భిమ్తాల్ (భీమ్టాల్) ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశం. ఈ ప్రాంతం సముద్రమట్టానికి 1370 అడుగుల ఎత్తులో ఉంది. నైనిటాల్ జిల్లా యొక్క మినీ హెడ్ క్వార్టర్స్ అయిన ఈ ప్రాచీన నగరం పాండవులలో ఒకడైన భీముని పేరుతో ప్రాచుర్యం పొందింది. రాజ్యబహిష్కార సమయంలో పాండవులు ఇక్కడ కొంత కాలం జీవనం సాగించారని పురాణాల్లో తెలిపారు.
భిమ్తాల్ లో సందర్శించవలసిన పర్యాటక స్థలాలు
భిమ్తాల్ లో చూడవలసిన పర్యాటక స్థలాల విషయానికి వస్తే ... భిమ్తాల్ సరస్సు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే ఈ సరస్సుకి చివరన ఉన్న విక్టోరియా డ్యామ్ పర్యాటకులని ఆకర్షిస్తుంది. ఈ డ్యాం నుండి అధ్బుతమైన ప్రకృతి సౌందర్యం సందర్శకుల మనసులని దోచుకుంటుంది. దీంతో పాటు సరస్సు వద్ద ఉన్న ద్వీపంలోని అక్వేరియంను సందర్శకులు గమనించవచ్చు.
ఇది కూడా చదవండి: నైనిటాల్ పట్టణం ఎలా ఏర్పడింది ?
భిమ్తాల్ సరస్సు ఔత్సాహికులకి బోటింగ్ సౌకర్యాలని అందించటంతో పాటు ఎన్నో ట్రాన్స్ హిమాలయన్ పక్షులని ఆకర్షిస్తుంది. రాక్ ఆర్ట్స్, జానపద చిత్రలేఖనలు, పురాతన వస్తువులు మరియు ప్రాచీన రాత ప్రతులు మొదలగునవి ఇక్కడి ఫోక్ కల్చర్ మ్యూజియంలో ప్రదర్శింపబడతాయి. అంతే కాకుండా, దేవతలు మరియు దేవుళ్ళ వివిధ రకాల చిత్రాలని కూడా పర్యాటకులు ఈ మ్యూజియం లో గమనించవచ్చు.
భిమ్తాల్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సట్టాల్ ని, హిడింబ పర్వతాన్ని, నాగ దేవాలయాన్ని మరియు వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ ని ఇంకా ఇలా ఎన్నో వైవిధ్యభరితమైన ప్రదేశాలను, ఇతిహాసాలకు సంబంధించిన ప్రాంతాలను చూడవచ్చు, ఇక ఆలస్యం చేయకుండా ఒక్కోటిగా ఈ ప్రదేశాలను చూసొద్దాం పదండి ....!
భిమ్తాల్ లేక్, భిమ్తాల్
సముద్ర మట్టం నుండి ఏకంగా 4500 మీటర్ల ఎత్తులో ఉన్న భిమ్తాల్ లేక్ నైనిటాల్ చుట్టుప్రక్కల ఉన్న సరస్సులలో అతి పెద్దదైన సరస్సులలో ఒకటి. పాండవులలో ఒకరైన భీముని పేరుతో ఈ సరస్సు ప్రాచుర్యం పొందింది. నైనిటాల్ నుండి 22 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ సరస్సు లో వాటర్ స్పోర్ట్స్ ఆడవచ్చు.
చిత్ర కృప : Sujayadhar
భిమ్తాల్ లేక్, భిమ్తాల్
భిమ్తాల్ సరస్సు ఔత్సాహికులకు పాడ్లింగ్ మరియు బోటింగ్ సౌకర్యాలను అందిస్తుంది. ఈ సరస్సు వివిధ రకాల ట్రాన్స్ హిమాలయన్ మరియు బ్ల్యాక్ ఈగల్స్, వాల్ క్రీపార్ బర్డ్స్, టానీ ఫిష్ ఓవల్స్, బుల్బుల్స్ మరియు ఎమేరల్ద్ డావ్ లని ఆకర్షిస్తుంది.
చిత్ర కృప : viwake
భిమ్తాల్ లేక్, భిమ్తాల్
భిమ్తాల్ సరస్సు మధ్యలో దాదాపు 91 మీటర్ల దూరంలో ఒక ద్వీపం ఉంది. ఈ ద్వీపం పై ఉన్న అద్భుతమైన అక్వేరియం ని చూడడానికి పర్యాటకులు బోటు ద్వారా చేరుకుంటారు. ఈ అక్వేరియం లో అరుదైన చైనా, మెక్సికో మరియు సౌత్ ఆఫ్రికా కి చెందిన చేపలను గమనించవచ్చు. ఈ ప్రాంతం చుట్టూ కనిపించే కుమోని హిల్స్ ఈ ప్రాంతపు అందాలని మరింత రెట్టింపు చేస్తాయి.
చిత్ర కృప : Proloy Chakroborty
భిమేశ్వర ఆలయం, భిమ్తాల్
భిమ్తాల్ సరస్సుకు ఒడ్డున భిమేశ్వర ఆలయం ఉన్నది. ఇది మహాశివునికి అంకితం ఇవ్వబడింది. పురాణ కథల ప్రకారం, భీముడు ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కుమోన్ ని పాలించిన చంద రాజవంశీకుడు బాజ్ బహదూర్ క్రీ.శ. 17 వ శతాబ్దం లో నిర్మించినాడు. మహాశివరాత్రి నాడు ఈ ఆలయాన్ని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటారు.
చిత్ర కృప : Samuel Bourne
విక్టోరియా డ్యామ్, భిమ్తాల్
భిమ్తాల్ సరస్సు కి చివర ఉన్న విక్టోరియా డ్యాం 40 అడుగుల ఎత్తులో ఉంది. ఈ డ్యాం కి ఇరువైపులా అందమైన పూల తోటలు ఉన్నాయి. ఈ డ్యామ్ అందమైన ప్రకృతి సౌందర్యాన్ని పర్యాటకులకి ఇస్తుందనటంలో సందేహం లేదు. ఈ దారిలో కనిపించే అందమైన అడవి పూలు పర్యాటకులని ఆకర్షిస్తాయి.
చిత్ర కృప : Aavindraa
ఫోక్ కల్చర్ మ్యూజియం, భిమ్తాల్
ఫోక్ కల్చర్ మ్యూజియం 'లోక్ సంస్కృతి సంగ్రహాలయ' గా కూడా ప్రసిద్ది చెందింది. అమూల్యమైన కళాఖండాలతో పాటు ఈ మ్యుజియం లో భారీగా సేకరించిన ఛాయాచిత్రాలను గమనించవచ్చు. వివిధ రకాల పురాతన వస్తువులు, రాక్ ఆర్ట్స్ , జానపద చిత్రలేఖనాలు, చెక్కతో చేయబడిన కళాఖండాలు, ప్రాచీన రాతప్రతులు, దేవతల మరియు దేవుళ్ళ చిత్రాలు వంటివి ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయి.
చిత్ర కృప : Sreenivasan Ramakrishnan
కార్కోటక నాగ ఆలయం, భిమ్తాల్
భిమ్తాల్ లోని కర్కోటక పర్వతాలపై పురాతనమైన నాగుల గుడి ఉంది. ఈ ఆలయం నాగుల దైవం అయిన కర్కోటక మహారాజ కి అంకితమివ్వబడినది. రిషి పంచమి అనే పర్వదినాన అత్యధిక సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. పురాణాల ప్రకారం, పాము కాట్ల నుండి స్థానికులని ఈ నాగ దైవం రక్షిస్తారని అంటారు.
చిత్ర కృప : Anil Vyas
హిడంబి పర్వతం, భిమ్తాల్
హిడంబి పర్వతం భిమ్తాల్ సరస్సుకు దగ్గరలో ఉంది. ప్రసిద్దమైన ఇతిహాసం మహాభారతం లోని పురాతన పాత్ర అయిన రాక్షసి హిడింబ పేరే ఈ పర్వతానికి వచ్చిందని అంటారు. ప్రస్తుతం ప్రముఖ గురువు అలాగే పర్యావరణవేత్త అయిన వంఖండి మహారాజ్ ఈ పర్వతం పై ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. ఈ పర్వతం చుట్టూ ఒక వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ కూడా ఉన్నది. ఇప్పుడు ఈ ప్రాంతం వంఖండి ఆశ్రమం గా ప్రసిద్ది చెందింది.
చిత్ర కృప : soumya_iiitc
సట్టాల్, భిమ్తాల్
భీమ్టాల్ నుండి కేవలం 3 కిలోమీటర్ల దూరం లో ఉన్న సప్తనదుల సంగమం గా పేర్కొనే సట్టాల్ ని పర్యాటకులు సందర్శించవచ్చు. 500 స్థానిక మరియు వలస పక్షులకి, 11000 కిటకాలకి మరియు 525 రకాల సీతాకోక చిలుకలకి సట్టాల్ నివాసం.
చిత్ర కృప : Nikhil Pannikar
సట్టాల్, భిమ్తాల్
కిన్గ్ఫిషేర్స్, బ్రౌన్ హెడెడ్ బార్బెట్స్, బ్లూ విస్లింగ్ తృష్, ఇండియన్ ట్రీ పయ్స్ మరియు రెడ్ బిల్డ్ బ్లూ మాగ్పైస్ లు సట్టాల్ లో సాధారణంగా కనిపించే పక్షులు. వివిధ రకాల క్షీరదాలు ఇంకా సీతాకోకచిలుకలు ఇక్కడ కనిపిస్తాయి.
చిత్ర కృప : Nabarun Sadhya
భిమ్తాల్ ఎలా చేరుకోవాలి ??
భిమ్తాల్ చేరుకోవడానికి రోడ్డు, రైలు మరియు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
విమాన మార్గం
భిమ్తాల్ కి సమీపం లో ఉన్న విమానాశ్రయం పంత్నగర్ విమానాశ్రయం. అంతర్జాతీయ పర్యాటకులు న్యూఢిల్లీ లో ఉన్న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. పంత్నగర్ విమానాశ్రయం నుండి భిమ్తాల్ చేరుకోవడానికి టాక్సీలు మరియు బస్సు సర్వీసు లు అందుబాటులో కలవు.
రైలు మార్గం
భీమ్టాల్ నుండి 21 కిలోమీటర్ల దూరం లో ఉన్న కత్గోడం లో ఉన్న రైల్వే స్టేషన్ ఈ ప్రాంతానికి సమీపం లో ఉన్న రైల్వే స్టేషన్. ఇది ఢిల్లీ నుండి 278 కిలోమీటర్ల దూరం లో ఉంది. ఢిల్లీ నుండి కత్గోడం కి ప్రతి రోజు రెండు రెగ్యులర్ రైళ్ళు నడుస్తాయి. ఈ రైల్వే స్టేషన్ నుండి భిమ్తాల్ చేరుకునేందుకు పర్యాటకులు టాక్సీ సేవలను ఉపయోగించుకోవచ్చు.
రోడ్డు మార్గం
ఉత్తరాఖండ్ లోని అన్ని ప్రధాన నగరాలకు భిమ్తాల్ రోడ్ల ద్వారా చక్కగా అనుసంధానమై ఉంది. కత్గోడం మరియు కుమోన్ ప్రాంతం వంటి ప్రాంతాల నుండి టాక్సీ మరియు బస్సు సర్వీసులు అందుబాటులో కలవు. ఢిల్లీ లో ఉన్న ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ ఆఫ్ ఆనంద్ విహార్ నుండి, అల్మోర మరియు నైనిటాల్ లు నుండి భిమ్తాల్ చేరుకునేందుకు బస్సు సర్విస్ లు ఉన్నాయి.
చిత్ర కృప : Ritesh