కేరళ రాష్ట్రంలో దేవికులం ఒక హిల్ స్టేషన్, బహుషా దీని గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉండవచ్చు. అయితే పచ్చని ప్రకృతి అందాలతో, కాఫీ తోటల పరిమళాలతో, సుగంధ ద్రవ్యాల సువాసన లతో అలరారుతుంది కాబట్టి, పర్యాటకులను ఆహ్వానం పలుకుతోంది. ఈ ప్రదేశం గురించి తెలియక పర్యాటకుల సందర్శన తక్కువగా ఉన్న ఈ చుట్టు పక్కల ఉన్న సుందరమైన దృశ్యాలు, జలజలపారే జలపాతాలు మరియు అందమైన పరిసరాలు పర్యాటకులకు మంచి ఆహ్లాదం కలిగిస్తాయి.
దేవికులం ఇడుక్కి జిల్లాలో మున్నార్ ప్రాంతానికి 7కిలోమీటర్ల దూరంలో దేవికులం ఉంది. దేవి కులంలో హిల్ స్టేషన్ లోని జంతు మరియు వృక్ష సంపదను చూసి తనివితీరా ఆస్వాదించవచ్చు. ఈ హిల్ స్టేషన్ ట్రెక్కింగ్ కూడా అనువైన ప్రదేశం. ముఖ్యంగా ఇక్కడ ఉండే స్థానికుల చేపల వేట వీరికి ఆనందాన్నించే మరో ప్రక్రుతి సౌందర్యం. పర్యాటనలు అభిలషించేవారికి స్వర్గదామంగా చెప్పుకునే ఈ దేవికులం తోటలు, ఎర్రటి బంక చెట్ట మధ్య ట్రెక్కింగ్ చేస్తుంటే మహదానందం కలిగిస్తుంది.
రామాయణ కాలంలో సీతాదేవి
రామాయణ కాలంలో సీతాదేవి ఈ సరస్సులో స్నానం చేసిందని ఇతిహాసాలా ద్వారా తెలుపబడినది. ఈ సరస్సు ఉన్న ప్రదేశంలో పొడవైన చెట్ల నీడ, పచ్చటి ప్రదేశం, చల్లని స్వచ్చమైన నీరు రాళ్ళగుండా ప్రవహించడం, పక్షుల కిలకిలారావాలు, వంటి వాటితో సీతాదేవి సరస్సు ఒక చక్కటి వినోద ప్రాంతంగా చెప్పవచ్చు. స్వర్గం దిగివచ్చిందా అని అనిపించేలా ఉన్నా ఈ ప్రాంతాన్ని పర్యాటకులు తప్పక చూడాలి.
సీతాదేవి సరస్సు
సీతాదేవి సరస్సు ఉన్న దేవికులం సమీపంలో ఉన్న హిల్ స్టేషన్ మున్నారు. ఇడుక్కి జిల్లాలో ఉన్న ఈ రెండు హిల్ స్టేషన్లు ఒకదానికొకటి 7కి.మీ దూరంలో ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని సందర్శించవల్సిన ప్రదేశాలు కూడా ఉన్నాయి...
PC:Vishnu1409
ఇడుక్కి ఆర్చ్ డ్యాం
ప్రతి రోజు ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి వచ్చే ఎందరో పర్యాటకులని ఇడుక్కి ఆర్చ్ డ్యాం ఆకర్షిస్తోంది. ఆసియా లో నే మొదటి ఆర్చ్ డ్యాం కాగా ప్రపంచం లో నే రెండవ ఆర్చ్ డ్యాం గా ఇడుక్కి ఆర్చ్ డ్యాం ప్రాచుర్యం పొందింది. పెరియార్ నది పైన, కురవన్మల మరియు కురతిమల కొండల మధ్య ఈ డ్యాం అందంగా కట్టబడినది.
PC : http://www.kseb.in/
మట్టుపెట్టి సరస్సు
సందర్శకుల దృష్టిని ఆకర్షించే మరో ఆసక్తికర ప్రదేశం, మున్నారు పట్టణం నుంచి 13కిలోమీటర్ల దూరంలో ఉన్న మట్టుపెట్టి. దేవి కులంలోని అందమైన కొండలపై సుమారు 1700 అడుగుల ఎత్తున ప్రశాంత వాతావరణంలో మట్టుపెట్టి సరస్సు ఉన్నది. ఈ ప్రదేశంలోని దట్టమైన అటవీ పర్వత ప్రదేశాలు, సుగంధ ద్రవ్యాల తోటలు పర్యాటకుడి మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తాయి. ఇందులో అద్భుతమైన బోటు రైడిరగ్కు అనుమతిస్తారు, పక్కన ఉన్న కొండలు మరియు లాండ్ స్కేప్లను ఆస్వాదించవచ్చు. ఈ సరస్సులో బోటింగ్ చేయవచ్చు. స్పీడ్, మోటర్, పెడల్ బోటింగులు అద్దెకు లభిస్తాయి.
PC : Tahir Hashmi
కుండల సరస్సు
కుండల సరస్సు దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో కలదు. ఈ సరస్సు సముద్రమట్టానికి 1700 మీటర్ల ఎత్తున ఉండి, కుండల ఆర్చ్ డామ్ కి సమీపంలో ఉంటుంది. కాశ్మీరి షికర బోట్ లు, పెడల్ బోట్ లు వంటివి అద్దెకు తీసుకొని సరస్సులో బోటింగ్ చేయవచ్చు. వీటితో పాటు సరస్సు వెనుక ఉన్న టీ తోటలు, గోల్ఫ్ మైదానాలు పర్యాటకులను ఆనందింపజేస్తాయి.
PC :Arun Roy
తేయాకు మరియు సుగంధ ద్రవ్యాల తోటలు
దేవికులం లో ఉన్న టీ మరియు సుగంధ ద్రవ్యాల తోటలు పర్యాటకుల్ని తప్పక చూసేవిలా చేస్తాయి. ఈ ప్రాంతం అంతా కూడా ఈ మొక్కల సువాసనలతోనే మత్తెక్కిస్తాయి. కొన్ని అరుదైన మొక్కలను, కంటికి అందంగా కనిపించే చెట్ల వరుసలను ఇక్కడ చూడవచ్చు. తోటల వద్ద తాజా ఆకులతో తయారు చేసిన ఒక్క కాఫీ లేదా టీ తాగితే, దాని రుచికి వావ్ ..! అనకమానరు.
PC : Anu Kartha
బ్లోస్సోమ్ అంతర్జాతీయ పార్క్
బ్లోస్సోమ్ అంతర్జాతీయ పార్క్ మున్నార్ పరిధిలో, కొచ్చిన్ కు వెళ్లే మార్గంలో ఉంటుంది. ఈ పార్క్ కాంప్లెక్స్ సైక్లింగ్, బోటింగ్ సైక్లింగ్ మరియు రోలర్ స్కేటింగ్ వంటి సౌకర్యాలను అందిస్తున్నది. వీటితో పాటుగా ట్రీ హౌస్, రోప్ వే, పిల్లల కొరకు రకరకాల క్రీడలను కలిగిఉంది.
PC :Alok Nanda
పల్లివాసల్ జలపాతం
పల్లివాసల్ జలపాతాలు చిన్నవే అయినప్పటికి ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి దేవి కులంలో సీతా దేవి సరస్సుకు సమీపంలో కలవు. పర్యాటకులు ఈ ప్రదేశంలో మానసికంగాను, శారీరకంగాను ఆహ్లాదాన్ని పొందవచ్చు. ఇది మున్నారు నుంచి చిత్తిరపురం నుంచి 3కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది కేరళలోని మొదటి హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్కు వేదిక. ఇది అద్భుతమైన దృశ్య సౌందర్యానికి కేంద్రం మరియు సందర్శకులు దీన్ని ఒక ప్రముఖ పిక్నిక్కేంద్రంగా పరిగణిస్తున్నారు..
PC : Rajesh T
తూవనం జలపాతాలు
తూవనం జలపాతాలు దేవికులం హిల్ స్టేషన్ లోని మరయూర్ కి 18 కి. మీ. దూరంలో ఉన్నాయి. ఈ జలపాతాలు అందంగా ఉండి పర్యాటకులను, ఫోటోగ్రాఫర్లను మంత్ర ముగ్ధులను చేస్తాయి. ట్రెక్కర్ లకు ఈ ప్రాంతం ఆసక్తికరంగా ఉంటుంది. జలపాతాలకు చేరుకొనే మార్గంలో వన్య జంతువులను, మొక్కలను చూడవచ్చు.
PC : Ajith U
దేవికులం ఎలా చేరుకోవాలి
వాయు మార్గం దేవి కులం పట్టణానికి కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం 111 కి.మీ.ల దూరంలో కలదు. కొచ్చి విమానాశ్రయం దేశంలోని బెంగుళూరు, చెన్నై, ముంబై మరియు ఢిల్లీ వంటి ప్రనధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది. పర్యాటకులు విమానాశ్రయం నుండి టాక్సీలలో దేవికులం చేరవచ్చు.
రైలు మార్గం
దేవికులంకు నేరు రైలు మార్గం లేదు. అయితే, పర్యాటకులు కొచ్చి నుండి లేదా కొట్టాయం రైల్వే స్టేషన్ ల నుండి దేవికులం చేరవచ్చు. కొచ్చి 150 కి.మీ., కొట్టాయం 136 కి.మీ.ల దూరం కలదు. ఈ రైలు స్టేషన్లనుండి దేవికులంకు అద్దె టాక్సీలు లేదా ప్రయివేటు కార్లలో చేరవచ్చు.
రోడ్డు మార్గం
దేవికులంకు కొచ్చి మరియు కొట్టాయం నుండి రోడ్డు మార్గం సులభంగా ఉంటుంది. రోడ్డు ప్రయాణంలో చుట్టు పక్కల అందమైన పరిసరాలను కూడా ఆనందించవచ్చు. ప్రభుత్వ మరియు ప్రయివేటు బస్సులు తరచుగా నడుస్తూంటాయి.
Photo Courtesy: Navaneeth KN