సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
పర్యాటకం, సంస్కృతితోపాటు నోరూరించే రుచికరమైన ఆహారం సమృద్ధిగా ఉన్నదక్షిణ భారతదేశంలోని అత్యధికంగా సందర్శించే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. అరుదైన వృక్షజాలం మరియు జంతుజాలంతో కుటుంబసమేతంగా హాయిగా విహరించేందుకు అనేక హిల్ స్టేషన్లతోపాటు పురాతన దేవాలయాలకు అత్యంత ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతం.
వీటిపాటు ప్రకృతిసిద్ధమైన హొయలొలికే సరసులు ఇక్కడ ఉన్నాయని మీకు తెలుసా? ఈ అందమైన సరస్సులకు ఆంధ్రప్రదేశ్ నిలయమంటే మీరు నమ్ముతారా? అందుకే, ఆంధ్రప్రదేశ్లో తప్పనిసరిగా సందర్శించాల్సిన కొన్ని పేరొందిన సరస్సులను మీకు పరిచయం చేస్తున్నాం.
పులికాట్ సరస్సు
ఆంధ్రప్రదేశ్లోని అత్యంత అందమైన సరస్సుల జాబితాలో చేర్చాల్సిన సరస్సు పులికాట్ సరస్సు. ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా ప్రసిద్ధిగాంచింది. మరీ ముఖ్యంగా వలసపక్షుల విడిది కేంద్రం పులికాట్ సరస్సు. ఇది తిరుపతి జిల్లాలో ఉంది. ఏటా సీజనల్గా పులికేట్ సరస్సు ఈశాన్య రుతుపవనాల వర్షపు మేఘాలను మరియు అనేక వలస పక్షులను ఆకర్షించే అత్యంత ముఖ్యమైన చిత్తడి నేలలలో ఒకటి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి సమీపంలో ఈ సరస్సు ఉంది. పులికాట్ సరస్సు పక్షుల అభయారణ్యం కూడా ఇక్కడ తప్పక సందర్శించవలసిన కేంద్రం. ఈ సీజన్ వచ్చిందంటే ప్రకృతి ప్రేమికులు కుటుంబసమేతంగా ఇక్కడ వాలిపోతారు.
కొల్లేరు సరస్సు
భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సులలో కొల్లేరు సరస్సు అతి ముఖ్యమైనది. కొల్లేరు సరస్సు ఏలూరు నుండి 15 కిలోమీటర్ల మరియు రాజమండ్రి నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. కృష్ణా మరియు గోదావరి నీటిపారుదల వ్యవస్థలను అనుసంధానించబడిన ఈ సరస్సు శీతాకాలంలో వలస పక్షులకు ప్రధాన పర్యాటక ఆకర్షణ. లక్షలాది అరుదైన జాతుల పక్షులు ఇక్కడ వాటి సంతతిని పెంచుకుంటాయి. వలస పక్షులలో సైబీరియన్ క్రేన్, ఐబిస్ మరియు పెయింటెడ్ కొంగలను కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ సరస్సు 1999లో వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించబడింది. అప్పటి నుండి అనేక పక్షులకు ఆవాసంగానే కాకుండా పర్యాటక ప్రదేశంగానూ పేరుపొందింది.
కంబమ్ సరస్సు
ఆంధ్రప్రదేశ్లోని అత్యంత అందమైన సరస్సులతో గుండ్లకమ్మ సరస్సు అని కూడా పిలువబడే కంబమ్ సరస్సు. భారతదేశంలోని పురాతన మానవ నిర్మిత సరస్సులలో ఇది ఒకటి. ఈ సరస్సు విజయనగర యువరాణి వరదరాజమ్మచే నలమల్ల కొండలలోని గుండ్లకమ్మ వాగుపై నిర్మించబడింది. రాష్ట్రంలో ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉన్న ఈ సరస్సు 2020లో యునెస్కోచే ప్రపంచ వారసత్వ నీటిపారుదల నిర్మాణంగా కూడా గుర్తించబడింది. ఈ మానవ నిర్మిత సరస్సు 1700 సంవత్సరాల నాటి పురాతన లిపిలో సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది.
కొండకర్ల సరస్సు
ఈ సరస్సు పక్షుల అభయారణ్యంగా ప్రాచార్యం పొందింది. ఆంధ్రప్రదేశ్లోని అందాల నగరం విశాఖపట్నం పర్యటనలో తప్పనిసరిగా సందర్శించవలసిన ప్రదేశం కొండకర్ల అవ సరస్సు. రాష్ట్రంలోని అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఇది ఒకటి. గుబురుగా కనిపించే తామర పువ్వుల మధ్య కొండకర్ల అవలో పడవ ప్రయాణం ఒక సుందరమైన అనుభవమనే చెప్పాలి. ఈ ప్రదేశంలో పక్షి అభయారణ్యం కూడా ఉంది. ఇది అనేక వలస పక్షులకు నిలయం. కొండకర్ల అవా పర్యావరణ పర్యాటక ప్రాంతంగా కూడా గుర్తింపు పొందింది.