భారతదేశంలోనే అత్యంత సంపన్న దేవాలయాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న దేవాలయం అనంత పద్మనాభస్వామి ఆలయం. తిరువనంత పురం పేరు చెప్పగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. స్వామి వారు కొలువైనందునే ఈ పేరు వచ్చింది.
కేరళలో అనంత సంపదలకు అధినేత అయిన అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి అందరికీ తెలుసు కానీ, ఆ ఆలయానికి అతి సమీపంలోనే ఉన్న శ్రీ మహా గణపతి ఆలయం గురించి తెలిసింది అతి తక్కువ మందికి మాత్రమే. నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ స్వామి సకల విఘ్నాలను తొలగించి విజయం కలిగిస్తాడని ప్రసిద్ది.
ఈ ఆలయంలో స్వామివారి మూలమూర్తి అన్ని ఆలయాలలో కనిపించేలా
అతి పురాతనమైన ఈ ఆలయంలో స్వామివారి మూలమూర్తి అన్ని ఆలయాలలో కనిపించేలా ఎడమ కాలును పైకి మడిచి కూర్చున్న భంగిమలో కాకుండా కుడికాలిని పైకి మడిచి ఎడమకాలిని కిందికి పెట్టి భిన్నంగా కనిపించడం ఒక విశేషం కాగా, కేరళ ఆలయాలకు భిన్నంగా తమిళనాడు రీతిన కట్టడంతో, చిన్న ఆవరణలోనే మహాగణపతి కొలువుదీరడం మరో విశేషం. మహా మహిమాన్వితుడిగా పేరున్న ఈ స్వామివారి ఆలయ ప్రాంగణంలో కోరికలెన్నో కోరుకుని అవి తీరాక కొబ్బరికాయలు కొడుతూ కనిపించే భక్తజనులు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటారు.
తమిళనాడులోని కన్యాకుమారికి సమీపంలో
తమిళనాడులోని కన్యాకుమారికి సమీపంలో నాగర్కోయిల్ పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో గల పద్మనాభపురం అప్పట్లో కేరళ రాజధాని. ఇరవి వర్మ కులశేఖర పెరుమాళ్ అనే రాజు పద్మనాభపురంలో రాజభవనాన్ని నిర్మించాడు. ఆ రాజభవన ప్రాంగణంలోనే చిన్నపాటి గణపతి ఆలయం ఉండేది.
గణపతికి మొక్కిన తర్వాతే
గణపతికి మొక్కిన తర్వాతే దండయాత్రలకు, వేటకు, ఇతర దేశయాత్రలకు బయలుదేరేవారు ఎవరైనా ఆ కాలంలో. తదనంతర కాలంలో రాజా మార్తండవర్మ ట్రావెన్కోర్ రాజవంశాన్ని పద్మనాభదాసులుగా ప్రకటించి, అనంతుడు వెలసిన పురానికి రాజధానిని మార్చాడు.
పళవంగాడు మహాగణపతిగా భక్తుల కోర్కెలను
1795వ సంవత్సరంలో శ్రీ మహాగణపతిని కూడా సాదరంగా తోడుకొని వచ్చి, పళవంగాడుగా పిలుచుకునే ఆ కోట తూర్పు భాగంలో పునఃప్రతిష్ఠించారు.ఆనాటినుంచి పళవంగాడు మహాగణపతిగా భక్తుల కోర్కెలను నెరవేరుస్తున్నాడు స్వామి.
ఆలయ విశేషాలు
తమిళనడు ఆలయ నిర్మాణ శైలిలో చిన్న ఆవరణంలో ఉండే ఈ ఆలయం లోనికి ప్రధాన ద్వారం దాటి ప్రవేశిస్తే మహా మండపం చేరుకుంటారు.
ఆలయ గోపురానికి నల్లరంగు వేయడంతో
ఆలయ గోపురానికి నల్లరంగు వేయడంతో దూరానికే కొట్టవచ్చినట్లుగా, ప్రత్యేకంగా కనిపిస్తుంది ఆలయం. ఆలయంలో మండపాలెన్నో ఉన్నాయి. రహదారి మీద ఉండే చిన్న రాజగోపురం గుండా ప్రాంగణంలోకి ప్రవేశిస్తే, మండప స్తంభాలపైన ఎంతో రమణీయంగా చెక్కిన శ్రీ లక్ష్మీ సరస్వతీ విగ్రహాలు, ఇతర మూర్తులు దర్శనమిస్తాయి.
నాగరాజు ఆలయాలు తమ ప్రత్యేకతను
అన్నింటికీ మించి ముఖమండపం గోడలపైన శిల్పసౌందర్యంలో ఒకదానికొకటి పోటీపడుతున్నట్లుగా చెక్కి ఉన్న 32 రూపాలలో గణపతి చిత్రాలు అమితంగా ఆకట్టుకుంటాయి. ఇవిగాక ఉపాలయాలెన్నో ఉన్నాయి. వాటిలో దుర్గాదేవి, ధర్మశాస్త్త్ర, నాగరాజు ఆలయాలు తమ ప్రత్యేకతను నిలబెట్టుకుంటాయి.
కొబ్బరికాయలపైన తనకున్న మక్కువను తీర్చుకుంటున్నాడు మహాగణపతి
స్వామిని దర్శించి మనోగతాలను తెలిపి అవి నెరవేరిన తరువాత కొబ్బరి కాయలను కొట్టడం ఇక్కడ అలిఖిత శాసనం. అలనాడు ట్రావెన్కోర్ రాజవంశీకుల పూజలందుకున్న పళవంగాడు మహాగణపతి నేడు పేదలకు కూడా దర్శనమిస్తూ, వారి కోర్కెలు తీరుస్తూ, మొక్కులనూ సంతోషంగా స్వీకరిస్తున్నాడు. కొబ్బరికాయలపైన తనకున్న మక్కువను తీర్చుకుంటున్నాడు మహాగణపతి.
ఆలయ సమయం
రోజూ ఉదయం నాలుగున్నర గంటలకు ఆలయ ద్వారాలు తెరచిన వెంటనే భక్తులకు నిర్మాల్య దర్శనం కల్పిస్తారు. ఉదయం నాలుగున్నర నుండి 11 గంటల వరకు తిరిగి సాయంత్రం ఐదు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది.
పూజలూ...
అనంతరం అభిషేకం, ఉషఃకాలపూజ, నైవేద్యం, ఉచ్చపూజ, దీపారాధనలతో సహా మొత్తం 21 రకాల పూజాకైంకర్యాలు పార్వతీ నందనునకు జరుపుతారు. ప్రతినెలా పౌర్ణమి తరువాత వచ్చే సంకటహరచతుర్థి పూజ, హస్తానక్షత్ర పూజ, ప్రత్యేకపూజ, హోమాలు నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే గణపతి హోమానికి ఎంతో గొప్ప పేరు.
ఉత్సవాలూ...
ప్రతి సంవత్సరం గణేశ చతుర్థి, ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవాలు, మాఘమాసంలో అమావాస్య తర్వాత వచ్చే శుక్లపక్ష చతుర్థినాడు జరుపుకునే వినాయక వరద చతుర్థి అంగరంగవైభవంగా జరుగుతాయి.గణేష చతుర్ధి, ఆలయ ప్రతిష్టా దినోత్సవాలలో "కొడియాట్టు, శుద్ధి కలశ ఉత్సవ బలి" లాంటి పదకొండు రకాల పూజలు ఘనంగా ఏర్పాటు చేస్తారు.
డ్రెస్ కోడ్ :
కొన్ని ప్రధాన దేవాలయాల్లో తప్పనిసరిగా డ్రెస్ కోడ్ ఉంటుంది. అలాగే ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులు పురుషులు దోతి షర్ట్ మరియు మహిళలు శారీ ధరించి దేవాలయానికి వెళ్ళాల్సి ఉంటుంది. ట్రెడిషినల్ దుస్తుల్లో వెళ్ళేవారినిమాత్రమే లోపలికి అనుమతిస్తారు.
ఇతర దర్శనీయ ప్రదేశాలు...
అనంతపద్మనాభస్వామి ఆలయం, కుంటాలలో గల మరో అనంతుని ఆలయం, ఇంకా కేరళ రాజవంశీకులున్న కోట... అసలు కేరళలో అడుగుపెట్టడమే భూలోక స్వర్గానికి స్వాగతం పలుకుతున్నట్లుగా అనిపిస్తుంది. మహామహిమాన్వితుడైన పళవంగాడు మహాగణపతి ఆలయ సందర్శనం అనంతమైన ఫలాలనిస్తుందని విశ్వాసం.
Dattu PVSR
ఎలా వెళ్లాలి?
దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి తిరువనంతపురం వరకు బస్సులు, రైళ్లు ఉన్నాయి. తిరువనంతపురం సెంట్రల్ రైల్వేస్టేషన్, బస్స్టేషన్లకు అతి సమీపంలో గల ఈ ఆలయానికి వెళ్లడం చాలా సులభం.
వాయు మార్గం
తిరువనంతపురం నగరానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. ఈ విమానాశ్రయం దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో అనుసంధానించబడింది. క్యాబ్ లేదా సిటీ బస్సుల్లో ప్రయాణించి నగరం లోకి ప్రవేశించవచ్చు.
రైలు మార్గం
తిరువనంతపురం ప్రధాన రైల్వే జంక్షన్ గా ఉన్నది. ఇక్కడికి 5కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంది. తిరువనంతపురం నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ప్రయాణించవచ్చు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, కలకత్తా, ఢిల్లీ వంటి నగరాలకు నిత్యం రైళ్లు అందుబాటులో ఉంటాయి.
రోడ్డు మార్గం
తిరువనంతపురం అంతర్జాతీయ విమానశ్రయం నుండి 8కిలోమీటర్ల దూరంలో దేవాలయం ఉంది. తిరువనంతపురం నుండి సమీప నగరాలకు, పట్టణాలకు ప్రభుత్వ, ప్రవేట్ బస్సులు లభిస్తాయి.
చిత్ర కృప : Binoyjsdk