అవన్తిపూర్ (అవంతిపూర్)జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రంలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇక్కడున్న రెండు పురాత దేవాలయాలే ఈ ప్రాంత పేరును నలుదిక్కులా విస్తరింపజేసాయి. ఇక్కడున్న రెండు దేవాలయాలను క్రీ.శ. 9 వ శతాబ్దంలో అవంతి వర్మ అనే రాజు నిర్మించాడు. ఈయన అన్ని మతాల వారిని సమానంగా చూసేవాడని, దాన ధర్మాలలో పై చేయి గలవాడని చరిత్ర సారాంశం.
ఇది కూడా చదవండి : శివుడు అమరత్వం చెప్పిన ప్రదేశం !
అవంతి వర్మ రాజు కట్టించిన ఆలయాలలో రెండు ఆలయాలలో ఒకటి శివునిది కాగా, మరొకటి విష్ణువుది. ఈ రెండు దేవాలయాల యొక్క శిల్ప శైలి గ్రీకుల శిల్ప శైలిని పోలి ఉంటుంది.
అవన్తిపూర్ సందర్శించు స్థలాలు !
అవన్తీశ్వర శివ దేవాలయం
అవన్తీశ్వర దేవాలయం, అవన్తిపూర్ పట్టణంలోని దేవాలయాలన్నింటిలో పెద్దది. దీనిని అవంతివర్మ రాజు శివుని కోసం కట్టించాడు. ఆలయం చుట్టూ పెద్ద పెద్ద గోడలు ఉంటాయి. ఇప్పుడైతే శిధిలావస్థకు చేరుకొని గుడి భూమిలో కలిసి పోయింది. అయితే, క్రీ.శ. 18 వ శతాబ్దం లో బ్రిటీష్ వారు ఈ ప్రదేశంలో తవ్వకాలు జరిపి ఆలయాన్ని కనుగొన్నారు. తవ్వి వెలికితీసిన శిల్పాలు, విగ్రహాలు, కళాఖండాలు శ్రీనగర్ (36 కి. మీ ల దూరంలో) లోని శ్రీ ప్రతాప్ సింగ్ మ్యూజియం లో చూడవచ్చు.
అవన్తీశ్వర శివ దేవాలయం
చిత్ర కృప : Karthik R
అవన్తిస్వామి విష్ణు దేవాలయం
అవన్తిస్వామి విష్ణు దేవాలయాన్ని కూడా అవంతివర్మ నిర్మించాడు. దీనిని ఆయన సింహాసనం అధిరోహించే ముందు నిర్మించాడు. ఇది శ్రీ అవన్తిపూర్ శివాలయానికి కేవలం కిలోమీటర్ దూరంలో కలదు. అవన్తి శివాలయంలో పోలిస్తే ఈ అవన్తి విష్ణు ఆలయం కాస్త బెటర్.
అవన్తిస్వామి విష్ణు
చిత్ర కృప : Karthik R
పై రెండు ఆలయాలను నిర్మించటానికి అవంతి వర్మ మంచి పనితనం కలిగిన నిపుణులను ఎంపిక చేసుకున్నాడు. ఈ ఆలయాలు శిధిలమైనప్పటికీ అప్పటి పని తనం నేటికీ కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది. చైనా, అరబ్బులు, భారత పురాతన రాజుల హయాంలో చెలామణి అయిన నాణేలు, వస్తువులు, విగ్రహాలు ఇక్కడ దొరికినాయి.
శివ అవన్తీశ్వర దేవాలయం సుల్తాన్ సికందర్ చే దాడి చేయబడింది. ఈ దాడి లో నిర్మాణం దెబ్బ తింది. ఇతను భుక్తి సేన్ పేరుతో ఈ ప్రాంతాన్ని కొంత కాలం పాలించాడు. అంతే కాక ఈ దేవాలయ నిర్మాణంలో ఉపయోగించిన నిర్మాణ వస్తువులు దాడులకు , ప్రకృతి విపత్తులకు నిలువలేకపోయాయి. కాలక్రమంలో ఇవి భూమిలో కలసి పోగా, బ్రిటిష్ పాలకులు తవ్వకాలలో వెలికి తీసారు. ఈ దేవాలయాల కొన్ని కళా కృతులను ఇప్పటికి శ్రీ నగర్ లోని శ్రీ ప్రతాప్ సింగ్ మ్యూజియం లో చూడవచ్చు.
అవన్తిపూర్ ఎలా చేరుకోవాలి ?
విమాన మార్గం
అవన్తిపూర్ కు 37 కిలోమీటర్ల దూరంలో శ్రీనగర్ లోని షేక్ ఉల్ ఆలం విమానాశ్రయం కలదు. ఢిల్లీ, ముంబై, జైపూర్, చండీఘర్, సిమ్లా వంటి ప్రధాన నగరాల నుండి విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. టాక్సీ లేదా క్యాబ్ లలో ప్రయాణించి అవన్తిపూర్ సులభంగా చేరుకోవచ్చు.
రైలు మార్గం
అవన్తిపూర్ కు 269 కిలోమీటర్ల దూరంలో జమ్ముతావి రైల్వే స్టేషన్ కలదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఈ స్టేషన్ చక్కగా కలుపబడి ఉన్నది. ఢిల్లీ, కన్యాకుమారి, ముంబై, చండీఘర్, కలకత్తా, లక్నో ల నుండి కూడా జమ్మూ తావీ చేరుకోవచ్చు. అక్కడి నుండి ప్రభుత్వ / ప్రవేట్ వాహనాల్లో అవన్తిపూర్ వెళ్ళవచ్చు.
బస్సు / రోడ్డు మార్గం
శ్రీనగర్, అనంతనాగ్, బుద్గం, పుల్వామా, గుల్మార్గ్, బారాముల్లా తదితర పట్టణాల నుండి అవన్తిపూర్ కు ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.
అవన్తిపూర్ చేరుకోవడం ఎలా ?
చిత్ర కృప : Wg Cdr Rakesh Singh Chauhan (Retd)