రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
ఏటా రథసప్తమి రోజున అరసవల్లి క్షేత్రంలో కొలువైన సూర్యనారాయణస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ప్రత్యక్ష భగవానుడైన ఆదిత్యుని నిజరూపాన్ని చూసి తరించాలని కోరుకుంటారు. ఆ సమయం రానే వచ్చింది. ఈ నెల (జనవరి) 27వ తేదీ అర్ధరాత్రి నుంచి అరసవల్లిలో రథసప్తమి పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. దేశంలోని ప్రసిద్ధ సూర్య భగవానుడి ఆలయాల్లో ఒకటిగా, రాష్ట్రంలోనే ఏకైక ప్రాచీన సూర్య భగవానుడి ఆలయంగా ప్రసిద్ధి చెందిన అరసవల్లి క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం రండి.
తెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి వేడుకలకు ఆలయాలు ముస్తాబవుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లిలో సూర్య జయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. నిత్యపూజలు అందుకుంటున్న అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మాఘశుద్ధ సప్తమి(రథసప్తమి) రోజున అరసవల్లి క్షేత్రంలో కొలువైన సూర్యనారాయణస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. ఆంధ్రప్రదేశ్లో గల ఏకైక ప్రాచీన సూర్య భగవానుడి ఆలయంగా ప్రసిద్ధి గాంచింది శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి క్షేత్రం.
ఆలయ నిర్మాణాంలో ప్రత్యేకత..
రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పట్టణ కేంద్రానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో అరసవల్లి అనే గ్రామంలో ఈ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆరాధ్య దైవంగా ఇక్కడి సూర్య భగవానున్ని పూజిస్తారు. ఈ ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా రెండు పర్యాయాలు సూర్యోదయాన సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న మూల విరాట్టు పాదాలను తాకేలా ఈ ఆలయాన్ని నిర్మించారు.
ఈ దృశ్యం భక్తుల్లో ఆనంద పారవశ్యాన్ని, ఆధ్యాత్మికతను నింపుతుంది. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు అశేషంగా తరలివస్తారు. దేవస్థానం ప్రాంగణంలోని అనివెట్టి మండపం, సుదర్శన ద్వారం మధ్యలో సూర్యుని తొలికిరణాలు గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టును తాకి గొప్ప తేజస్సును అందిస్తాయి. ప్రతి సంవత్సరం మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లో, అక్టోబర్ 1, 2, 3, 4 తారీఖుల్లో ఈ అద్భుతం ఆవిష్కృతమవుతుంది. ఈ అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే అన్నీ పాపాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం.
కన్నుల పండుగగా రధసప్తమి వేడుకలు
అరసవిల్లి సూర్య నారాయణ స్వామి వారికి రధ సప్తమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అరసవల్లి సూర్య భగవానుడికి విశేషమైన పర్వదినం ఇది. ఈ రోజు కోసం భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. వేద పండితులు స్వామి వారికి వేద మంత్రోచ్ఛారణల నడుమ మంగళ ధ్వనులతో మహా క్షీరాభిషేక సేవను నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు, ఆదిత్యుని దర్శనం చేసుకునేందుకు లక్షలాది సంఖ్యలో రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు తండోప తండాలుగా తరలివస్తారు.
అరసవల్లికు ఎలా వెళ్లాలి?
శ్రీకాకుళంకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి విరివిగా బస్సు రవాణా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ కు చేరుకుని అక్కడికి నుంచి శ్రీకాకుళంకు బస్సులో చేరుకోవచ్చు. విశాఖ నుంచి శ్రీకాకుళంకు ప్రతి 30 నిమిషాలకు బస్సులు నడుస్తుంటాయి. శ్రీకాకుళం పట్టణం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయానికి అనేక ఆటోలు, ప్రైవేటు వాహనాలు నిత్యం అందుబాటులో ఉంటాయి.
శ్రీకాకుళానికి సమీప విమానాశ్రయం విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది ఇక్కడికి 116 కిలోమీటర్లు దూరంలో ఉంది. అలాగే, రైలు మార్గంలో చేరుకోవాలనుకునేవారు జిల్లా కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ (ఆమదాలవలస)లో దిగాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి నిత్యం బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి.