ఈ వేసవి సెలవుల్లో ఎక్కడి వెళ్ళాలని ఆలోచిస్తున్నారా..ఏ ఊటీ..కొడైకెనాల్ లాగానే చల్లచల్లగా ఉండే ప్రాంతాలు అనేకం ఉన్నాయి. కర్నాటకలోని కెమ్మనగుండి వెళ్తే వడగాలిని సైతం మయమారుతంగా మార్చే వాతావరణం . జలజల పారే జలపాతాలు కనువిందు చేస్తాయి. సహజసిద్దంగా ఉట్టిపడే అందాలు మనస్సును కట్టిపడేస్తాయి.
కనులకు విందు చేసే పచ్చని ప్రదేశాలు
కనులకు విందు చేసే పచ్చని ప్రదేశాలు, ఒంపు సొంపులతో సాగే ఎత్తైన జలపాతాలతో కెమ్మనగుండి పేరొందిన ప్రధాన హిల్ స్టేషన్ గా పేరు తెచ్చుకున్నాయి. కర్నాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లాలో తరికెరి తాలూకాలో ఉన్న కెమ్మనగుండి హిల్ స్టేషన్ చూడదగిన ప్రదేశం ! చుట్టూ బాబా బూదాన్ గిరి కొండలు, జలపాతాలు, దట్టమైన అడవులు, పచ్చటి మైదానాలు ఈ ప్రాంతాన్ని గొప్ప పర్యాటక ప్రదేశంగా మార్చాయి.
కె.ఆర్ కొండలు
బాబా బుడాన్ కొండల మధ్య చిక్ మగళూరు పట్టణానికి 55కిలోమీటర్ల దూరంలో కెమ్మనగుండి పర్వత ప్రాంతం ఉంది. కెమ్మనగుండి పర్వత ప్రాంతంలో వాడేయార్ రాజు క్రుష్ణ రాజ వాడేయార్ వేసవి విడిది చేసేవాడు కావున ఈ పర్వత శ్రేణులను కె.ఆర్ కొండలు అని కూడా పిలుస్తారు.
సెలయేళ్ళతో
ఈ పర్వత కేంద్రం సముద్రమట్టానికి 1434మీటర్ల ఎత్తులో దట్టమైన అరణ్యాల మధ్య సంవత్సరం పొడవునా సెలయేళ్ళతో హరితంగా ఉంటుంది. పూలతోటలతో కొండలోయలతో ఉండే ఈ హిల్ స్టేషన్ సౌందర్యం వర్ణణాతీతం.
సూర్యాస్తమయానికి
అరణ్యాలు అన్వేషణ జరిపేవారికి ఈ పర్వత కేంద్రం నుండి అనేక మార్గాలున్నాయి. ఈ కొండ ప్రాంతంలో వివిధ ప్రదేశాల నుండి సూర్యాస్తమయానికి తిలకించ వలసిందే. సూర్యస్తమయం ఇక్కడ అత్యంత అద్భుతంగా ఉంటుంది.
గులాబీ తోటలు
ఈ పర్వత శిఖరంపై అనేక గులాబీ తోటలున్నాయి. ఈ ప్రాంతంలో ఉండే రకరకాల గులాబీ తోటలు చూసి తీరాల్సిందే అని చెప్పొచ్చు!
పర్వతం నడిబొడ్డు నుండి పది నిముషాల నడకలో వచ్చే జెడ్ పాయింట్ నుండి చూస్తే రమణీయంగా ఉండే పశ్చిమ కనుమలలోని శొల గడ్డ భూములు కనిపిస్తాయి. శోలగడ్డి భూములు భలే ఆకట్టుకుంటాయి. పూల తోటలతో వంపులు తిరిగిన దారులతో కొండ లోయలతో ఉండే ఈ పర్వత కేంద్ర గురించి ఎంత చెప్పినా తక్కువే!
వీటితో పాటు కెమ్మన గుండి చూడాల్సిన అనేక ప్రదేశాలున్నాయి.
రాక్ గార్డెన్ :
కెమ్మనగుండి వెళ్లాలనుకునేవారు నూటికి నూరుపాళ్లూ చూడాల్సిన ప్రదేశం రాక్ గార్డెన్ ! కెమ్మనగుండికి చేరుకోగానే మరో ఆలోచన లేకుండా ముందుగా వెళ్ళి చూడాల్సింది రాళ్లతో మలచబడిన రాక్ గార్డెన్. ఈ గార్డెన్ లో కేవలం రాళ్లే కాదు...అందమైన పూల మొక్కలు కూడా దర్శనమిస్తాయి.
జీ పాయింట్
ఎత్తైన కొండపై నుండి జీ పాయింట్ చేరాలంటే నడకే ఉత్తమం. ఈ కొడపైకి చేరటానికి 30నిముషాలకు మించి సమయం పట్టదు. ఈ కొండ మీద నుండి మీరు ప్రకృతి అందాలను దగ్గరలో ఉండే జలపాతాన్ని చూసి ఒక్కక్షణం మైమరచిపోతారు. ఇక్కడ మూడు జలపాతాలు చెప్పకోదగ్గవి.
హెబ్బే జలపాతం:
ఈ జలపాతానికి వెళ్లే దారి అంత సుగమంగా ఉండదు. నడిచి వెళ్లాలి లేదా జీపులో వెళ్లాలి. 13కిలోమీటర్ల దూరమే అయినా నడుస్తుంటే మాత్రం ఒక ఊరికి వెళ్లినంత దూరం అనిపిస్తుంది. 168 మీటర్ల ఎత్తు నుండి ఈ జలపాతం అందాలు ఒలకబోస్తుంది. ఈ ప్రకృతి అందాలు చూడగానే ప్రయాస, అలసట అంతా మర్చిపోతాం.ప్రశాంత వాతావరణం ఆనందించాలనుకునే వారికి హెబ్బే జలపాతాలు, చుట్టు ప్రకల ప్రదేశాలు అనువుగా ఉంటాయి. ఈ జలపాత నీటిలో ఔషధ గుణాలుండటం వల్ల అవి చర్మ సంబంధిత వ్యాధులను సాధారణ దగ్గు, జలుబులను నివారిస్తాయని చెబుతుంటారు.
కాళపట్టి జలపాతం:
కెమ్మనగుండి పర్యాటకులు తప్పక వీక్షించాల్సినది కాళహట్టి జలపాతం. వీటినే కాళ హస్తి జలపాతాలని కూడా పిలుస్తుంటారు. ఇవి 122కి.మీ ఎత్తు నుండి జాలువారతాయి. స్థానికుల కథనాల మేరకు ఇవి మహర్షి ఆగస్త్యుడి సృష్టిగా చెపుతారు. ఈ జలపాతాల దగ్గరలో వీరభద్రుడి గుడి ఉంది. ఇది విజయనగర కాలం నాటిది. దేవాలయ ప్రవేశంలో ఏనుగుల విగ్రహాలు అందంగా కనిపిస్తాయి.
శాంతి జలపాతం:
కెమ్మనగుండి పర్యటించే వారికి శాంతి జలపాతాలను తప్పక సందర్శించాలి. ఎందుకంటే , ఈ జలపాతాలు కొండ పైభాగం నుండి పడతాయి. అందమైన ఒక లోయ దానికి ఇరుపక్కలా కొండలు, పడమటి కనుమల మైదానాలు కనపడతాయి.
ఏమాత్రం అవకాశం ఉన్నా..సీజన్ తో సంబంధం లేకుండా ఈ ప్రాంతాలన్నీ చూసిరావచ్చు. వర్షాకాలం కంటే వేసవి శీతాకాలాలు ఈ ప్రాంతంలో ప్రయాణిస్తే సూపర్ గా ఉంటుంది.
ఎలా చేరుకోవాలి?
మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ కెమ్మనగుండి 190కి.మీల దూరంగా ఉంటుంది. మంగళూరు నుండి కెమ్మనగుండికి టాక్సీలు క్యాబ్ లలో చాలా ఉన్నాయి. ఇక బెంగళూరు విమానాశ్రయం అయితే..కెమ్మనగుండికి 295కి.మీల దూరంలో ఉంటుంది.
రైలు మార్గం ద్వారా కెమ్మనగుండికి చేరుకోవడానికి ముందుగా తరికెరె రైలు స్టేషన్ లో దిగిపోవాలి. ఎందుకంటే కెమ్మనగుండిలో రైల్వేస్టేషన్ లేదు. ఈ తరికెరె స్టేషన్..కెమ్మనగుండికి 15కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ నుండి కెమ్మనగుండికి టాక్సీలలో చేరవచ్చు.
బస్సు మార్గం ద్వారా కెమ్మనగుండికి చేరాలంటే బెంగళూరు మంగుళూరుల నుండి కర్నాటక ఆర్ టీ సీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది.