భారత దేశం అనేక ఆలయాలకు నిలయం. ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఒక్క శివాలయం తప్పక ఉంటుంది. ఈ క్రమంలో దేశంలో ఒక్కొక్క శివక్షేత్రానికి ఒక్కొక్క కథ. మరోవైపు ఒక్కొక్క దేవాలయంలో శివుడు ఒకొక్క రూపంలో దర్శనమిస్తాడు. అయితే కొన్ని దేవాలయాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి ఇందుకు సదరు దేవాలయాలు, స్వయంభువుగా చెప్పుకునే విగ్రహాలు విభిన్నంగా ఉండటమే కాకుండా కొన్నింటి మర్మాలను తెలుసుకోవడం అసాధ్యమవుతోంది. వేలాది సంవత్సరాలుగా ఆ రహస్యాలను తెలుసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించినా సఫలం కాలేక పోతున్నారు. ఇక భక్తులు మాత్రం ఇదంతా దేవుడి మహత్యంగా భావిస్తూ తరతరాలుగా దేవుళ్లను కొలుస్తూ తమ కోరికలను తీర్చాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. కోరిన కోర్కెలు తీరిన తర్వాత మొక్కులు చెల్లిస్తూ ఇలాగే తమను, తమ బిడ్డలను చల్లగా చూడాలని వేడుకుంటున్నారు. ఇటువంటి కోవకు చెందినదే గుడిమళ్లెం అనే చిన్న గ్రమంలో ఉన్న శివుడి విగ్రహం. మామూలుగా శివుడు లింగాకారం భక్తులకు దర్శనమిస్తాడు. కాని ఇక్కడ మాత్రం పురుషాంగ విగ్రహం పై ఓ వేటగాడి రూపంలో కొలవుదీరి ఉన్నాడు. ఆ ప్రముఖ పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం...
1. ప్రపంచంలో మొదటి శివాలయం...
Image source
చిత్తూరు జిల్లాలోని తిరుపతికి సమీపంలో గుడిమల్లెం అనే చిన్న గ్రమం స్వర్ణముఖి నదీ తీరంలో ఉంది. ఇక్కడ అతి పురాతనమైన శివాలయం ఉంది. దీనిని పరుశరామేశ్వర దేవాలయంగా పిలుస్తారు. క్రీస్తూ పూర్వం మొదటి లేదా రెండో శతాబ్దంలో ఈ దేవాలయం నిర్మించినట్లు తెలుస్తోంది. బహుషా ప్రపంచంలో ఇదే మొదటి శివాలయంగా కూడా చరిత్ర, పురావస్తు నిపుణులు అంచనా వేస్తున్నారు.
2. ఏడాదిపాటు కష్టపడి
Image source
అయితే ఈ ఆలయం గర్భగుడిలోని మూల విరాట్టును ఎవరు, ఎప్పుడు ప్రతిష్టించారన్నదానికి మాత్రం ఇప్పటికీ ఆధారాలు లభించడం లేదు. 1911 గోపీనాథరావు పురావస్తు శాస్త్రవేత్త ఏడాది పాటు కష్టపడి పనిచేసి ఈ శివలింగం ప్రశస్తిని బయటి కనుగొని ప్రపంచానికి తెలియజేశాడు.
3. పురుషాంగం ఆకారంలో
Image source
ప్రపంచంలో మరెక్కడా ఇక్కడ ఉన్నట్లు శివలింగం ఉండదు. శివలింగం పురుషాంగ రూపంలో ఉంటుంది. దీని ఎత్తు 5 అడుగులు కాగా, వెడల్పు ఒక అడుగు. లింగం పై ముందు వైపు ఉబ్బెత్తుగా ఉంటుంది. ఇక ఈ లింగం పై పరమశివుడు ముందు చొచ్చుకు వచ్చినట్లు చెక్కబడి ఉంటారు.
4. వేటగాడి రూపు
Image source
అతని రూపు కూడా వేటగాడిని పోలి ఉంటుంది. కుడి చేతిలో గొర్రెను తలకిందులుగా వేలాడుతూ ఉండగా ఎడమ చేతిలో ఒక చిన్న గెన్నె ఉంటుంది. ఇక ఎడమ భుజం పై ఒక గండ్రగొడ్డలి కూడా ఉంటుంది. చెవులకు అనేక రింగులు ఆభరణాలుగా ఉంటాయి.
5. యజ్జోపవీతం లేకుండా
Image source
అదే విధంగా నడుము నుంచి మోకాలు వరకూ ఒక పలుచని వస్త్రాన్ని ధరించి ఉంటాడు. ఈ వస్త్రం లోపల ఉన్న శరీర భాగాలన్నీ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అంతే కాకుండా ఇక్కడ శివుడు యజ్జోపవీతాన్ని ధరించి ఉండరు. ఇక శివుడు యజ్జడి రెండు భుజాల పై నిలబడి ఉంటారు.
6. భూమి నుంచి ఆరు అడుగుల లోతులో
Image source
ఈ మొత్తం విగ్రహం భూమి నుంచి ఆరు అడుగుల లోతులో ఉండటం ఇక్కడ మరొక్క విశేషం. శిల్పం చెక్కిన తీరు, వస్ర్తధారణ తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ విగ్రహాన్ని రుగ్వేదకాలం నాటిదని చెప్పవచ్చు. ముదురు కాఫీ రంగుతో ఉన్న శిల పై మొత్తం విగ్రహాన్ని చెక్కారు.
7. ఆ శిల ఎక్కడి నుంచి వచ్చింది
Image source
అయితే ఈ శిల వంటిది ఈ చుట్టు పక్కల ఎక్కడా లేదు. అంతేకాకుండా ఈ శిల ఏ రకానికి చెందినదన్నది ఇప్పటికీ శాస్ర్తవేత్తలు కనిపెట్టలేక పోతున్నారు. ఆలయానికి తూర్పను ధ్వజస్థంభం ఉంది. దాని పక్కనే ద్వారం లేని ఒక చిన్న గది ఉంటుంది.
8. సూర్య కాంతి పాదాలను తాకుతుంది
Image source
ఈ గదికి మూడు రంద్రాలు ఉన్న కిటికీ ఉంటుంది. ఈ కిటికీ గుండా సూర్య కిరణాలు ప్రతి ఏడాది జూన్ 15 నుంచి 20 మధ్య కాలంలో గర్భగుడిలోని స్వామివారి పాదాలను తాకుతాయి. గుడి గోపురం గజపుష్ప ఆకాలంలో ఉంటుంది. ఈ దేవాలయాన్ని చంద్రగిరి రాజులు పూజించిన దాఖలాలు ఉంటాయి. ఇప్పటికీ చంద్రగిరి కోటలోని మ్యూజియంలో ఈ లింగాన్ని పోలిన లింగాన్ని మనం చూడవచ్చు.
9. స్వర్ణముఖి నదీ జలాలు కూడా
Image source
అదే విధంగా ఒకే విగ్రహంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను చెక్కిని తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక ప్రతి 60 ఏళ్లకు ఒకసారి స్వర్ణనదీ జలాలు స్వామి వారి పాదాలను అభిషేకిస్తాయి. ఈ విషయాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు. 2005 డిసెంబర్ 4న ఈ విధంగా నదీజలాలు స్వామివారిని తాకాయి. దీంతో 2065 ఏడాది డిసెంబర్ నెలలో ఈ అద్భుతం ఆవిష్కారమవుతుందని ఇక్కడి వారు చెబుతున్నారు.
10. రాగినాణ్యాల పై
Image source
ఉత్తరప్రదేశ్ లోని మధురలో ఉన్న మ్యూజియంలో ఓ శివలింగాన్ని భద్రపరిచారు. దీనిని ఒకటో శతాబ్దం నాటిదిగా చెపుతున్నారు. ఈ లింగం గుడిమల్లెంలోని శివలింగాన్ని పోలి ఉంటుంది. అదే విధంగా ఉజ్జయినిలో క్రీస్తుపూర్వం మూడో శతాబ్దానికి చెందిన కొన్ని రాగినాణెలు లభించాయి. వాటి పై కూడా గుడిమల్లెంలోని శివలింగాకారం ఉండటం విశేషం.
11. విప్రపీఠంగా
Image source
ఇక్కడ జరిపిన తవ్వకాల్లో గంగపళ్లవ, చోళ, బాన, ఆంధ్రశాతవాహనుల కాలం నాటి అనేక శాసనాలు బయటపడ్డాయి. వీటిలో చాలా వరకూ తమిళభాషలో ఉండటం గమనార్హం. ఈ శాసనాలు చాలా వరకూ దేవాలయం నిర్మాణం విశిష్టతలను తెలియజేస్తున్నాయి. ఈ గ్రామాన్ని విప్రపీఠం అంటే బ్రహ్మణ అగ్రహారంగా పేర్కొనబడింది.
12. పరుశరాముడు ఇక్కడే
Image source
పరుషరాముడు తన తండ్రి మాట ప్రకారం తల్లిని వధించిన విషయం తెలిసిందే. ఆ పాపం పోగొట్టుకోవడానికి గుడిమల్లెంలోనే శివుడి ఆరాధన చేశాడని స్థలపురాణం. ఇందు కోసం ఇక్కడ ఒక చెరువును కూడా నిర్మించాడని ఈ చెరువులో పూసే ఒక పువ్వుతోనే రోజూ శివుడిని ఆరాధించేవాడని కథనం.
13. ఎలా చేరుకోవాలి
Image source
దేశంలోని వివిధ చోట్ల నుంచి తిరుపతికి నేరుగా బస్సులు, రైళ్లు ఉన్నాయి. అక్కడి నుంచి దాదాపు 20 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేస్తే గుడిమల్లెం చేరుకోవచ్చు.
14. మరిన్ని చూడదగిన ప్రదేశాలు
Image source
తిరుపతి, వెంకటేశ్వరస్వామి, తిరుపతి జూ, హార్సీహిల్స్, కైలాసకొండ వాటర్ ఫాల్స్, కాణిపాకం, శ్రీకాళహస్తి, తలకోణ తదితర పర్యాటక ప్రాంతాలను చిత్తూరు జిల్లాలో చూడవచ్చు.