మైసూరు పర్యాటకానికి వెలుతున్నారా? ఒక్కక్షణం. మైసూరు అన్న తక్షణం మనకు అక్కడి ప్యాలెస్, చుట్టు పక్కల ఉన్న ఒకటి రెండు ధార్మిక స్థలాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. అయితే రాచనగరి మైసూరు చుట్టూ ప్రకృతి అందాలకు నిలయమైన ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈసారి కర్నాటకలో వర్షాలు బాగా పడ్డాయి.
దీంతో మైసూరు చుట్టు పక్కల ఉన్న అనేక అభయారణ్యలు పక్షుల కిలకిలతో పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇక జలపాతాల హొయలు కూడా రారమ్మని పిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైసూరు చుట్టు పక్కల ప్రకృతి అందాలకు నిలయమైన పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన కథనం మీ కోసం
రంగనాతిట్టు
P.C: You Tube
కర్నాటక పక్షి కాశి అని రంగనా తిట్టుకు పేరు. అందువల్ల ఈ పర్యాటక కేంద్రం ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్షేత్రం కావేరి నదిలో ఉన్న ఒక ద్వీపం. ఆరు ద్వీపాలను కలిపి రంగనాతిట్టు అని అంటరారు. మైసూరు పట్టణానికి కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఈ రంగనాతిట్టు ఉంటుంది. ఏడాదికి దాదాపు 4 లక్షల మంది పర్యాటకులు రంగనాతిట్టు పక్షి సంరక్షణ కేంద్రాన్ని సందర్శిస్తూ ఉంటారు. మైసూరు నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, ట్యాక్సీలు నిత్యం రంగనాతిట్టుకు పర్యాటకులను తీసుకువెలుతుంటాయి.
శివనసముద్రం ఫాల్స్
P.C: You Tube
కావేరి నదీ తీరంలో ఈ శివనసముద్రం జలపాతం కూడా మైసూరు చుట్టు పక్కల ముఖ్యమైన పర్యాటక కేంద్రాల్లో ఒకటి. ఆసియాలో మొదటి జలవిద్యుత్ కేంద్రాన్ని ఇక్కడే నిర్మించారు. జులై నుంచి అక్టోబర్ మధ్య కాలంలో కావేరి నది లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ఈ జలపాతంలో నీటి హొయలు కూడా అంతే అధికంగా ఉంటుంది. అందుల్లే ఈ సమయంలో ఎక్కువ మంది పర్యాటుకులు ఈ జలపాతాన్ని సందర్శిస్తూ ఉంటారు. మైసూరు నుంచి కేవలం 77కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పర్యాటక కేంద్రానికి నిత్యం ప్రభుత్వ, ప్రవేటు బస్సులు అందుబాటులో ఉంటాయి.
బండీపుర అభయారణ్యం
P.C: You Tube
పులుల అభయారణ్యమైన బండీపుర కర్నాటకలోనే కాకుండా భారత దేశంలోనే అత్యంతధికంగా వన్యప్రాణి జాతులు ఉన్న అభయారణ్యాల్లో ఒకటి. మొత్తం 874 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ అభయారణ్యం ఉంది. మైసూరుకు కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఈ అభయారణ్యం ఉంది. ఇక్కడ ఎలిఫెంట్ సఫారీ అందుబాటులో ఉంటుంది.
కబిని
P.C: You Tube
కేరళలోని వాయనాడ్ లో జన్మించే కబిని నదిని కపిల నది అని కూడా పిలుస్తారు. ఇది తూర్పు దిశగా ప్రయాణించి కావేరి నదిలో కలుస్తుంది. మైసూరుకు వెళ్లిన వారిలో చాలా మంది కబిని అభయారణ్యాన్ని
తప్పక సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ ఎనుగులు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ తెప్ప ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మైసూరుకు 80 కిలోమీటర్ల దూరంలో కబిని అభయారణ్యం ఉంటుంది.
నాగర్ హోల్
P.C: You Tube
మైసూరుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగర్ హోల్ నీలగిరి పశ్చిమకనుమల్లో భాగం. అందువల్లే వర్షాలు బాగా పడిన జులై నుంచి అక్టోబర్ లో ఈ నాగర్ హోల్ నేషనల్ పార్క్ లో కనుచూపుమేరలో పచ్చదనం కనిపిస్తుంది. ఈ నాగర్ హోల్ లో కూడా పులులను సంరక్షిస్తూ ఉంటారు. ఇక్కడ పులులతో పాటు చిరుతలు, జింకలు, ఎలుగుబండ్లు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. అంతేకాకుండా 270 జాతుల పక్షులకు కూడా ఈ నాగర్ హోల్ ఆశ్రయం కల్పిస్తూ ఉంటుంది. అందువల్లే ఉదయం, సాయత్రం ఇక్కడ అందుబాటులో ఉండే జంగిల్ సఫారీని వినియోగించుకొంటే ఆ పక్షుల కువ కువ రాగాలను వినడానికి వీలవుతుంది.