ప్రకృతి అందాలకు నిలయం పట్నితోప్. మంచు పర్వతాలు, ఉత్కంఠ భరిత దృశ్యాలు మరియు ప్రశాంత వాతావరణం ఇలా ఎన్నో ప్రత్యేక అంశాలను తనలో దాచుకున్న పట్నితోప్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ఉధంపూర్ జిల్లాలో ఉన్న అందమైన హిల్ స్టేషన్.
మొదట్లో ఈ ప్రదేశాన్ని 'పటాన్ డా తలాబ్' అనగా 'యువరాణి చెరువు' అని పిలిచేవారట. అప్పట్లో నిజంగానే ఈ ప్రాంత యువరాణి తన చెలికత్తెలతో వచ్చి ఇక్కడి చెరువులో స్నానం చేసేదని చెబుతారు. కాలక్రమేణా, పటాన్ డా తలాబ్ కాస్త పట్నితోప్ గా మారిపోయింది.
ఇది కూడా చదవండి : అందాల జమ్మూ & కాశ్మీర్ పర్యటన !
పట్నితోప్ లో సందర్శించడానికి చాలానే ప్రదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ, యాత్రికులు ఎక్కువగా సాహస క్రీడలు చేయటానికే మొగ్గు చూపుతారు. సంవత్సరం పొడవునా చూడదగ్గ పర్యాటక ప్రదేశంగా చెప్పబడుతున్న పట్నితోప్, సందర్శించటానికి అనుకూల సమయం మే నుండి జులై వరకు మరియు సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు. ప్రకృతి రమణీయతలకు అద్దంపడుతూ, ఆకట్టుకుంటున్న ఈ ప్రదేశం గురించి ఒకసారి వివరాల్లోకి వెళితే ...
పట్నితోప్ ఎలా చేరుకోవాలి ?
వాయు మార్గం
పట్నితోప్ కు సమీపాన జమ్మూ ఎయిర్పోర్ట్ (108 KM) కలదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి జమ్మూ విమానాశ్రయం చక్కగా అనుసంధానించబడింది. ఎయిర్ పోర్ట్ వెలుపల టాక్సీ లేదా క్యాబ్ అద్దెకు తీసుకొని పట్నితోప్ చేరుకోవచ్చు.
రైలు మార్గం
పట్నితోప్ కు సమీపాన ఉధంపూర్ రైల్వే స్టేషన్ (46 KM), జమ్ముతావీ రైల్వే స్టేషన్ (110 KM) లు కలవు. జమ్ముతావీ రైల్వే స్టేషన్, దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి కలుపబడినది. స్టేషన్ బయట టాక్సీ లేదా క్యాబ్ అద్దెకు తీసుకొని పట్నితోప్ వెళ్ళవచ్చు.
బస్సు మార్గం
పట్నితోప్ కు శ్రీనగర్ నుండి జాతీయ రహదారి 1-ఏ మీదుగా చేరుకోవచ్చు. అలాగే, రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుండి జమ్మూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు పట్నితోప్ కు అందుబాటులో ఉంటాయి. జమ్మూ స్టేషన్, విమానాశ్రయం నుండి ప్రత్యేక లగ్జరీ బస్స్సులు తిరుగుతాయి.
చిత్ర కృప : prakash singh
బుద్ధ అమర్నాథ్ ఆలయం
పట్నితోప్ యొక్క ప్రధాన ఆకర్షణలలో, బుద్ధ అమర్ నాథ్ ఆలయం ఒకటి. గుడిలో సహజ తెల్లరాయి తో చేసిన శివలింగం ఉంది. పుల్సత ఏటికి ఎడమవైపున ఉన్న పర్వతాల కింద భాగంలో ఉంది ఈ ఆలయం. కథానుసారం, రావణుని తాత అయిన పుల్సత యోగి ఈ నది సమీపంలో ధ్యానం చేయడం వలన నదికి అతని పేరు పెట్టబడింది. పర్యాటకులు బస్సులలో గానీ, జీప్ లో గానీ ఆలయం చేరుకోవడానికి వీలు ఉంది.
చిత్ర కృప : Alan Kemp
కుడ్
కుడ్, పట్నితోప్ సమీపాన ఉన్న పట్టణం. సముద్ర మట్టానికి 1738 మీటర్ల ఎత్తున ఉంటుంది. నిర్మలమైన అందానికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం, మే నుండి జులై వరకు మరియు చలికాలంలో ఎక్కువ మంది సందర్శిస్తారు. మిఠాయి లకు కూడా కుడ్ పట్టణం చెప్పుకోదగ్గదే !
చిత్ర కృప : Prasoon Budhwar
నాగ్ ఆలయం
నాగ్ ఆలయం పట్నితోప్ ఆకర్షణలలో ఒకటి. సుమారు 600 సంవత్సరాల క్రితం నాటి ఆలయం, అధిక భాగం చెక్కతో తయారుచేయబడినది. కొండా పై ఉన్న ఈ ఆలయం అన్ని వైపులా చుట్టబడి ఉంటుంది. కేవలం పగలు మత్రమే ఈ ఆలయంలోకి ప్రవేశించాలనుకొనేది భక్తుల నమ్మకం.
చిత్ర కృప : Saurabh Bhakri
బహు కోట
సుమారు 3,000 సంవత్సరాల క్రితం నాటి బహు కోట,దేశంలోని పురాతన కోట లలో ఒకటి. కోట తావీ నది ఒడ్డున కలదు. కోట లో ఒక ఆలయం కూడా ఉంది సుమీ ! ఆ ఆలయం కాళీ మాత కు అంకితం చేయబడింది. కోట పరిసరాల్లో మొఘల్ ఉద్యానవనాలు, తోటలు గమనించవచ్చు.
చిత్ర కృప : Telugu Native Planet
గౌరీ కుండ్ సూధ్ మహాదేవ్
గౌరీ కుండ్ లో పార్వతీదేవి ప్రతి రోజూ, తన ప్రార్థనల ముందు దివ్య స్నానాలు ఆచరించిన ప్రదేశం గా చెబుతారు. ఈ కుండ్, లో ఒక్క మునక వేస్తే పాపాలన్నీ కూడా పోతాయని భక్తుల నమ్మకం.
చిత్ర కృప : Vaibhav Singh
శివగఢ్
శివగఢ్ దర్శనం సాహసికులు, విహారయా యాత్రా ప్రేమికులకు ఒక ట్రెక్కింగ్ స్థావరం. సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రదేశం లో తరచూ యాత్రికులు ట్రెక్కింగ్ చేయటానికి వస్తుంటారు. శివగఢ్ చుట్టూ దట్టంగా పెరిగిన దేవదారు చెట్లతో కప్పబడి ఉంటుంది.
చిత్ర కృప : Daily Excelsior
సూధ్ మహాదేవ్ ఆలయం
సూధ్ మహాదేవ్ ఆలయం సుమారు 2800 క్రితం నాటిదని స్థానికుల అభిప్రాయం. గుడిలో త్రిశూలం యొక్క అవశేషాలను, అనంత జ్వాల ను నేటికీ చూడవచ్చు. సమీపంలోని మంతాలై ఆశ్రమం చూడదగ్గది.
చిత్ర కృప : srinivasan R
సాహస క్రీడలు
శీతాకాలంలో స్కై యింగ్, ట్రెక్కింగ్ క్రీడల్లో పాల్గొనేందుకు పర్యాటకులు వస్తుంటారు. గోల్ఫ్, పారా గ్లైడింగ్, గుర్రపు స్వారీ, ఫోటో గ్రఫీ వంటి వాటి పై ఆసక్తి గల వారికి కూడా పట్నితోప్ అనుకూలంగా ఉంటుంది.
చిత్ర కృప : Extremehimalayan