది.
14. విమాన మార్గంలో
Image source:
పాండవుల మెట్ట చేరుకోవడం ఎలా విమాన మార్గం పెద్దాపురంలో విమానాశ్రయం లేదు. కనుక సమీపంలోని రాజమండ్రి దేశీయ ఏర్ పోర్ట్ లో దిగాలి అక్కడి నుంచి 37 కి. మీ. దూరంలో ఉన్న పెద్దాపురానికి సులభంగా చేరుకోవచ్చు. వైజాగ్ విమానాశ్రయం కూడా పెద్దాపురానికి సమీపంలో ఉన్న మరొక ఏర్ పోర్ట్. ఈ ఏర్ పోర్ట్ 127 కి. మీ దూరంలో ఉన్నది.
15. రైలు మార్గం
Image source:
రైలు మార్గం పెద్దాపురం కంటే సమీపంలోని సామర్లకోట జంక్షన్ అన్నివిధాలా అనువైనది. ఇక్కడ ప్రతీరోజు దేశం నలుమూలల నుంచి రైళ్లు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి పెద్దాపురానికి 5 కి. మీ. దూరం ఉంది. మీకి ఇది కుదరకపోతే, గుడపర్తి రైల్వే స్టేషన్ సమీపంలో గల మరొక రైల్వే స్టేషన్. ఇది పెద్దాపురానికి 6 కి. మీ. దూరంలో ఉన్నది.
16. రోడ్డు మార్గంలో
Image source:
రోడ్డు మార్గం పాండవుల మెట్ట కు చేరుకోవడానికి రోడ్డు మార్గం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. పెద్దాపురంకి ఆ. ప్ర.రో.ర.స వారి బస్సులు ప్రతీ రోజు రాజమండ్రి, కాకినాడ నుంచి బస్సులు తిరుగుతుంటాయి. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ మొదలగు నగరాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ సేవల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడ వసతి సౌకర్యం కొంత వరకూ బాగానే ఉంటుంది. అయితే చాలా మంది ఇక్కడ రాత్రి బస చేయడానికి ఇష్టపడరు.