దేశంలో ఉన్న నారసింహ క్షేత్రాలలో అతి పాచీనమైనది విశాఖపట్టణం జిల్లాలోని సింహాచలం క్షేత్రం. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్టణము నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది.
ఇది కూడా చదవండి : వైజాగ్ : ప్రకృతి ప్రసాదించిన వరం .... బొర్రా గుహలు !!
ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం (52 కోట్ల రూపాయలు) కలిగిన దేవాలయము. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది; మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది.
సింహం యొక్క పర్వతము
సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్దం వరకు కనిపిస్తున్నది. కాని భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు. సింహాచలం అంటే సింహం యొక్క పర్వతము అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాలలో నాల్గవదైన లక్ష్మీ నరసింహ అవతారమూర్తిగా వెలశాడు.
చిత్రకృప : Anirudh Emani
చందనంతో పూత పూస్తారు
స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తుంటారు. వరాహము నరుడు మరియు సింహము రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్రలో వరాహము తల సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది.
చిత్రకృప : Adityamadhav83
శ్రీవైష్ణవ సంప్రదాయం
సింహగిరి స్వామి నరసింహదేవరగా ప్రఖ్యాతుడు. స్వామి వారి ప్రసూనాల కోసం తిరునందనవనం కల్పించే శాసనం. ఇప్పటి నుండి ఈ దేవాలయంలో ద్రావిడ శ్రీవైష్ణవ సంప్రదాయం కనబడుతుంది.
చిత్రకృప : Adityamadhav83
గాలి గోపురము-సింహ ద్వారం
సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖముగా కాకుండా, పడమర వైపు ముఖమును కలిగి ఉంటుంది. కొండ మీద నుండి గాలి గోపురము మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 41 మెట్లు ఉంటాయి.
చిత్రకృప : Adityamadhav83
కప్ప స్తంభం
దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారములో కప్ప స్తంభం ఉంది. ఈ స్తంభం సంతాన గోపాల యంత్రం పై ప్రతిష్ఠితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనది అని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ కప్పస్తంభమును కౌగిలించుకొంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.
చిత్రకృప : Anikingos
జల ధారలు
సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. ఈ కొండలపై సహజసిద్ధమైన జలధారలు ఉన్నాయి. వీటిలో కొన్ని: గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార లు. భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి, దైవదర్శనం చేసి తరిస్తారు.
చిత్రకృప : Adityamadhav83
భైరవ వాక
సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది భైరవ వాక. ఆడివివరం గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉంది. ఇక్కడ భైరవస్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు. 13-16 శతాబ్ధాల మధ్య ఈ ప్రాంతం భైరవపురంగా ప్రాముఖ్యత పొందినది.
చిత్రకృప : Adityamadhav83
వరాహ పుష్కరిణి
వరాహ పుష్కరిణి సింహగిరి కొండ క్రింద ఆడవివరం గ్రామంలో ఉంది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకమారు తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకొని వచ్చి నౌకావిహారం చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉంది.
చిత్రకృప : Santoshvatrapu
మాధవధార
సింహాచలంలో మాధవస్వామి దేవాలయం ఉంది. గిరిప్రదక్షిణం సమయంలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు.
చిత్రకృప : Adityamadhav83
పూజా టికెట్లు దొరికే స్థలాలు
అన్ని పూజా టికెట్లను గుడిలోని కప్ప స్తంభం వద్ద ఇస్తారు. వంద రూపాయల టికెట్ ను గుడి గాలిగోపురం వద్ద, ఇరవై రూపాయల టికెట్ ను క్యూ లైన్ మధ్యలోనే ఇస్తారు.
ప్రసాదాలు : రవ్వ లడ్డూ - రూ. 2/-, చక్కెర పొంగలి - రూ.3/-, పులిహోర - రూ.5/-, లడ్డూ - రూ.5/-.
చిత్రకృప : Thamizhpparithi Maari
పండుగలు
సంవత్సరం పొడుగునా సింహాచలేశునికి ఉత్సవాలు పండుగలు జరుగుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని: కల్యాణ మహోత్సవాలు, రథోత్సవం, చందనోత్తరణం, చందనోత్సవం, వైశాఖ పూర్ణిమ, జ్యేష్ఠ పూర్ణిమ, శయనోత్సవం, ఆషాఢ పూర్ణిమ, కరాళ చందనం, పవిత్రోత్సవం, శరన్నవ రాత్రులు, విజయదశమి, శమీపూజ, క్షీరాబ్ధి ద్వాదశి, వైకుంఠ ఏకాదశి, గోదా కళ్యాణం, మకరి వేట, తెప్పోత్సవం, డోలోత్సవం, నరసింహ జయంతి.
చిత్రకృప : Srinivasa
స్వామి కైంకర్యాలు-దర్శన వేళలు
దేవాలయంలో దర్శనవేళలు - ఉదయం 7 నుండి 11.30 వరకు తిరిగి మధ్యహ్నం 12.30 నుండి 2.30 వరకు తిరిగి మధ్యహ్నం 3.30 నుండి 7 వరకు మరియు రాత్రి 8.30 నుండి 9 వరకూ దర్శనం లభిస్తుంది.
చిత్రకృప : Krishnachaitu
సింహాచలం - ఇతర దర్శనీయ స్థలాలు
ఆండాళ్ సన్నిధి, సింహవల్లీ తాయారు సన్నిధి, లక్ష్మి నారాయణ సన్నిధి, త్రిపురాంతక స్వామి గుడి, రాముల వారి ఆలయం, కాశీ విశ్వేశ్వర స్వామి గుడి, మెట్ల మార్గంలో ఆంజనేయస్వామి గుడి, కొండపై కృష్ణదేవరాయలు వేయించిన విజయస్థూపం మొదలగునవి చూడదగ్గవి.
చిత్రకృప : Adityamadhav83
వసతి సౌకర్యాలు
కొండపై దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే కొన్ని సత్రాలు ఉన్నాయి. పర్యాటక శాఖ వారి చందన రెస్ట్ హౌస్, తితిదే కాటేజీలు కూడా కలవు. కొండ దిగువన ప్రవేట్ లాడ్జీలు, హోటళ్ళు ఉన్నాయి.
చిత్రకృప : Adityamadhav83
సింహాచలం ఆలయం చేరుకోవడం ఎలా ?
వైజాగ్ విమానాశ్రయం నుండి 11 కి.మీ., వైజాగ్ రైల్వే స్టేషన్ నుండి 11 కి.మీ., వైజాగ్ బస్ స్టాండ్ నుండి 12 కి.మీ. ల దూరంలో సింహాచలం కలదు. వైజాగ్ నుండి ప్రతిరోజూ పదుల సంఖ్యలో క్యాబ్ లు, ఆటోలు, ప్రభుత్వ బస్సులు, సిటీ బస్సులు సింహాచలానికి వెళుతుంటాయి.
చిత్రకృప : Adityamadhav83
కొండ పైకి చేరుకోవటానికి
కొండ పైకి చేరుకోవటానికి సింహాచలం దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులలో చేరుకోవాలి. సొంత వాహనాలు ఉన్నవారు టోల్ రుసుము చెల్లించి కొండపైకి చేరుకోవచ్చు (బైక్, కార్ ఇలా ఏదైనా సరే). కొండపైన వాహనాలకు పార్కింగ్ సదుపాయం కూడా కలదు. గాలిగోపురం వద్ద వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక లిఫ్ట్ సౌకర్యం ఉన్నది.
చిత్రకృప : Adityamadhav83