దేశంలో ఉన్న పులుల రిజర్వ్ ఫారెస్ట్ లలో ప్రసిద్ధి గాంచినది ... మధ్యప్రదేశ్లోని పెంచ్ నేషనల్ పార్క్ లేదా పెంచ్ టైగర్ రిజర్వ్. ఈ జాతీయ పార్క్ కు గల మరోపేరు 'ఇందిరా ప్రియదర్శిని పెంచ్ నేషనల్ పార్క్'. పెంచ్ జాతీయ పార్కు సాత్పురా పర్వతాలకు దిగువన దక్షిణాన వుంది. ఈ అభయారణ్యంలో అనేక కాలువలు, చిన్న చిన్న నీటి ప్రవాహాలు మరియు పెంచ్ నది ప్రవహిస్తుడడంతో ఎప్పుడూ పచ్చదనంతో నిండి ఉంటుంది.
ఇది కూడా చదవండి : పనా నేషనల్ పార్క్ - పాండవుల గుహలు, జలపాతాలు !
పెంచ్ అభయారణ్యంలో ఎత్తైన ప్రాంతం కాలపహార్. ఇది సముద్రమట్టానికి 650 అడుగుల ఎత్తులో ఉంటుంది. పులులతో పాటుగా అనేక జంతువులకు ఈ పార్క్ నివాసంగా ఉన్నది. పార్క్ లో 5 చోట్ల నిరంతరం ప్రవహించే జలపాతాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఈ స్థల గొప్పదనాన్ని, సహజ సంపదను గురించి 'అయిన్-ఇ-అక్బరి' లో కూడా వివరించబడింది.
పురివిప్పు నాట్యం ఆడుతున్న నెమలి
చిత్ర కృప : Mathias Appel
పెంచ్ నేషనల్ పార్క్ వైశాల్యం 449.39 చ. కి.మీ. 1983లో దీన్ని జాతీయం చేశారు. దేశంలో 19 వ పులుల సంరక్షణా కేంద్రంగా పెంచ్ ను గుర్తించారు. ఈ పార్క్ లో పొదలు, అధిరోహకలు, చెట్లు, మూలికలు, కలుపు మొక్కలు, గడ్డి పుష్కలంగా ఉన్నాయి. ఈ ప్రదేశంలో 1200 కంటే ఎక్కువ రకాల చెట్లు ఉన్నాయి. వాటిలో కొన్ని ఔషధాల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. ఈ పార్కు 164 రకాల పక్షులకు, 10 రకాల ఉభాయచరాలకు, 33 రకాల క్షీరదాలకు, 30 రకాల సరీసృపాలకు, 50 రకాల చేపలకు నివాసస్థలంగా ఉంది. అంతేకాకుండా, విస్తృత శ్రేణిలో కీటకాలను కూడా ఇక్కడ చూడవచ్చు.
అభయారణ్యంలోని పెద్ద పులి
చిత్ర కృప : Marcus Meissner
ఈ పార్కు గొప్ప వృక్ష, జంతుజాలాన్ని కలిగిఉంది. ఇక్కడ చిరుతలు, పులులే కాకుండా దుప్పి, బ్లాక్ బక్, నల్లని మెడగల కుందేళ్ళు, హైనాలు, ఎగిరే ఉడతలు, సంబార్లు, నక్కలు, అడవి పందులు, ముళ్ళ పందులు, నక్కలు, చౌసిన్ఘాలు, నిల్గై వంటివి కూడా ఉన్నాయి. ఈ పార్కులో (వలస వచ్చిన అలాగే ఇక్కడ నివశించే) ఇండియన్ పీతాలు, తెల్ల కళ్ళ బజార్డ్ లు, వాటర్ ఫోవ్ల్స్, మలబార్ హార్న్ బిల్ లు, కొంగలు, పచ్చని పావురాలు, ఆస్ప్రేల వంటి అనేక రకాల పక్షులు కూడా ఉన్నాయి.
సందర్శించే సమయం
సందర్శకులు పెంచ్ నేషనల్ పార్క్ ను అక్టోబర్ - జూన్ మధ్యలో సందర్శించవచ్చు. ఈ పార్క్ ఉదయం 6 గంటల నుండి 10:30 వరకు, మరళా తిరిగి 3 గంటల నుండి 6 గంటల వరకు తెరిచే ఉంచుతారు.
నేషనల్ పార్క్ లో అందమైన పక్షుల జంట
చిత్ర కృప : cirdantravels
రవాణా సౌకర్యాలు
సమీప విమానాశ్రయం - నాగపూర్ విమానాశ్రయం (160 కి.మీ)
సమీప రైల్వే స్టేషన్ - సియోని రైల్వే స్టేషన్ (30 కి.మీ)
రోడ్డు / బస్సు మార్గం - సియోని పెంచ్ కు సమీపాన ఉన్న బస్ స్టాండ్. ఇక్కడికి సమీప పట్టణాలైన నాగపూర్ , జబల్పూర్ నుండి ప్రవేట్ మరియు ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి.
పార్క్ ముఖ్య ప్రవేశ ద్వారం
చిత్ర కృప : Elroy Serrao