ఆంధ్రప్రదేశ్లో ప్రాచుర్యం పొందిన పది జలపాతాలు..
వర్షాకాలంలో విహారయాత్రకి వెళ్లాలి అనుకునేవారికి సహజంగానే జలపాతాలు సాదర ఆహ్వనం పలుకుతాయి. పచ్చదనం కమ్మేసిన ప్రకృతి సిగలో దాగిన ఈ జలపాతాల సందర్శనకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఆంధ్రప్రదేశ్లోని ఆహ్లదకరమైన జలపాతాలుగా పేరొందిన పది జలపాతాల సమాచారం మీకోసం..
సున్నపుగెడ్డ జలపాతం
దిగి రెండు కిలోమీటర్ల మేర కాలినడకన లోపలికి వెళ్లాలి. వర్షాకాలంలో ఈ జలపాతం ఉధృతంగా ఉంటుంది. ఇటీవల ఏనుగుల సంచారం ఎక్కువ కావడంతో అటవీ అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతానికి వెళ్లేముందు వారిని సంప్రదించడం శ్రేయస్కరం.
పుణ్యగిరి జలపాతం
విజయనగరం జిల్లా శృంగవరపు కోట సమీపంలో పుణ్యగిరి క్షేత్రం ఉంది. చక్కని పచ్చదనం, ప్రకృతి శోభతో చూపరులకు కనువిందు చేస్తుంది ఈ జలపాతం. ఈ కొండపైనే ఉమాకోటిలింగేశ్వరుడి ఆలయం ఉంది. ఆ పక్కనే కొండపైకి వెళ్లే దారిలో ధారగంగమ్మ జలపాతం ఇక్కడికి వచ్చే యాత్రికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ధారగంగమ్మను గిరిజనులు దేవతగా భావిస్తారు. 30 అడుగుల ఎత్తు నుంచి పడే జలధారలు మనసుకు ఉల్లాసాన్నిస్తాయి. విశాఖపట్టణం నుంచి అరకులోయ వెళ్లే దారిలో (60 కిలోమీటర్లు) పుణ్యగిరి ఉంది. శృంగవరపుకోట నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతం. విశాఖ, విజయనగరం నుంచి ఎస్కోటకు బస్సులో వెళ్లొచ్చు.
కటికి జలపాతం
మూడు వందల యాభై అడుగుల ఎత్తునుంచి దూకే జలపాతమే కటికి జలపాతంకటికి జలపాతం బొర్రాగుహలకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. విశాఖపట్నం నుంచి ఉదయం ఐదు గంటలకు కిరోండూల్ పాసింజర్ రైలులో బొర్రాగుహలకు చేరుకోవాలి. అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాల్లో జలపాతానికి కిలోమీటర్ దూరం వరకు వెళ్లొచ్చు. ఆపై కాలినడకన వెళ్లాలి. కటికి జలపాతానికి వెళ్లే నడకదారిలో చిరుతిళ్లు లభిస్తాయి. బొర్రాగుహల దగ్గర బస, భోజన వసతులు కూడా అందుబాటులో ఉన్నాయి.
కొత్తపల్లి జలపాతం
దట్టమైన అటవీప్రాంతంలో సుమారు 500 అడుగుల లోతులో కొండ దిగువున ఉన్న ఈ జలపాతాన్ని స్థానిక గిరిజన యువకులు గుర్తించారు. సాహసంతో అక్కడకు చేరుకుని ఈ జలపాతం పరవళ్లను కెమెరాలలో చిత్రీకరించారు. ఈ విషయాన్ని బయటప్రపంచానికి తెలిపేందుకు జలపాతం చిత్రాలతో ఉన్న బేనర్లను రహదారి పక్కన ఏర్పాటు చేశారు. గ్రామస్ధులు శ్రమదానంతో కొండలమీదుగా ఓ కాలిబాటను వేశారు. కొత్తపల్లి విశాఖపట్నానికి పశ్ఛిమంగా సుమారు 96 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం. విశాఖపట్నం నుండి రోడ్డు మార్గం ద్వారా ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు.
డుడుమ జలపాతం...
ప్రకృతి అందాలకు నెలవైన మన్యంలో ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల నడుమ పర్యాటకులకు కనువిందు చేస్తోంది డుడుమ జలపాతం. 550 అడుగుల ఎత్తు నుంచి జాలువారే ఈ నీటి బిందువులు సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ సమీపంలోనే మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం ఉంది. డుడుమ వద్ద నుంచి చూస్తే మరో జలపాతం కనిపిస్తుంది. టిపి డ్యాం నుంచి చూస్తే టిపి డ్యాం డిశ్చార్జ్ నీటితో కలిపి మొత్తం మూడు జలపాతాలు కనిపిస్తాయి. విశాఖ నుంచి కిరాండోల్ ప్యాసింజరు రైలు ఉదయం 6.50కి బయలుదేరుతుంది. దాంట్లో బెజ్జా జంక్షన్ వద్ద దిగి అక్కడ నుంచి షేరింగ్ జీపుల ద్వారా డుడుమ చేరుకోవచ్చు.
పొల్లూరు జలపాతం
తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలోని పొల్లూరు సమీపంలో పొల్లూరు దిగువ, ఎగువ జలపాతాలున్నాయి. లక్కవరం రేంజిలోని దట్టమైన ఆరణ్యాల మధ్య ఎత్తైన కొండల నడుమ నుంచి లోయలోకి జాలువారే ఈ జలపాతపు ప్రకృతి సౌందర్యాన్నితనివి తీరా ఆస్వాదించాల్సిందే. ఒడిశా ప్రతి రెండేళ్లకొకసారి నిర్వహించే మణిమకొండ నెల రోజుల జాతరలో మొదటి రోజు ఉత్సవాన్నిఈ జలపాతం వద్ద నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రా, తెలంగాణ నుండి కూడా భక్తులు వస్తారు. అయితే, ఇటీవల కాలంలో పులుల సంచారం ఉండడంతో అటవీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వర్షాకాలంలో ఇక్కడకు వెళ్లదలిచేవారు వారిని సంప్రదించడం ఉత్తమం.
తలకోన జలపాతం
చిత్తూరు జిల్లా యర్రంవారి మండలంలో తలకోన జలపాతం ఉంది. తిరుపతి వెళ్లేవారు అక్కడనుండి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతానికి బస్సులలో వెళ్లవచ్చు. 300 అడుగుల ఎత్తులో ఉన్న ఈ అందమైన జలపాతం రెండుకొండల మధ్య ఉంది. తలకోన అడవిలో తెల్లని ఆర్కిడ్ పుష్పలు, మద్ది, జాలరి, చందనం, ఎర్రచందనం మొదలగు చెట్లను చూడవచ్చు. అడవి కోళ్ల, దేవాంగన పిల్లులు, ముచ్చుకోతులు, ఎలుగుబంట్లు, నెమళ్లు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. 40 అడుగుల ఎత్తులో కట్టిన తాళ్లవంతెనమీద నడవటం ఒక మరిచిపోలేని అనుభూతి.
ఉబ్బలమడుగు జలపాతము
ఉబ్బల మడుగు జలపాతం దీనినే తడ జలపాతం అని కూడా పిలుస్తారు. ఇది చిత్తూరు జిల్లాలోని బుచ్చినాయుడు ఖండ్రిగ మండలంలో సిద్ధుల కోన అనే అడవిలో ఉంది. వర్షాకాల సమయంలో ఈ జలపాతం ఉదృతంగా ప్రవహిస్తుంది. ఈ ప్రాంతం పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటుంది. పర్వతారోహణకు, విహారయాత్రలకు ఇది చాలా అనువైన ప్రదేశం. శ్రీకాళహస్తి నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చిత్తూరు జిల్లా వరదయ్య పాలెం గ్రామం నుండి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మల్లెలతీర్ధం జలపాతం
ఈ జలపాతం నల్లమల అడవులలో శ్రీశైలంనుండి 58 కిలోల మీటర్ల దూరంలో ఉంది. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు మాత్రమే వరకు చూడటానికి అనుకూలంగా ఉంటుంది. వర్షాకాలంలో మట్టి రోడ్డు చిత్తడిగా ఉంటుంది. ఎండాకాలంలో నీరు ఉండదు. కృష్ణానది నల్లమల అడవుల గుండా ప్రవహిస్తుంది.
ఇక్కడ ఆహార సదుపాయాలుండవు. ఇక్కడివెళ్లేవారు నీళ్లు, ఆహారం తీసుకు వెళ్లటం మంచిది. ఇక్కడ చిన్న దుకాణం మాత్రం ఉంది. చిరుతిళ్లు మాత్రం ఉంటాయి. ఈ తీర్ధం దగ్గరకు వెళ్లాలంటే సుమారు 350 మెట్లు దిగవలసి ఉంటుంది.
ఆలూరుకోన జలపాతం
అనంతపురంలోని ఆలూరుకోన జలపాతం కొండలు, కోనలతో ప్రకృతి సహజమైన అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. రెండు కొండల మధ్య వచ్చే జలధారలతో కనువిందు చేసే ఈ జలపాతం సంవత్సరమంతా కళకళలాడుతూ ఉంటుంది. శతాబ్ధాల చరిత్ర కలిగిన ఆలూరు రంగనాయక స్వామి దేవాలయం కూడా ఇక్కడే ఉంది. సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన హజీవలి దర్గా కొండ పైభాగంలో కలదు. ఈ జలపాతం అనంతపురంలోని తాడిపత్రి పట్టణానికి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది.