కేరళలోని తిరునెల్లి దేవాలయంలో ప్రధానంగా పూజలు అందుకొనేది విష్ణువు. ఈ తిరునెల్లి దేవాలయాన్ని స్వయంగా బ్రహ్మ దేవుడు కట్టించాడని చెబుతారు. అంతే కాకుండా ఈ తిరునెల్లి దేవాలయం నుంచి నేరుగా వైకుంఠానికి వెళ్లడానికి దారి ఉందని చెబుతారు. ఇక్కడకు ప్రతి రోజు బ్రహ్మ విష్ణువును పూజించడానికి వస్తాడని ఇందుకు తగిన ఆధారాలు కూడా పూజారులు చూపిస్తారు. అందువల్లే ఈ దేవాలయం సందర్శిస్తే మన తల రాత రాసే సమయంలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే బ్రహ్మమారుస్తాడని చెబుతారు. ఈ దేవాలయంలో నారాయణ బలి పూజలు చేయడానికి విదేశాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. చుట్టూ కొండ కోనల మధ్య ఉన్న ఈ దేవాలయం సముద్ర మట్టానికి దాదాపు 3వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ ఈ కథనంలో తెలుసుకొందాం.
అమర్నాథ్ యాత్రకు మీరు రెడీనా...పేరు నమోదు మర్చిపోకండి
1. మూడు వేల అడుగుల ఎత్తులో
తిరునెల్లి దేవాలయం కేరళలోని వయనాడ్ జిల్లాలో వయనాడ్ వ్యాలీలో ఉంది. సముద్ర మట్టానికి దాదాపు 900 మీటర్లు అంటే 3వేల అడుగుల ఎత్తులో ఈ దేవాలయం ఉంటుంది.
2. విష్ణు భగవానుడు
ఈ దేవాలయంలో ప్రధానంగా పూజలు అందుకొనేది విష్ణు భగవానుడు. ఈ దేవాలయం చుట్టూ పరిసరాలు అత్యంత ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ దేవాలయం ద్వారా వైకుంఠాన్ని చేరుకోవచ్చని చెబుతారు.
3. ఆధారాలు లేవు
చుట్టూ దట్టమైన అడవి, నాలుగు వైపులా నాలుగు పర్వతాలు ఉన్న ప్రదేశంలో ఈ దేవాలయాన్ని ఎవరు నిర్మించారన్న దానికి సరైన ఆధారాలు లేవు.
4. తమిళచక్రవర్తి
అయితే తమిళ చేర చక్రవర్తి భాస్కర రవి వర్మ 1 ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 962లో నిర్మించారని కొంతమంది వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం చూపించడంలో వారు విఫలమవుతున్నారు.
5. 18 పురాణాల్లో కూడా ఉంది
ఇదిలా ఉండగా ఈ తిరునెల్లి దేవాలయం గురించి ప్రస్తావన వేదవ్యాసుడు రాసిన 18 పురాణాల్లోనూ విపులంగా ప్రస్తావించబడింది. ముఖ్యంగా మశ్చ్య పురాణం, స్కంద పురాణం, నరసింహ పురాణం, పద్మపురాణాల్లో ఈ తిరునెల్లీ విష్ణు దేవాలయం ప్రస్తావన విపులంగా వర్ణించబడింది.
6. బ్రహ్మ విహరిస్తుండగా
అందులో పేర్కొన్న వివరాల ప్రకారం స`ష్టి కర్త బ్రహ్మ ఒక రోజు తన వాహనమైన హంస పై లోక సంచారం బయలుదేరాడు. ఈ క్రమంలో ప్రస్తుతం కేరళలోని బ్రహ్మగిరులు ఉన్న ప్రాంతం పై విహరిస్తుండగా అక్కడి ప్రక`తికి ముగ్దుడై పోయాడు.
7. ఉసిరి చెట్టు కింద
పచ్చటి చెట్లు, లోతైన నదీలోయలు, జలజల పారే సెలయేళ్లు వంటి వాటిని చూస్తూ చాలా సేపు మైమరిచి పోయాడు. ఈ క్రమంలో ఒక ఉసిరి చెట్టు కింద ఒక విష్ణువు విగ్రహం కనబడింది.
8. జాతి వైర్యాన్ని మరిచి
దాని చుట్టూ ఒక విచిత్రమైన వెలుగును చూసాడు. అంతే కాకుండా ఆ విష్ణువు విగ్రహం చుట్టూ జింకలు, కుందేళ్లు వంటి సాదు జంతువులే కాకుండా పులులు, సింహాలు వంటి క్రూర మ`గాలు కూడా జాతి వైర్యం మరిచి ఒక దానితో ఒకటి ఆటలాడుకోవడం కనిపించింది.
9. సుగంధ పరిమళాలు
దీంతో కిందికి దిగిన బ్రహ్మకు మరింత ఆశ్చర్యకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. చుట్టు పక్కల ఉన్న జలపాతాలు, సెలయేరుల నుంచి ఒక రకమైన సుగంధ పరిమళాలు వీచాయి.
10 దేవాలయాన్ని నిర్మించాడు
ఇక దేవగణాలు అన్నీ అక్కడే ఉన్నట్లు తోచింది. దీంతో బ్రహ్మ ఇహలోకంలో ఉండే వైకుంఠమే భూ లోకంలో ఉన్నట్లనిపించింది. దీంతో దేవతలను, యక్షులను తనకు తోడుగా తీసుకువచ్చి అప్పటికప్పుడు అక్కడ ఓ దేవాలయాన్ని నిర్మింపజేసాడు.
11. వరాన్ని కూడా
అటు పై ఉసిరి చెట్టు కాండంలో కనిపించిన విష్ణువు విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించాడు. అంతే కాకుండా చుట్టూ ఉన్న సరస్సులు, తీర్థాల్లో ముఖ్యంగా గుడి ముందు భాగంలో ఉన్న పంచతీర్థంలో స్నానం చేస్తే పాపం తొలిగిపోయేలా వరం కూడా ప్రసాదించాడు.
12. బ్రహ్మీ ముహుర్తం
అప్పటి నుంచి ఈ దేవాలయం ఇక్కడ ఉన్నట్లు చెబుతారు. అంతే కాకుండా ప్రతి రోజూ బ్రహ్మీ ముహుర్తంలో అంటే తెల్లవారుజాము 3.30 గంటల నుంచి 5 గంటల మధ్య సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఇక్కడ ఉన్న కొలనులో స్నానం చేసి స్వయంగా గర్భగుడిలోని విష్ణువు విగ్రహానికి పూజలు చేస్తాడని చెబుతాడు.
13. కొన్ని పూలను
అందువల్లే ప్రతి రోజు రాత్రి గుడి తలుపులు మూసివేసే ముందు కొన్ని పూలను ఇక్కడ ఉంచి వెలుతాడు. ఉదయం గుడి తలుపులు తెరిచే సమయానికి ఆ పూలు విగ్రహం పై ఉంటాయని చెబుతారు.
14. తల రాత మారుతుంది
బ్రహ్మ రోజూ స్వయంగా వచ్చి ఇక్కడి విష్ణువును పూజించిన తర్వాత అంతకు ముందు రోజు దేవాలయానికి వచ్చిన వారి గురించి ఆలోచిస్తాడని ఒక వేళ వారి తలరాత రాసే సమయంలో ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే వెంటనే సరిదిద్దుతాడని భక్తుల విశ్వాసం.
15. వైకుంఠానికి చేరుతాం
అందువల్లే హిందువులు చాలా మంది ప్రతి ఏడాది ఈ తిరెనెల్లి విష్ణుదేవాలయాన్ని సందర్శిస్తుంటారు. అంతేకాకుండా ఈ దేవాలయంలో ఉన్న ఒక రహస్య మార్గం ద్వారా వెళితే వైకుంఠానికి చేరుతారని చెబుతారు. అందువల్లే ఈ దేవాలయాన్ని భూలోకం పై ఉన్న వైకుంఠంగా పేర్కొంటారు.
16. నెల్లి అంటే ఉసిరి
తమిళం, మళయాలంలో నెల్లి అంటే ఉసిరి అని అర్థం అందువల్లే ఈ దేవాలయానికి తిరునెల్లి అని పేరు వచ్చినట్లు స్కంధ పురాణంలో వర్ణించబడింది. పరుశరాముడు క్షత్రియులను చంపిన తర్వాత దేవాలయానికి దగ్గరగా ఉన్న పాపనాశినిలో మునిగి తమ పాపం పోగొట్టుకొన్నట్లు పురాణాలు చెబుతాయి.
17. నారాయణ బలి పూజలు
ఇక ఈ దేవాలయం మరో ప్రత్యేకత చనిపోయిన వారి ఆత్మ శాంతించకపోతే నిర్వహించే నారాయణబలి పూజలు ఇక్కడ నిర్వహిస్తారు. తద్వారా చనిపోయిన వారి ఆత్మశాంతిస్తుందనేది భక్తుల నమ్మకం.
18. శాంతి నెలకొల్పబడుతుంది
అందువల్లే ఎవరి ఇంట్లోనైనా పెద్దలు చనిపోయిన తర్వాత శాంతి ఉండదో అంటే తరుచుగా గొడవలు జరగడం, ఆర్థిక నష్టం కలగడం, కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురికావడం వంటివి జరుగుతాయో వారు ఈ దేవాలయం వద్దకు వచ్చి నారాయణబలి పూజలు నిర్వహిస్తారు.
19. విదేశాల నుంచి కూడా
విదేశాల నుంచి కూడా ఈ నారాయణ బలిపూజలు నిర్వహించడానికి ఇక్కడకు పెద్ద సంఖ్యలో హిందువులు ఇక్కడకి వస్తుంటారు. ఈ పూజలు నిర్వహించడానికి అవసరమైన సామాగ్రీ మొత్తం దేవాలయం వద్ద దొరుకుతుంది.