రణతంబోర్ నేషనల్ పార్క్ రాజస్థాన్ రాష్ట్రంలోని సుందర పర్యాటక కేంద్రం. భారతదేశంలో ఉన్న అతిపెద్ద నేషనల్ పార్క్ లలో ఇది ఒకటి. ఈ ప్రదేశానికి ఆ పేరు రణ్ మరియు తంబోర్ అనే రెండు కొండల పేర్ల నుండి వచ్చింది. గలగలా పారే సెలయేర్లు, దట్టమైన అడవులు, చారిత్రక కట్టడాలు, పులులు, వివిధ రకాల జంతువులు, పక్షులు, ఎక్కడా దొరకని జీవవైవిధ్యం ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. ఆరావళి పర్వతాలు,వింధ్యా పర్వతాలు కలిసే చోట ఉంది ఈ పార్క్.
రాజస్థాన్ లోని అల్వార్ లో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు !
రణతంబోర్ నేషనల్ పార్క్ 392 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నది. 1973 లో పులుల సంరక్షణార్థం ఈ ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్ జోన్ గా ప్రకటించారు. 1980 లో నేషనల్ పార్క్ హోదా కల్పించారు. పార్క్ లో మూడు సరస్సులు ఉన్నాయి. అక్కడ దాహార్తి తీర్చుకోవటానికి వచ్చే పులులను చూస్తూ ఆనందించవచ్చు. రణతంబోర్ లో పార్క్ మాత్రమే కాక మిగితా ఆకర్షణలు కూడా ఉన్నాయి. వాటి వివరాలలోకి వెళ్తే ..!
విరాట్ నగర్ - విరాటుడు కనుగొన్న పట్టణం!!
రణతంబోర్ కోట
రణతంబోర్ కోట ఆరావళి, వింధ్యా పర్వతాలు కలిసే చోట కలదు. కొండ భాగాన సుమారు 700 అడుగుల ఎత్తులో దీనిని క్రీ.శ. 944 వ సంవత్సరంలో నిర్మించారు. కోట ను సందర్శించే వారు, అక్కడి కొలను వద్దకు వచ్చే వలస పక్షులను చూడవచ్చు. కోటలో హిందూ, జైన దేవాలయాలతో పాటు మసీద్ కూడా ఉన్నది.
చిత్రకృప : Shaz.syed13
బాదల్ మహల్
బాదల్ మహల్ అంటే మేఘాలు భవనం అని అర్థం (హిందీ లో బాదల్ అంటే మేఘాలు అని, మహల్ అంటే భవనం అని అర్థం). ఇది రణతంబోర్ కోట కు ఉత్తర భాగాన కలదు. రాజు హమ్మీర్ చే నిర్మించబడిన 84 స్తంభాల ఛత్రి నేటికి చెక్కుచెదరకుండా బహు సుందరంగా ఉంది.
చితకృప : Ansel W
జోగి మహల్
జోగి మహల్ ను జైపూర్ రాచ కుటుంబాలు నిర్మించారు. వీరు వారాంతంలో వేటకై వస్తుండేవారు. అప్పుడు ఈ మహల్ వారికి విడిగా ఉండేది. ఇక్కడి నుండి పదం తలావ్, ఇండియాలోనే రెండవ పెద్ద రావి చెట్టు ను చూడవచ్చు. సాహసికులు ఇక్కడికి ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు.
చిత్రకృప : Wildnest Travel & Photography
లకర్డా మరియు అనంతపుర
నేషనల్ పార్క్ కు వాయువ్య దిశలో ఈ ప్రదేశం కలదు. ఇక్కడ తాజా పండ్లు, తేనె తుట్టెలు దొరుకుతాయి. శాఖాహార జీవులు లతో పాటు ఎలుగుబంట్లు, హైనా, ముళ్ళపందులు కూడా సంచరిస్తుంటాయి.
చిత్రకృప : Jon Connell
కచిడా వ్యాలీ
కచిడా వ్యాలీ, నేషనల్ పార్క్ వెలుపలి వైపు కలదు. ఇక్కడ తరచూ పార్క్ కు చెందిన చిరుతపులులు, అడవి ఏనుగులు, జింకలు సంచరిస్తూ ఉంటాయి. ఫోటోగ్రాఫర్ లకు చక్కటి ప్రదేశం ఇది. సఫారీ జీపులు ఎక్కి వ్యాలీ అందాలను చూసే అవకాశం కలదు.
చిత్రకృప : bjoern
సరస్సులు
రణతంబోర్ పార్క్ లో మూడు సరస్సులు ఉన్నాయి.
మాలిక్ తలావ్ - వలస పక్షులు, అప్పుడప్పుడు పులులు నీళ్లు తాగటానికి వస్తుంటాయి.
పదం తలావ్ - పెద్దది, వన్య జంతువులు దప్పిక తీర్చుకోవటానికి వస్తుంటాయి. ఫొటోగ్రఫీ కి అనుకూలం.
సుర్వాల్ సరస్సు - పక్షులకు స్వర్గం
చిత్రకృప : Shaz.syed13
రాజ్ బాగ్ శిధిలాలు
రాజ్ బాగ్ శిధిలాలు అంటే ఇక్కడగల డోమ్ లు, ఆర్చీలు, భవనాలు, బురుజులు మొదలగునవి చాలా ప్రాచీనమైనవి. ఈ ప్రదేశం రాజ్ బాగ్ సరస్సు కు మరియు పదం తలావ్ సరస్సు కు మధ్యన కలదు.
చిత్రకృప : Wildnest Travel & Photography
స్కూల్ ఆఫ్ ఆర్ట్
రణతంబోర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ టైగర్ ప్రాజెక్టు ను వివరించబడేందుకు స్థాపించబడింది. ఇక్కడ స్కూల్ టీచర్లు, విద్యార్థులు తయారుచేసిన గ్రేట్ టైగర్ చిత్రాలను ప్రదర్శించటం, అమ్మటం జరుగుతుంది. ఈ స్కూల్ పెయింటింగ్ పోటీలు, ప్రదర్శనలు పర్యాటకులకు జంతువుల పట్ల ఆసక్తిని కలిగిస్తుంటుంది.
చిత్రకృప : Ansel W
రణతంబోర్ నేషనల్ పార్క్
పార్క్ ను 1955 లో వన్య కేంద్రం గా, 1973 లో టైగర్ రిజర్వ్ గా, 1980 లో నేషనల్ పార్క్ గా ప్రకటించారు. పులులకు ఈ పార్క్ ప్రసిద్ధి మరియు వివిధ రకాల జంతువులు, పక్షులు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. పార్క్ లో స్వేచ్ఛగా విహరించవచ్చు. జీప్ సఫారీ అందుబాటులో ఉన్నది.
చిత్రకృప : Ansel W
ఎప్పుడు సందర్శించాలి ?
పార్క్ 1 అక్టోబర్ నుండి 30 జూన్ వరకు పర్యాటకుల సందర్శనార్థం తెరుస్తారు మరియు మిగితా అన్ని దినాలలో మూసేస్తారు.
టైమింగ్స్ : ఉదయం 6 నుండి 10 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి 6 గంటల వరకు.
టికెట్ ధరలు : భారతీయులకు : సాధారణం రూ. 510/- మరియు ఫారెనర్స్ కు రూ. 1, 250/-
జీప్ లో సఫారీ : భారతీయులకు రూ. 750/- మరియు విదేశీయులకు 1,350/-
చిత్రకృప : David Sivyer
హోటల్స్
పార్క్ లో వన్య జంతువుల మధ్య గడపటానికి హోటళ్లు, రిసార్ట్ లు కలవు. సీజన్ లను బట్టి గదుల రేట్లు మారుతుంటాయి.
రణతంబోర్ నేషనల్ పార్క్ హోటళ్లు, రిసార్ట్ ల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
చిత్రకృప : bjoern
రణతంబోర్
రణతంబోర్ నేషనల్ పార్క్ కి సమీపాన 150 కి. మీ ల దూరంలో జైపూర్ విమానాశ్రయం కలదు. ఇక్కడికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి విమానాలు వస్తుంటాయి.
రణతంబోర్ సమీపాన 10 కి. మీ ల దూరంలో సవాయి మాధోపూర్ రైల్వే స్టేషన్ కలదు. జైపూర్, అజ్మీర్, కోట, ఢిల్లీ, ముంబై నుండి వచ్చే రైళ్లన్నీ స్టేషన్ లో ఆగుతాయి.
రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు రణతంబోర్ వస్తుంటాయి. జైపూర్ పర్యాటక సంస్థ అందించే ప్రత్యేక ప్యాకేజీలతో ఈ పార్క్ ను చూసే వెసులుబాటు ఉంది.
చిత్రకృప : Ansel W