సాంచిలో.. శిలలపై శిల్పాలు చెక్కినారు!
శిలలపై శిల్పాలు చెక్కినారు... మనవాళ్లు సృష్టికే అందాలు దిద్దినారు అన్న పాట ఇక్కడ అక్షర సత్యం. అదే సాంచి చారిత్రక శిల్ప సంపద. భౌద్ధమత చారిత్రక స్థలాల సందర్శనకు సాంచి ఓ నిలయం. అద్భుత శిల్పకళా దృశ్యాలకు, అక్కడి సుందర ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులకు అనువైన ప్రాంతం. ఇక్కడి శిలలపై సందర్శకులకు అలనాటి సాంసృతిక విషయాలను అందించేందుకు ఏర్పాటు చేసిన మ్యూజియం ఓ అద్భుత ఆలోచన అని చెప్పొచ్చు. అంతటి చారిత్రక సంపదను మూటగట్టుకున్న సాంచిని సందర్శిద్దాం పదండి!!
మొట్టమొదటి బౌద్ధ సాంప్రదాయ కేంద్రంగా...
మధ్యప్రదేశ్లోని రాయ్సేన్ జిల్లాలో ఉన్న ఓ చిన్న గ్రామమే సాంచి. బౌద్ధస్థూపాలకు, స్మారక కట్టడాలకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. మూడవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం వరకూ చెందిన పలు బౌద్ధస్థూపాలకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. దీని కేంద్ర భాగంలో అర్ధగోళాకారంలోని ఇటుకలతో కట్టిన కట్టడంలో బుద్ధుని అస్థికలు ఉంచారు. దీని పైభాగాన గొడుగు ఉంది. అస్థికలకు నీడనిచ్చి, గౌరవించే ఉద్దేశంతో దీనిని నిర్మించారని భావిస్తున్నారు. ఇక్కడి నిర్మాణాల్లో అశోకా పిల్లర్ స్థూపాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా యునెస్కో గుర్తించింది. నిజానికి సాంచి ఒకప్పటి సంపన్న వ్యాపారులకు కేంద్రంగా ఉండేదట. ఇది మొట్టమొదటి బౌద్ధ సాంప్రదాయ కేంద్రంగా ఉద్భవించిందని ఇక్కడి శిలాఫలకాలపై పేర్కొన్న విషయాలు, శిల్పాల ద్వారా తెలుస్తోంది. బుద్ధుని జీవిత కాలంలో ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేదని స్థానికులు చెబుతుంటారు. అయినప్పటికీ ఇక్కడి ప్రజలు, శిల్పులు బుద్దుని ఓ మానవరూపంగా చూడలేకపోయారనేందుకు అక్కడి శిల్పాలే నిదర్శనం. కానీ, మన దేశంలో బౌద్ధమతం పతనంతో సాంచి స్థూపాలు ఉపయోగంలో లేకుండా పోయాయి. అంటే, పూర్తిగా కనుమరుగైపోయాయి. అయితే, సాంచిలోని స్థూపాల నాలుగు గేట్వేల కలయిక, అశోకా పిల్లర్, గ్రేట్ బౌల్ నిర్మాణంతోపాటు దాని వినియోగం సందర్శకులను అలనాటి బౌద్ధకాలానికి తీసుకుపోతాయనడం అతిశయోక్తికాదు.
పూర్వరూపులతో మ్యూజియం..ఔత్తాహిక శాస్త్రవేత్తలు, గుప్తనిధుల వేటగాళ్ల కారణంగా చాలా కట్టడాలు వాటి రూపు కోల్పోయాయి. అయితే, 1912-19 మధ్యకాలంలో సర్జాన్ మార్షల్ ఆధ్వర్యంలో పూర్వ ఆకారాలను కలిగేలా నిర్మాణాలను పునరుద్ధరించి, వాటి మొత్తాన్ని ఓ మ్యూజియంగా ఏర్పాటు చేశారు. మ్యూజియం తక్కువ స్థలం కారణంగా అసలు ప్రదేశం నుంచి కొత్త భవనంలోకి తరలించారు. ప్రస్తుత మ్యూజియంలో నాలుగు గ్యాలరీలతోపాటు ఓ పెద్ద హాలు ఉంది. పూర్వపు సంగకాలపు సంగీత ప్రాతినిధ్య గ్యాలరీ ఉత్తర గోడవైపు కనిపిస్తుంది. ఇందులో సాంచి పరిసర ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో బయటపడిన వస్తువులను ప్రదర్శనకు ఉంచుతారు. శుక్రవారం మినహా ప్రతిరోజూ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ మ్యూజియం సందర్శనకు అనుమతి ఉంటుంది.
ఎలా చేరుకోవాలి ?
సాంచి చేరుకునేందుకు అన్నిరకాల సౌకర్యాలు ఉన్నాయి. దీనికి దగ్గరలో ఉన్న రైల్వేస్టేషన్(45 కిలోమీటర్లు) భోపాల్. రాజాభోజ్ విమానాశ్రయం నుంచి దేశంలోని ఢిల్లీ, ముంబాయ్, జబల్పూర్, ఇండోర్, గౌలియార్ ఇలా అన్ని ప్రధాన విమాన సర్వీసులూ అందుబాటులో ఉంటాయి. రాజాభోజ్ విమానాశ్రయం నుంచి సాంచి చేరుకునేందుకు నిత్యం టాక్సీలు ఉంటాయి. బస్ కనెక్ట్విటీ కూడా ఉంది.