బిఆర్ హిల్స్ అంటే బిలిగిరి రంగన్న హిల్స్ అన్నమాట. సరిగ్గా ఈ ప్రాంతంలో తూర్పు మరియు పడమటి కనుమలు కలుస్తాయి. చుట్టూ ఆకుపచ్చని గడ్డి మైదానాలు, అగాధాల్లాంటి లోయలు, నీలాకాశం, ఎత్తయిన కొండలు, వాటిపై చిక్కగా అల్లుకున్న వనాలు, వాటినిండా పూలు, పండ్ల వృక్షాలు, చల్లటి గాలి.... ఇలాంటి వాతావరణం ఈ ప్రదేశంలో కనపడుతుంది.
చిన్నపాటి సెలవులు గడపాలంటే బిఆర్ హిల్స్ ప్రదేశం ఎంతో అనుకూలం. దేవాలయం చూడాలనుకుంటే, రధోత్సవం జరిగే సమయంలో ఈ ప్రాంతాన్ని దర్శించాలి. జంతు సంరక్షణాలయం చూడాలనుకునేవారికి వర్షాలు పడే సమయంలో ఆగస్టు నుండి నవంబర్ వరకు మంచి సమయంగా ఉంటుంది. సెలవులు గడుపుతూ విశ్రాంతి పొందాలనుకునేవారికి , ఇది ఒక మంచి ప్రదేశం. అయితే ఇంకెందుకు ఆలస్యం ... మైసూరుకు దగ్గర్లో ఉండే "బి.ఆర్. హిల్ స్టేషన్"కు వెళ్దాం పదండి..!
బిఆర్ హిల్స్ హోటళ్ళ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
బిఆర్ కొండలు
దక్షిణ భారత దేశంలో అటు పశ్చమ కనుమలకు, ఇటు తూర్పు కనుమలకు మధ్యనుండే కర్ణాటక ప్రాంతంలో విస్తరించినవే బి.ఆర్. కొండలు. ఆకురాల్చే సతత హరిత, గడ్డి మైదాన అడవులకు ఈ కొండలు ప్రసిద్ధిగాంచాయి. ఏ కొండల గుండె రాగమైనా ఒక అపురూప అనుభవమే అన్నట్లుగా... ఇక్కడి స్వచ్ఛమైన ప్రకృతి కల్మషం లేని హృదయంలాగా అందరికీ ఆహ్వానం పలుకుతుంటుంది.
Photo Courtesy: Cheer Nature
బిలిగిరి రంగస్వామి దేవాలయం
బిలిగిరి రంగస్వామి దేవాలయాన్ని పర్యాటకులు తప్పక చూడాలి. ఇది కొండపై ఎంతో ఎత్తుగల ప్రదేశంలో ఉంటుంది. దీనిని వేంకటేశ్వరుడికి అంకితమిచ్చారు. ఇండియాలోని అన్ని దేవాలయాలలోకంటే కూడా ఇది విభిన్నంగా ఉంటుంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి స్ధానిక తెగల ప్రజలు రంగనాధుడికి ఒక అడుగు 9 అంగుళాలు ఉండే చర్మపు చెప్పులు కుట్టి ఇస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుండి ఇక్కడ జరిగే రధోత్సవ పండుగకు వేలాది ప్రజలు వస్తారు.
Photo Courtesy: jatin.muddu
బిఆర్ టి వన్యప్రాణి సంరక్షణాలయం
బిఆర్ హిల్స్ లో ప్రధాన ఆకర్షణ బిఆర్ టి వన్య ప్రాణి సంరక్షణాలయం. బిలిగిరి రంగస్వామి దేవాలయ అటవీ శాంక్చువరీని సంక్షిప్తంగా బి ఆర్ టి వైల్డ్ లైఫ్ శాంక్చువరీ అంటారు. దీనిని తప్పక చూడాలి ఎందుకంటే ఇది కర్నాటక తుంగభద్ర, కావేరి నదుల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 5,091 అడుగుల ఎత్తులో, సుమారు 500 చదరపు మీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ వనాలలో దాదాపు 270 రకాల వృక్ష జాతులున్నాయి. ఈ అరణ్యంలో సుసంపన్నమైన పుష్ప, ఫల, వృక్ష సంపదకయితే కొదవేలేదు.
Photo Courtesy: Ganesh Kumar
ఏనుగుల ఆవాసం
ఏనుగుల నివాసానికి ఇదో ఆదర్శ ప్రాంతమని చెబుతుంటారు కూడా.. ఆసియా ఏనుగులు, పులులు చిరుతలకు బి.ఆర్. కొండలు ప్రసిద్ది. ఎక్కడ చూసినా పక్షుల కిలకిలారావాలు, వన్యజీవుల విహారాలు పర్యాటకులకు కనువిందు చేస్తుంటాయి. రాష్ట్ర అటవీశాఖ సందర్శకులకోసం ప్రత్యేక కాటేజీలను అడవి మధ్యలో ఏర్పాటు చేసింది. అక్కడి దాకా జీవులలో వెళ్ళవచ్చు.
Photo Courtesy: Jaseem Hamza Photography
పక్షుల కిలకిలలు...
లోతైన లోయలు, ఎత్తైన కొండల అంచుల మీదుగా, దట్టమైన అడవి గుండా సాగే యాత్ర, ప్రకృతి ప్రేమికులకు ఒక అద్వితీయ అనుభూతిని ఇస్తుంది. ఎప్పుడు ఏ పొదల నుండి ఏ వన్యజీవి, మృగం వస్తుందో తెలియని ఉద్విగ్న పరిస్థితిలో ప్రయాణం సాగుతుంది.
Photo Courtesy: Kishore Bhargava
దొడ్డ సంపిగె మర
దొడ్డ సంపిగె మర అంటే పెద్ద చంపక చెట్టు అని అర్ధం. ఈ చెట్టు 34 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ చెట్టు స్ధానిక కధనం మేరకు 2000 సంవత్సరాల వయసుకలది. ఇది ఒక దేవాలయంలో, బిఆర్ హిల్స్ కు 4 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ చెట్టుకింద అనేక శివలింగాలు ఉంటాయి. ఈ చెట్టు సోలిగ తెగల జీవన విధానాలను వారికి ప్రకృతితో గల అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ చెట్టు మొదటనుండి కావేరీ నది ఉపనది అయిన భార్గవి నది తాకుతూ ప్రవహిస్తుంది. ఈ ప్రవాహం హిందూ ఋషి జమదగ్ని భార్య రేణుకగా చెపుతారు.
Photo Courtesy: Shrenik Sadalgi
సాహసాలు
సాహస కార్యాలు చేయాలనుకునేవారికి.... బిఆర్ హిల్స్ ట్రెక్కింగ్, ర్యాఫ్టింగ్, కావేరి మరియు కపిల నదుల పై విహారం చేయాలనుకునేవారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. చేపలు పట్టడం, బోట్ విహారం వంటివి కూడా చేయవచ్చు.
Photo Courtesy: br hills camp
మరో విషయం !
ఈ బి.ఆర్. కొండల మాటున ఉండే అభయారణ్యం ఒకప్పుడు అడవిదొంగ వీరప్పన్ రహస్య స్థావరంగా ఉండేది కాబట్టి, పర్యాటకులు అటువైపు వెళ్లాలంటేనే భయపడేవారు. వీరప్పన్ మరణం తరువాత ఇప్పుడిప్పుడే వన్యప్రాణి అభిమానులు, ప్రకృతి ప్రేమికులు ఈ అరుదైన సహజ ఉద్యానవనాలను సందర్శిస్తున్నారు.
Photo Courtesy: mM
బిఆర్ హిల్స్ ఎలా చేరాలి ?
విమాన ప్రయాణం
మైసూర్ విమానాశ్రయం బిఆర్ హిల్స్ కు స్ధానిక విమానాశ్రయం. ఇండియాలోని ప్రధాన నగరాలకు కలుపబడింది. ఇది బిఆర్ హిల్స్ నుండి 90 కి.మీ. ఉంటుంది. 235 కి. మీ. దూరంలో బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. వివిధ దేశాల పర్యాటకులు దీని ద్వారా ప్రయాణిస్తారు.
రైలు ప్రయాణం
బిఆర్ హిల్స్ కు రైలు స్టేషన్ లేదు. 90 కి.మీ. దూరంలో మైసూర్ రైల్వే స్టేషన్ నుండి ఇక్కడికి చేరాలి. ఇక్కడనుండి టాక్సీలు, క్యాబ్ లు లభ్యంగా ఉంటాయి.
బస్ ప్రయాణం
సమీప నగరాలు, పట్టణాలనుండి అంటే మైసూర్, కొల్లేగల్, కనకపుర, చామరాజ్ నగర్ లనుండి కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ డీలక్స్, ఓల్వో మరియు సూపర్ ఫాస్ట్ టూరిస్టు బస్సులు నడుపుతుంది.
Photo Courtesy: Vijayananda N