ఈ వర్షాకాలంలో కనుచూపుమేర విరబూసుకున్న పచ్చదనం..నింగిని తాకే కొండలు..హిమమంతో దోబూచులాడుతూ కనబడే గిరులపై నుండి కిందకు పరవళ్లు తొక్కుతూ జాలువారే పాలనురుగల్లాటి జలపాతాల...సెలయళ్ళ గలగలలు..అరుదైన వృక్ష, జంతు, జలచరాలు..చూపు తిప్పుకోనివ్వని హరిత సొబగులు..ఉల్లాసంగా ఆహ్లాదపరిచే వాతావరణం ..వెరసి ప్రకృతి సోయగాన్నంతా తన ఒడిలో నింపేసుకున్న పశ్చిమ కనుమలు. వాటి పరిధిలో ఉన్న ఉత్తర కర్నాటకలోని షిమోగా (శివమొగ్గ)జిల్లాలో అలరారుతున్న పర్యాటక సొగసులను తిలకించాలంటే షిమోగా వెళ్ళాల్సిందే.
మహారాష్ట్రలోని కందేశ్ నుండి తమిళనాడులోని కన్యాకుమారి వరకు దాదాపు 1600 కి.మీ మేర అవిచ్ఛిన్నంగా విస్తరించిన పర్వతశ్రేణులే పశ్చిమ కనుమలు (వెస్టర్న్ ఘాట్స్). కర్నాటకలో ఇవి సుమారు 270కి.మీ వ్యాపించి ఉన్నాయి. వీటిని ఆనుకుని ఉన్న షిమోగా జిల్లాలో ఉద్భవించే శరావతి నది. తన మార్గంలో పలు జలపాతాల, అభయారణ్యాలు, ఆనకట్టలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలతో ఈ వర్షకాలం మరింత పర్యాటక శోభను సంతరించుకుంది. కాలుష్యనగరాల్లో ఉరుకుల పరుగుల జీవితంతో సతమతమవుతన్న వారు కూసింత సేదతీరాలనుకునే వారికి వర్షాకాలంలో తప్పకుండా చూడవలసిన ప్రాంతం శివమొగ్గ. శివమొగ్గ చుట్టు ప్రక్కల ఉన్న ప్రధాన ఆకర్షణలు ఏంటో ఒకసారి చూసేద్దాం..
జోగ్ ఫాల్స్:
కర్నాటక రాష్ట్రంలో పశ్చిమ దిక్కున థ్రిల్లింగ్ గొలిపే, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన జలపాతం ఒకటుంది .. అదే 'జోగ్ జలపాతం'. ఈ జలపాతం శివమొగ్గ సరిహద్దులో, 100 కి. మీ. దూరంలో ఉత్తరం వైపున ఉన్నది. శరావతి నది నుండి ఏర్పడ్డ ఈ జలపాతం, 900 అడుగుల ఎత్తు నుండి కిందకు పడుతుంది. 900 అడుగుల ఎత్తు నుండి ఓంపు సొంపులతో కిందకు పడే ఈ జలపాతం పర్యాటకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది.
గజానూర్ డ్యాం:
శివమోగ్గ నుండి తీర్థహల్లి మార్గంలో 12కి.మీ దూరంలో ఈ గాజనూరు డ్యాం ఉంది. గాజనూర్ లోని s ఆకారంలో తుంగ నదిపై నిర్మించిన ఈ డ్యాము ఒక పిక్ నిక్ ప్రదేశం. ఈ ప్రదేశంలో పక్షుల కిలకిల రావాలు, గళగళ జలపాత సవ్వడులు వినడానికి వినసంపుగా ఉంటుంది.
గుడవి బర్డ్స్ సాంక్చూరి:
గుడవి పక్షుల అభయారణ్యం దట్టమైన అడవీ ప్రాంతంలో ఉంది. ఇక్కడ వివిధ జాతుల పక్షులుంటాయి. పక్షులను గమనించే వారికి ఎంతో ప్రియమైన ప్రదేశం ఇది. ఎన్నో రకాల పక్షులు జూన్ నుండి డిసెంబర్ వరకు ఇక్కడ ఉంటాయి. ఇది. 0.73 చ.కి.మీ.ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇది షిమోగాకు 15 కి.మీ. దూరంలోను మరియు సాగర్ కు 41 కి.మీ. దూరంలో ఉంటుంది. గుడవి కి షిమోగా నుండి బస్ సౌకర్యం కూడా ఉంది.
Photo Courtesy: S R Warrier
మందగాడ్డే బర్డ్స్ సాంక్చూరి:
మందగడ్డె పక్షి అభయారణ్యం చూడదగినది. తుంగ నది మధ్యలో ఉంది. అనేక పక్షి జాతులుంటాయి. ఇక్కడనుండి యాత్రికులు సాక్రేబైల్ ఏనుగుల శిక్షణ క్యాంపు మరియు గాజనూర్ డ్యాం చూడవచ్చు. ఇది సుమారు 1.14 ఎకరాలలో ఉంది. ఒక మంచి పిక్ నిక్ ప్రదేశంగా ఉంటుంది. ఈ పక్షి ప్రదేశంలో ఒక వాచ్ టవర్ కూడా ఉంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు ఈ ప్రాంతం ఎంతో అనుకూలంగా చూడవచ్చు. మందగడ్డె షిమోగాకు 30 కి.మీ. దూరం ఉంటుంది. బస్సు సౌకర్యం ఉంది.
Photo Courtesy: Karunakar Rayker
సక్రబైలు ఏనుగుల అభయారణ్యం:
షిమోగా కు సక్రేబాయలు ఎలిఫెంట్ కేంప్ 14 కి.మీ. దూరంలో ఉండి ఎంతో మంది పర్యాటకులను ఆనందపరుస్తుంది. ఈ ప్రదేశంలో బేబీ ఏనుగుల అనాధ శరణాలయం ఉంది. ఏనుగులకు మావట్లు ఇక్కడ శిక్షణనిస్తారు. సందర్శకులు ఇక్కడి తుంగ నది లో స్నానాలు చేస్తారు. ఏనుగులతో నీటిలో ఆడతారు. ఉదయం 8.30 గం. నుండి 11 గం. ల వరకు విహరించవచ్చు. షిమోగా నుండి ప్రతిరోజూ బస్ లు ఇక్కడికి నడుస్తాయి.
Photo Courtesy: paandu raam
అగుంబే:
భారత దేశంలో చిరపుంజి తరువాత అత్యధిక వర్షపాతం నమోదు చేసే ప్రాంతం అగుంబే. ఇక్కడ సన్ సెట్ చాలా బాగా ఉంటుంది. సముద్ర మట్టానికి 2725 అడుగుల ఎత్తులో ఉడిపి కి వెళ్లే మార్గంలో తీర్థహళ్ళి జలపాతాలకు 35 కి. మీ. దూరంలో ఉంది. అరేబియా మహా సముద్రంలోకి సూర్యుడు అస్తమించే సుందర దృశ్యాలను ఈ ప్రదేశంనుండి చూసి ఆనందించవచ్చు. ఈ సూర్యాస్తమం ఎలా ఉంటుందంటే వివిధ రకాలైన రంగులలో, ఆకారాలలో పర్యాటకులను అబ్బురపరుస్తుంటాయి.
Photo Courtesy:Sharath Chandra
కొడచాద్రి:
సముద్ర మట్టానికి 1411 మీటర్ల ఎత్తున ఉన్న ఈ కొడచాద్రి పట్టణం .. శివమొగ్గ కు 115 కి. మీ. దూరంలో భారతదేశంలో ఉన్న ప్రముఖ హిల్ స్టేషన్. ఇక్కడ చూపరులను ఆకట్టుకొనే విశేషం ఒకటుంది అదేమిటంటే కొడచాద్రి పర్వత శిఖరం దట్టమైన అడవుల మధ్యలో నుండి పైకి లేచినట్లు కనిపిస్తుంది. ఈ పట్టణం సుందరమైన ప్రదేశాలకు పెట్టింది పేరు కానీ ట్రెక్కింగ్ కాస్త కష్టం గా ఉంటుంది. అయినా కూడా పర్యాటకులు అడవిలో ట్రెక్కింగ్ ద్వారా నే శిఖరం పైకి చేరుకుంటారు.
Photo Courtesy: Adil Akbar
కూడ్లి:
షిమోగా పట్టణానికి 16 కి. మీ. దూరంలో ఉన్న కూడ్లి లో తుంగ మరియు భద్ర నదులు ఒకదానికొకటి కలుస్తాయి. అందుకే దానికి ఆ పేరు. దేవాలయాలు, హెరిటేజ్ ప్రదేశాలు అధికంగానే కనిపిస్తాయి. ఇది దక్షిణ వారణాసిగా పేరుగాంచినది. రుష్యశర్మ, బ్రహ్మేశ్వర, నరసింహ, రామేశ్వర ఆలయాలు ఇక్కడ ప్రధానంగా చూడవలసినవి.
ఇక్కేరి:
ఇక్కేరి, షిమోగా జిల్లాలోనే సాగర పట్టణం వద్ద ఉన్న చిన్న ఊరు. షిమోగా వచ్చే పర్యాటకులు ఈ పట్టణాన్ని తప్పక చూడాలి. ఈ ప్రాంతంలో గ్రానైట్ చే నిర్మించబడిన అఘోరేశ్వర దేవాలయం ప్రసిద్ధి. ఈ దేవాలయ రాతి గోడలు వివిధ రకాల బొమ్మలు కలిగి ఉంటాయి. గుడులు, ఏనుగులు, పురాతన కన్నడ లిపి వంటివి వీటిలో కొన్ని. ఈ దేవాలయాన్ని దర్శించే పర్యాటకులు భైరవ, మహిషాసురమర్దిని, సుబ్రమణ్య మరియు గణేష బొమ్మలను కూడా చూడవచ్చు.
జోగిగుండి వాటర్ ఫాల్స్:
జోగిగుండి జలపాతం పశ్చిమ కనుమల దట్టమైన అడవుల మధ్య ఉంది. ఈ జలపాతం ప్రత్యేక లక్షణం ఏంటంటే దాని మూలం. ఇవి సాంప్రదాయ జలపాతాల మాదిరిగా పైనుండి జలపాతాలు పడవు, కానీ అవి ఒక గుహ నుండి ఉద్భవించి కొండ గుండా ప్రవహిస్తాయి. ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి అనుకూలమైన ప్రదేశం. సగం రోజులో చుట్టి రావడానికి అనుకూలమైన ప్రదేశం.
కోటే సీతా రామాంజనేయ దేవాలయం:
ఈ ఆలయాన్ని హనుమంతునికి అంకితం చేయబడినది. ఈ దేవాలయం త్రేతాయుగం నాటిదని నమ్ముతారు. ఈ దేవాలయం తుంగభద్రానదీ తీరంను ఉంది.
PC: Chidambara
దొడ్డ బెట్ట:
హుత్రిదుర్గా ఒక అద్భుతమైన కొండ, ఈ హిల్ పైకి చేరుకోవడానికి ఎనిమిది మార్గాలున్నాయి. దీనిని దోద్దాబెట్ట అని కూడా అంటారు. ఈ కొండ శంకరేశ్వర ఆలయానికి అదనంగా అద్భుతమైన వ్యూ పాయింట్ కలిగి ఉంది.
PC: Ananth BS
సోమేశ్వర ఆలయం:
షిమోగా వెళ్లేవారు సోమేశ్వర , వెంకట్రమణ మరియు పద్మేశ్వర దేవాలయాలను కూడా సందర్శించవచ్చు.ఈ ఆలయాలన్నీ కూడా పురాతన వైభవాన్ని కలిగి ఉన్నాయి. అత్యద్భుతమైన శిల్పకాళా నైపుణ్యం కలిగిన కట్టడాలను చూడటానికి నయనమనోహరంగా ఉంటాయి. శివరామేశ్వర దేవాలయం చాలా ప్రసిద్ది చెందినది. ఈ దేవాలయం శివుడికి అంకితం చేయబడినది.
డబ్బేఫాల్స్:
షిమోగా వెళ్లే పర్యాటకులు తప్పకుండా చూడాల్సిన మరో పర్యాటక ప్రాంతం డబ్బే ఫాల్స్. ఇది కూడా సాగర్ తాలూకాలోని హొసగ్గుడె గ్రామంలో ఉంది. శరావతి నదిలోని ఓ పాయ నుంచి ప్రవాహం ఇటువైపుగా వెళ్తుంది. పర్వతాల నుంచి వచ్చే జలధారలు 110 మీటర్ల ఎత్తునుంచి కిందకు దూకుతాయి. పర్వతాల నుంచి రావడంతో ఇక్కడి జలధార నిత్యం కనువిందు చేస్తుంది.
త్యవరి కొప్ప లయన్ సఫారి:
త్వరికొప్ప లయన్ మరియు టైగర్ సఫారి షిమోగా జిల్లాలో ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రదేశం. ఇక్కడ ఎన్నో పక్షులు, జంతువులు వలస పక్షులు చిరుతలు, సింహాలు, పులులు జింకలు ఏనుగులు చూడవచ్చు. ప్రకృతి ప్రియులు తప్పక చూడాల్సిన ప్రదేశం. ప్రతి సంవత్సరం వర్షాకాలం తర్వాత సెప్టెంబర్ నుండి జనవరి వరకు సందర్శనకు అనుకూలం. త్యవరి కొప్ప సఫారి పార్కుకు షిమోగా నుండి 20 నిమిషాలలో చేరవచ్చు.
PC: Harikrishnan18
లింగనమక్కి డ్యాం:
ఇది జోగ్ జలపాతానికి పై భాగాన సుమారు 63 కిలోమిటర్ల దూరంలో ఉంది. 152 టీఎంసీల నీటి సామర్థ్ధ్యమున్న ఈ ఆనకట్ట పొడవు 2.3 కిలోమీటర్లు. ఈ డ్యాంను అభయారణ్యంలోనే నిర్మించారు. దీంతో డ్యాం పరిసర ప్రాంతాల్లో జీవవైవిధ్యం తొణికిసలాడుతున్నది. జలచర జంతువులకు ఈ డ్యాం ప్రసిద్ధి. చుట్టూ అడవులు.. నడుమ కనుచూపుమేరలో నీటి సొగసులతో పరుచుకుని ఉన్న ఈ ప్రాంతం ఆహ్లాదంగా ఉంటుంది. కర్నాటకలోని ప్రధాన జలవిద్యుత్ కేంద్రాల్లో ఇదొకటి.
శివమొగ్గ ఎలా చేరుకోవాలి ?
రోడ్డు మార్గం: జాతీయ రహదారి 206 ద్వారా టుంకూరు, అర్సికెరె, బాణవర, కడూరు, బీరూర్, తరికెరె, భద్రావతిల మీదుగా షిమోగా చేరవచ్చు. బెంగుళూరు నుండి 247 కి.మీ. లు ఉంటుంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులు నడుపుతోంది.
రైలు మార్గం: షిమోగా లో రైల్వే స్టేషన్ ఉంది. షిమోగా రైలు పై బెంగుళూరు, మైసూర్ స్టేషన్ లకు కలుపబడింది. బీరూర్ జంక్షన్ షిమోగా కు సమీపం.
విమాన మార్గం : షిమోగాకు సమీప విమానాశ్రయం మంగుళూరు. ఇది 180 కి.మీ. దూరం.
Photo Courtesy: Irrigator