భీమ్ బెట్కా భారతదేశంలో ప్రాధాన్యత సంతరించుకున్న గుహలు. ఇవి మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో, అమర్ కంటక్ నది తీరాన కొండల మధ్యలో, రతపాని వన్యప్రాణి అభయారణ్యంలో ఉన్నాయి. ఒకప్పుడు ఆదిమానవులకు, ఆతర్వాత క్రూరమృగాలకు నివాసమైన ఈ ప్రదేశం నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది.
భీమ్ బెట్కా అన్న పేరు మహాభారతంలోని భీముడి పేరు మీద వచ్చింది. జూదంలో రాజ్యం పోగొట్టుకున్నాక పాండవులు కొంతకాలం ఈ గుహల్లో తలదాచుకున్నట్లు పురాణ కథనం. పాండవులు నివసించారన్న మాట అటుంచితే, అసలు మనిషి మొట్టమొదట జీవించి ఇక్కడే అట. పదిహేను వేల ఏళ్ల కిందటే ఆదిమానవుడు ఇక్కడ నివసించినట్లు ఆధారాలు కూడా లభ్యమయ్యాయి మన పురావస్తు శాఖవారికి.
భీమ్ బెట్కా గుహల ఎంట్రెన్స్
చిత్ర కృప : Tanujdeshmukh
ఎలా కనుగొన్నారు ?
భీమ్ బెట్కా గుహలు కనుగొనే తీరు ఆసక్తికరంగా ఉంటుంది. ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త వీ.ఎస్. వకాన్కర్ రైలులో భోపాల్ కు వెళుతుండగా తాను ఐరోపా ఖండంలో చూసిన గుహలను పోలిన వాటిని ఇక్కడ చూసాడు. ఆతర్వాత 1957 లో తన బృందంతో కలిసి గుహలను కనుగొన్నాడు.
ఇది కూడా చదవండి : ఇటార్సి - పర్యాటకులకు ఆసక్తి కలిగించే ప్రదేశం !
భీమ్ బెట్కా గుహల విశేషాలు
భీమ్ బెట్కా గుహలు ప్రాచీన శిలాయుగం కాలం నాటివి. ఈ గుహలు భారతదేశంలో ఆది మానవుడు నివసించాడు అనటానికి ఆధారం. ఈ గుహలలో లక్ష సంవత్సరాల క్రితం హోమో ఎరక్టస్ ఆదిమానవులు నివసించారు.
భీమ్ బెట్కా లోపలి దృశ్యం
చిత్ర కృప : Raveesh Vyas
భీమ్ బెట్కా లో మొత్తం 750 గుహలు కనుగొన్నారు అందులో 243 భీమ్ బెట్కా చెందినవిగా మరియు 178 లకర్ జువార్ వర్గానికి చెందినవిగా గుర్తించారు. ప్రస్తుతం ఈ గుహలలో సందర్శకుల కోసం 12 మాత్రమే తెరచి ఉంచారట.
పెయింటింగ్స్
ఆదిమానవులు వేసిన పెయింటింగ్స్ గుహలలో ప్రధాన ఆకర్షణలు. గుహలలో సుమారు 453 పెయింటింగ్స్ కలవు. ఇవి 30,000 ఏళ్ల క్రితం నాటివిగా చెబుతారు. ఈ గుహలు పూర్వం నాట్యం యొక్క ఉనికిని కూడా కనబర్చాయి. ఒకానొక రాతిగుహలో చేతిలో త్రిశూలం కలిగి నాట్యం చేస్తున్న భంగిమలోని చిత్రం ఇక్కడి పెయింటింగ్స్ లో కెల్లా సెంటర్ ఆఫ్ అట్ట్రాక్షన్స్. భీమ్ బెట్కా గుహలను యునెస్కో 2003 లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
రాతిగుహలో పెటింటింగ్స్
చిత్ర కృప : Bernard Gagnon
భీమ్ బెట్కా గుహలో ఉన్న ఏక శిలపై ఉపయోగించిన రంగుల యొక్క ముడిసరుకు బార్కేదా వనరుగా వ్యవహరించారు పురాతత్వ శాస్త్రవేత్తలు. కొన్ని వాతావరణ పరిస్థితుల కారణంగా గుహలలో అరుదైన చిత్రాల కోతకు గురైతున్నాయి. వీటిని సంరక్షించడం కోసం పురావస్తుశాఖ రసాయనాలను మరియు మైనాన్ని ఉపయోగిస్తున్నది.
సందర్శన సమయం : ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు భీమ్ బెట్కా గుహలను పర్యాటకులు/ యాత్రికులు సందర్శించవచ్చు.
తాబేలు ఆకారంలో అద్భుత రాతి నిర్మాణం
చిత్ర కృప : Surohit
భీమ్ బెట్కా గుహలకు ఎలా చేరుకోవాలి ?
భీమ్ బెట్కా గుహలు భోపాల్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కనుక ముందు భోపాల్ చేరుకొని అక్కడి నుంచి లోకల్ ట్రాస్పోర్ట్ ద్వారా భీమ్ బెట్కా చేరుకోవచ్చు.
వాయు మార్గం ద్వారా : భీమ్ బెట్కా గుహలకు సమీపాన 45 కిలోమీటర్ల దూరంలో రాజ భోజ్ ఎయిర్ పోర్ట్ కలదు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి విమానాలు వస్తుంటాయి. టాక్సీ లేదా క్యాబ్ అద్దెకు తీసుకొని భీమ్ బెట్కా సులభంగా చేరుకోవచ్చు.
రైలు మార్గం ద్వారా : భోపాల్ రైల్వే స్టేషన్ భీమ్ బెట్కా కు 37 కి. మీ ల దూరంలో కలదు. ఈ రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి, పట్టణాల నుండి చక్కగా కనెక్ట్ చేయబడింది.
రోడ్డు మార్గం ద్వారా : భీమ్ బెట్కా కు చుట్టుపక్కల ప్రాంతాల నుండి, భోపాల్, ఇండోర్ నుంచి ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి.