మరికొన్ని రోజుల్లో ఉగాది రాబోతోంది. అటు పై రామనవి కూడా. దేశంలో రామనవమి పండుగకు పేరుగాంచిన ప్రాంతం అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది భద్రాచలం. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక రాయలసీమలోని కడపకు దగ్గరగా ఉన్న ఒంటిమిట్ట దేవాలయం. ఈ దేవాలయంలో ఆంజనేయ విగ్రహం ఉండదు. ఇలా ఆంజనేయ విగ్రహం లేని రామాలయం దేశంలో ఇది ఒక్కటే. మరొక విశేషం ఏమిటంటే ఇక్కడ రాత్రి పూట పున్నమి వెన్నల్లో బ్రహ్మోత్సవాలు జరుగాతాయి. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ ఒంటిమిట్ట కోదండ రామ దేవాలయంలో నవమి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఆలయ విశిష్టతల సమహారం నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం
1. స్థల పురాణం
Image source
రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది.
2. పెళ్లి తర్వాత కూడా
Image source
అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది.
3. ఒకే శిలలో
Image source
అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఒకే శిలలో చెక్కించారనీ చెబుతారు. తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం.
4. అందుకే హనుమంతుడు ఉండడు
Image source
శ్రీరామహనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామలక్ష్మణుల ఏకశీలా విగ్రహం స్థాపించినట్లు పురాణ కథనం. అందుకే ఇక్కడి దేవాలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహం పక్కన హనుమంతుడు ఉండడు.
5. దేశంలో ఇదొక్కటే
Image source
రామ దేవాలయాలలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడు విగ్రహం లేని రామాలయం భారత దేశంలో ఇదొక్కటే. ఈ ఆలయంలో సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డారు. కాబట్టి ఏకశిలానగరమనీ పేరు వచ్చింది.
6. పాతళ గంగ పైకి వచ్చింది
Image source
ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థము ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడింది.
7. రాత్రి పూట బ్రహ్మోత్సవాలు
Image source
చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. దీని వెనుక ఒక పురాణగాథవుంది.
8. చంద్రుడు వేడుకోవడంతో
Image source
క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని మహాలక్ష్మీ దేవి సోదరుడైన చంద్రుడు స్వామివారికి విన్నవించాడు.
9. స్మామి వారు చెప్పడంతో
Image source
దీంతో స్వామివారు ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు.
10. ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పిస్తుంది.
Image source
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోనే అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు ఈ ఆలయానికి సమర్పిస్తారు.
11. ఇమాంబేగ్ బావి
Image source
ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి. ఇమాంబేగ్ 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నభీకాన్ ప్రతినిథి.
12. ఓ అనే సమాధానం వచ్చంది
Image source
ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా? అని ప్రశ్నించాడు. చిత్తశుద్ధితో పిలిస్తే కచ్చితంగా పలుకుతాడని వారు సమాధానమివ్వగా, ఆయన మూడు సార్లు రాముని పిలిచాడు. అందుకు ప్రతిగా మూడు సార్లు ఓ అని సమాధానం వచ్చింది.
13. ముస్లీంలూ సందర్శిస్తుంటారు
Image source
దీంతో ఆయన స్వామి భక్తుడిగా మారిపోయాడు. అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించారు. ఆయనపేరు మీదుగానే ఈ బావిని ఇమాంబేగ్ బావిగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించికుని, ఎందరో ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం, ఇక్కడి విశేషం.
14. పోతన ఇక్కడ ఉన్నారా
Image source
ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశిలపురి వాసినని చెప్పుకున్నాడు. అంతే గాక తన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం గావించాడు. అంతేకాక భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉన్నాయి. దీంతో పోతన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు.
15. చోళ శిల్పకళ
Image source
ఆలయ గోపురనిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఒంటిమిట్ట రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు.
16. పూజలు, ఉత్సవాలు
Image source
ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు.
17. ఎక్కడ ఉంది
Image source
ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది
18. ఎలా చేరుకోవచ్చు
Image source
కడప-తిరుపతి రహదారిపై వుంది. కడపనుంచి 26 కి.మీ.దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు. రైలులో రాజంపేట రైల్వేస్టేషన్లో దిగి బస్సులో దిగి చేరుకునే సౌలభ్యముంది. తిరుపతి విమానాశ్రయం 100 కి.మీ.దూరంలోవుంది.