పవిత్ర గోదావరి నదికి ఉపనది ప్రాణహిత కలిసే చోట ఉన్న క్షేత్రమే కాళేశ్వరం. ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధి గాంచిన త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం ఎంతో మహిమ కలది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ పట్టణానికి 125 కిలోమీటర్ల దూరంలో మహాదేవపూర్ మండలానికి సమీపంలో దట్టమైన అడవి మధ్యలో, చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన, పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది.
శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం
మీరే చెప్పండి ..! సాధారణంగా గర్భగుడి లో ఎన్ని శివలింగాలు ఉంటాయి. ఒక్కటే కదా !! కానీ కాళేశ్వర ఆలయంలో రెండు శివలింగాలు గర్భగుడిలో పూజలందుకుంటాయి. అందులో ఒకటేమో ముక్తేశ్వరునిది (శివుడు), మరొకటేమో కాళేశ్వరునిది (యముడు). ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం బహుశా .. ఇండియాలో ఎక్కడా కనిపించదేమో..!
శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వరం
చిత్ర కృప : Tallamma
ఆలయ స్థల పురాణం
దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వర స్వామి అనుగ్రహించడంతో యమధర్మ రాజు కి పనిలేకుండా పోయిందట. అప్పుడు యముడు ముక్తేశ్వర స్వామి వద్దకి వెళ్ళి వేడుకోగా ... శివుడు యమున్ని తనవద్దే పక్కన లింగరూపంలో నిల్చోమన్నాడట. తనని దర్శించుకొన్న వారు అతనిని దర్శించుకోనట్లయితే మోక్షప్రాప్తి లభించదని అన్నాడు. అలాంటి వారికి కాలం దగ్గరపడుతున్నప్పుడు నేరుగా నరకానికి తీసుకొని వెళ్ళమని చెప్తాడు. అందుకే భక్తులు స్వామి వారిని దర్శించుకొని (శివుణ్ని), కాళేశ్వరుణ్ణి (యమున్ని) కూడా దర్శించుకుంటారు.
ఆలయ ప్రత్యేకత
ఆలయంలో రెండు శివలింగాలు ఒకే పానవట్టం మీద ఉండటం ఒక విశేషమైతే ముక్తేశ్వర స్వామి లింగంలో రెండు రంధ్రాలు ఉండటం మరో ప్రత్యేకత. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు సమీపంలోని గోదావరి, ప్రాణహిత సంగమ స్థలంలో వెళ్ళి కలుస్తుందంటారు.
ప్రధాన ఆలయంలోని శివలింగాలు
చిత్ర కృప : kaleshwaramtemple
కాళేశ్వర క్షేత్రం గొప్ప శిల్పకళానిలయంగా ప్రసిద్ధిచెందినది. ఇక్కడ ఇప్పటి వరకు బయటపడ్డ అనేక శిల్పకాళాఖండాల వల్ల పూర్వవైభవం తేటతెల్లమవుతున్నది. దేశంలో ఉన్న ప్రముఖ సరస్వతీ ఆలయాల్లో ఒకటైన కాళేశ్వరంలోని మహా సరస్వతి ఆలయం ఇక్కడ చూడవలసిన మరొక ప్రధాన ఆలయం. అలాగే సూర్యదేవాలయం కూడా వీలుంటే చూడండి. కాళేశ్వరంలో బ్రహ్మతీర్థం, నరసింహతీర్థం, హనమత్ తీర్థం, జ్ఞానతీర్థం, వాయుసతీర్థం, సంగమతీర్థం వంటి తీర్థాలున్నాయి.
ఆది ముక్తేశ్వర ఆలయం
కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి పడమటి వైపు యమగుండం మీద సుమారు ఒక కి.మీ దూరంలో ఆదిముక్తీశ్వరాలయం ఉంది. ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రకృతి సిద్ధంగా విభూతి రాళ్లు లభించడం విశేషం. ఆలయం లో మొదట లోనికి వేళ్లే చోట యమకోణం ఉంది, ఇందులో నుండి బయటకి వెల్లినట్లయితే యమ దోషం పోతుంది అని భక్తులు విశ్వసిస్తారు, ఇందులో నుండి వెళ్లుటకు దిక్సూచి ఉంటుంది దానిని అనుసరించి వెళ్లాలి.
కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం
చిత్ర కృప : telangana tourism
కాళేశ్వరం లో ఇంకా శ్రీ శుభానంద ఆలయం, రాముల వారి ఆలయం, దత్తాత్రేయ స్వామి ఆలయం, సంగమేశ్వర ఆలయం, సుబ్రమణ్య స్వామి ఆలయం, విజయ గణపతి ఆలయం, గోదావరి మాత ఆలయం , ఆంజనేయ స్వామి ఆలయం, నాగ దేవత ఆలయం చూడవచ్చు.
కాళేశ్వరం కి ఎలా వెళ్ళాలి ?
వాయు మార్గం
కాళేశ్వరం వెళ్ళటానికి డైరెక్ట్ గా వినామాలు లేవు. సమీప విమానాశ్రయం హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. హైదరాబాద్ నుండి కాళేశ్వరం దాదాపు 300 కిలోమీటర్ల ఉంటుంది. క్యాబ్ లేదా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించి కాళేశ్వరం చేరుకోవచ్చు.
రైలు మార్గం
కాళేశ్వరం లో రైల్వే స్టేషన్ లేదు. సమీప రైల్వే స్టేషన్ (98 కిలోమీటర్లు) రామగుండం. కనుక హైదరాబాద్ లో రైలు ఎక్కి, రామగుండం లో దిగి ఆర్టీసీ బస్సు లో ప్రయాణించి కాళేశ్వరం చేరుకోవచ్చు. రాముగుండం నుండి కాళేశ్వరానికి అధిక సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉంటాయి. వరంగల్ మరియు కాజీపేట్ రైల్వే స్టేషన్ లు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
బస్సు మార్గం
తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నుండి కాళేశ్వరం కి నేరుగా బస్సులను నడుపుతుంది. ఎం జి బి ఎస్ లేదా జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్ నుండి ఈ బస్సులు ప్రతి రోజు అందుబాటులో ఉంటాయి. ఎక్కువగా ఎక్స్ప్రెస్ సర్వీసులను ఆర్టీసీ నడుపుతుంది. ప్రయాణ సమయం 4 - 5 గంటలు పట్టవచ్చు.
కారు మార్గం లేదా బైక్ మార్గం
హైదరాబాద్ - సిద్దిపేట - పెద్దపల్లి - కాళేశ్వరం ( 300 కిలోమీటర్లు, 5 గంటల సమయం)
హైదరాబాద్ - బొంగిర్ - వరంగల్ - పర్కాల్ - కాళేశ్వరం ( 260 కిలోమీటర్లు, 4 గంటల 15 నిమిషాలు)
హైదరాబాద్ - కాళేశ్వరం బస్
చిత్ర కృప : Vamshi Krishna