ఆలయాలు దేవదేవుళ్ళ నివాసాలు. దేవుణ్ణి చూడటానికి ప్రతి ఒక్కరూ ఆలయానికి వెళ్లివస్తుంటారు. చిన్నా, పెద్దా, పేద, ధనిక వంటి తేడా లేకుండా అందరూ దేవుని నివాసానికి వెళ్లి తమ కోరికలు నెరవేరేలా వేడుకుంటారు.
తీరా ఆ కోరిక నెరవేరాక అక్కడికే వచ్చి మొక్కుబడిని చెల్లించుకుంటారు. ఇది ప్రతి చోటా జరిగే సాధారణ నియమాలే! భారతదేశంలో స్త్రీలకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.
ఆడవారిని దేవతలుగా సైతం పూజిస్తున్న గొప్ప సంస్కృతి మనది (లక్ష్మి దేవి, సరస్వతి దేవి, పార్వతి దేవి మొదలైన వారు). దేశ ప్రధానిగా , రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పలువురు ఆడవాళ్లు రాజకీయాల్లో చక్రం తిప్పారు/ తిప్పుతున్నారు. క్రీడా రంగం, విద్యారంగం, వ్యాపార రంగం, శాస్త్ర సాంకేతిక మొదలైన రంగాలలో కూడా ఆడవారు ఆధిపత్యాన్నికొనసాగిస్తున్నారు.
భరతమాత పుట్టిన ఈ గడ్డ మీద ఇప్పటికీ ఆడవారు కొన్ని కొన్ని చోట్ల అవమానించబడుతున్నారు, బహిష్కరించబడుతున్నారు. మన దేశంలో కొన్ని ఆలయాలలో ఇప్పటికీ స్త్రీలకు ప్రవేశం లేదు. మీకు శబరిమల ఒక్కటే తెలుసు కానీ అలాంటివి మన దేశంలో ఎన్నో ఉన్నాయి. అక్కడ స్త్రీలను లోని అనుమతించరు. వాటిలో కొన్ని ఆలయాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం !
కామాఖ్యా ఆలయం
కామాఖ్యా దేవి ఆలయం గౌహతికి 7 కిలోమీటర్ల దూరంలో నీలాచలం కొండపై కలదు. ఇది 51 శక్తి పీఠాలలో ఒకటి. కాళీమాత మరో రూపమైన కామాఖ్యాదేవిని రుతుస్రావం కలిగిన మహిళలు దర్శించటానికి వీలులేదు. ఇది ఆలయ నియమం.
కార్తికేయ ఆలయం
పుష్కర్ (రాజస్థాన్) మరియు పెహోవ (హర్యానా) లోని కార్తికేయ ఆలయంలోకి స్త్రీలు రావటం నిషేధం. ఒకేవేళ వస్తే వారికి పాపాలు చుట్టుకుంటాయని స్థానికుల అభిప్రాయం.
మవాళీ మాతా మందిరం
మవాళీ మాతా మందిరం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతరి లో కలదు. ఇక్కడ దేవాలయంలోకి స్త్రీలు రావటం కొద్ది రోజులక్రితం నిషేదించారు. కారణం పూజారికి కలలో దేవత కనిపించి నేను కన్య అని, కనుక మహిళలు లోనికి అనుమతించకూడదని చెప్పిందట.
హాజీ అలీ దర్గా
హాజీ అలీ దర్గా ముంబై కి సమీపంలో అరేబియా సముద్ర తీరంలో కలదు. ఇక్కడ దర్గా తో పాటు మసీదు కూడా కలదు. దర్గా లోని మజార్ (లోపలి భాగంలోని పవిత్ర స్థలాన్ని)ను సందర్శించటానికి మహిళలకు అనుమతి లేదు.
మంగళ్ చాందీ ఆలయం
మంగళ్ చాందీ ఆలయం జార్ఖండ్ లోని బొకారో నగరంలో కలదు. ఈ ఆలయంలో మగవారు మాత్రమే పూజలు జరిపిస్తారు. ఆడవారికి ప్రవేశం లేదు. ఒకవేళ జరిపించాలనుకుంటే గుడి బయట 50 మీటర్ల దూరంలో నిలబడి పూజ చేయాలి.
శ్రీ కృష్ణ ఆలయం
త్రివేండ్రం సమీపంలోని మలయింకేజ్హు గ్రాంలోని శ్రీ కృష్ణ ఆలయంలోకి కూడా మహిళలను అనుమతించరు. ఈ సంప్రదాయం ఎప్పుడో ప్రాచీన కాలం నుండి ఉంది. ఆలయంలోని నళంబళం ప్రదేశంలోకి మహిళలు ప్రవేశించరాదని ట్రావెన్కోర్ రాజు శ్రీ మూలం తిరుణాల్ హుకుం జారీ చేసాడు.
పట్బౌసి సత్ర
ఇదొక మొనాస్టరీ. అస్సామ్ లోని బర్పేట ప్రాంతంలో కలదు. దీనిని క్రీ. శ. 15 వ శతాబ్దంలో సెయింట్ శ్రీమంత శంకరదేవ నిర్మించాడు. మొనాస్టరీ లోని గర్భగుడిలో మహిళలు ప్రవేశించడం ఇక్కడ నిషేధం. 2010 లో పాత విధానాలకు స్వస్తి చెప్పి అప్పటి అస్సాం గవర్నర్ జెబి పట్నాయక్ 20 మంది స్త్రీలతో లోని ప్రవేశించి ప్రార్థనలు జరిపాడు. అయినప్పటికీ మొనాస్టరీ లో స్త్రీల ప్రవేశం పై నిషేదాజ్ఞలు కొనసాగుతున్నాయి.
జైన ఆలయం
రాజస్థాన్ లోని రానక్పూర్ లో గల జైన దేవాలయంలో రుతుస్రావం కలిగిన స్త్రీలు లోని రావటం నిషేధం. ఆలయంలోకి స్త్రీలు వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని వెళ్ళాలి. ఆలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆడవారు మోకాలు చిప్పల కిందవరకూ దుస్తులు ధరించాలి.
అయ్యప్ప స్వామి ఆలయం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అయ్యప్ప ఆలయం కేరళ రాష్ట్రంలో కలదు. ఏటా ఈ ఆలయాన్ని 10కోట్ల మంది దర్శితుంటారని అంచనా. బ్రహ్మచారి అయిన అయ్యప్ప దర్శనానికి 10 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు గల మహిళలలను లోనికి అనుమతించరు. ఇది ఆలయ నియమం.
శనిశింగపూర్ ఆలయం
శనిశింగపూర్ ఆలయం షిర్డీ నుండి 70 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడ శని దేవునికి మగవారు మాత్రమే పూజలు చేయాలి. ఆడవారు పూజలు చేయటం నిషేధం.