కర్నూలు ఒకప్పుడు కందనవోలుగా పిలువబడేది.ఇది 1953వ సం.నుండి 1956వ సం. వరకు రాజధానిగా ఉండేటిది.ఈ నగరం భిన్న సంస్కృతి,సాంప్రదాయాలకు నెలవు.ఈ నగరం తుంగభధ్ర నది ఒడ్డును కలదు.ఈ నగరం వైశాల్యపరంగా విశాలమైనది.ఇక్కడ ముఖ్య పట్టణాలు కర్నూల్,నంద్యాల,ఆదోని,డోన్.కర్నూల్ అంటే ముందుగా గుర్తువవ్చేది కొండారెడ్డి బురుజు.
తీవ్రమైన వేడితో కూడిన కర్నూలులో ఎండాకాలం ఆహ్లాదకరంగా ఉండదు.శీతాకాలం కర్నూలు సందర్శనకు ఉత్తమమైనది.ఈ సమయంలో, మధ్యస్థ ఉష్ణోగ్రతతో ఇక్కడి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.వేసవి కాలంలో ఉష్ణోగ్రత 35-42 డిగ్రీల మధ్యలో, మిగతాకసమయాలలో 15-30 డిగ్రీల మధ్యలో ఉంటుంది.
చారిత్రక సంఘటనలు
ప్రాచీన సాహిత్యం,శాసనాల్లో చెప్పబడినట్టు కందనవోలు అనే తెలుగు పదం నుంచి కర్నూల్ అనే పేరు వచ్చింది.కర్నూలుకి వేల సంవత్సరాల చరిత్ర వుంది.కర్నూల్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో వున్న కేతవరంలో దొరికిన రాతి చిత్రం ప్రాచీన రాతి యుగం నాటిది. జుర్రేరు లోయ, కటవాని కుంట, యాగంటిలలో లబించిన రాతి శిల్పాలు 35000 నుంచి 40000 ఏళ్ళ నాటివి.మధ్య యుగాలలో భారత దేశాన్ని సందర్శించిన జువాన్ జాంగ్ అనే చైనా దేశపు పర్యాటకుడు తన కధనాల్లో కరాచీ వెళ్ళే దారిలో కర్నూల్ ను దాటానని రాసుకున్నాడు.ఏడవ శతాబ్దంలో కర్నూల్ బిజాపూర్ సుల్తానుల పాలనలో, ఆ తరువాత దీన్ని శ్రీ కృష్ణదేవరాయల వారు పాలించారు.అశోకుని శిలా శాసనం ఈ ప్రదేశంలోని ఎర్రగుడి ప్రాంతంలో లభించినది.
కొండా రెడ్డి బురుజు
ఈ బురుజు కర్నూల్ నగరానికి చిహ్నం లాంటిది.విజయనగర రాజు అచ్యుత దేవరాయలు నిర్మించిన ఈ కోట, నగర౦ నడిబొడ్డులోని పాత బస్టాండ్ వద్ద ఉంది.ఈ అద్భుతమైన కట్టడంలో మిగిలిన భాగం బురుజు మాత్రమే.ఈ కోటలో ఉన్న కారాగారంలోనే కొండా రెడ్డి తుది శ్వాస వదలడం వలన ఈ స్తంభానికి ఆయన పేరు పెట్టారు.ఈ కోట చాల వరకు శిధిలావస్థలో ఉన్నప్పటికీ, కొన్ని భాగాలు ఇంకా బలంగానే ఉన్నాయి.వీటిలో ఒకటి ఎర్ర బురుజు.ఈ బురుజు క్రింది భాగంలో రెండు చిన్న పురాతన ఆలయాలు ఉన్నాయి.ఇవి ఎల్లమ్మ తల్లికి చెందినవి.ఈ కోటలో అనేక అధ్భుతమైన శాసనాలు,చెక్కడాలు ఉన్నాయి.ప్రస్తుతం కొండారెడ్డి బురుజుకి రావాలంటే నగరంలో ఎక్కడ నుంచైనా 10 రూపాయల చార్జీతో ఆటో రిక్షాల సదుపాయం కలదు.
Photo Courtesy: Veera.sj
గోల్ గుమ్మజ్
అబ్దుల్ వహాబ్ సమాధిని గోల్ గుమ్మజ్ గా ఇక్కడి ప్రజలు పిలుస్తారు.ఇది(సమాధి) సుమారుగా 400 సం. పురాతనమైనది.ఇది హంద్రీ నది ఒడ్డున గల ఉస్మానియా కాలేజ్ సమీపాన ఉన్నది.అబ్దుల్ వహాబ్ అప్పటి బీజాపూర్ సైన్యానికి మిలిటరి కమాండర్ (సేనాధిపతి) మరియు కర్నూలు ప్రాంతానికి మొట్టమొదటి ముస్లిం పాలకుడు.1618 వ సం. అతని మరణానంతరం దీనిని(సమాధిని) నిర్మించినారు.ప్రస్తుతం ఇక్కడికి రావాలంటే నగరంలో ఎక్కడ నుంచైనా 10 రూపాయల చార్జీతో ఆటో రిక్షాల సదుపాయం కలదు.
Photo Courtesy: Chivi1085
కోట్ల విజయ భాస్కర రెడ్డి స్మారక కట్టడం
ఈ స్మారక కట్టడం ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్య మంత్రి కోట్ల విజయ భాస్కర రెడ్డి గారి స్మృతిగా కట్టింది.కర్నూలు నగరానికి చెందిన ఈయన రాష్ట్రంలోనే కాక దేశంలోని అతి ప్రసిద్ధ రాజకీయ నాయకుడు.తన ప్రజలచే అభిమాని౦చబడిన ఈయనను అనుచరులు పెద్దాయనగా పిలుచుకునేవారు.హంద్రి నది ఒడ్డున ఉన్న ఈ స్మారకం ప్రస్తుతం విహార కేంద్రంగా,ఆట విడుపు ప్రదేశంగా ఉన్నది.ప్రస్తుతం కొండారెడ్డి బురుజుకి రావాలంటే నగరంలో ఎక్కడ నుంచైనా 10 రూపాయల చార్జీతో ఆటో రిక్షాల సదుపాయం కలదు.
Photo Courtesy: Veera.sj
జగన్నధ గట్టు
జగన్నధ గట్టు కర్నూల్ నగరంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక పుణ్య ప్రదేశం.ఈ గట్టు మీద శివుని ఆలయం బాగా ప్రాచూర్యం పొందింది.ఈ ఆలయంలోని శివలింగం పాండవులలో ఒకరైన భీముడు ప్రతిష్టించినారని ఇక్కడి ప్రజలు విశ్వశిస్తారు.ఈ శివలింగం 6 మీ. ఎత్తు, 2 మీ. వెడల్పుగా ఉండి పూర్తిగా గ్రనైట్ తో చేయబడినది.అంతేకాదండోయ్ ఈ గట్టు మీద వినాయకుని ఆలయం, నిల్చుని ఉన్న ఆంజనేయ స్వామి భారీ విగ్రహం ఉంది.ఇక్కడికి వెళ్ళాలంటే సొంత వాహనాలు ఉన్నవారికైతే సులభతరం.
Photo Courtesy: Poreddy Sagar
అలంపూర్
కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ ప్రదేశమే అలంపూర్.అలంపూర్ ని దక్షిణ కాశీ గా అభివర్ణిస్తారు.ప్రస్తుత తెలంగాణ రాష్ట్రానికి దక్షిణ సరిహద్దుగా ఉన్నది.ఇది కర్నూల్ కి 27 కి.మీ. దూరంలో, హైదరాబాద్ కి 200 కి.మీ. దూరంలో ఉన్నది.అలంపూర్ అష్టాదశ శక్తి పీఠాలలో 5వది.ఈ క్షేత్రంలో నవబ్రహ్మలు కొలువై ఉన్నారు.తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ,బాల బ్రహ్మ,గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ,అర్క బ్రహ్మ,వీర బ్రహ్మ, విశ్వ బ్రహ్మ లు నవ బ్రహ్మలుగా పూజించబడుతున్నాయి.క్రీ.శ.ఏడవ శతాబ్దంలో బాదామి చాళుక్యులు ఈ ఆలయాలను నిర్మించినారు.ఈ ఆలయం తుంగభద్ర నదీ తీరాన ఉన్నది.
Photo Courtesy: RaghukiranBNV
ఎలా వెళ్ళాలి?
వాయు మార్గం
కర్నూల్ నగరానికి రావాలంటే హైదరాబాదులో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (అంతర్జాతీయ) ఎయిర్ పోర్టులో దిగి, అక్కడి నుంచి సుమారు మూడున్నర గంటల సమయం పడుతుంది.
రైలుమార్గం
కర్నూల్ నగరం రైల్వే స్టేషన్ కలగి ఉంది. ఈ నగరానికి దేశంలోని ప్రధాన ప్రాంతాలైన హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హౌరా తదితర ప్రాంతాల నుండి రైలు సదుపాయం ఉన్నది. ఇక్కడ డోన్ ప్రధాన రైల్వే జంక్షన్ గా , దీంతో పాటు నంద్యాల, ఆదోని రైల్వే స్టేషన్ లుగా ఉన్నాయి.
బస్సు మార్గం
హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, విజయవాడ, వైజాగ్, గుంటూరు మొదలగు ప్రాంతాల నుండి బస్సు సదుపాయం ఉన్నది.