క్రిస్మస్ సెలవుల్లో ఈ హిల్ స్టేషన్లను విజిట్ చేయండి!
ఏటా డిసెంబరు నెల కుటుంబసమేత పర్యాటకానికి సరైనదిగా గుర్తింపు పొందింది. ఈ మాసంలో దేశవ్యాప్తంగా క్రిస్మస్ పండుగను వైభవంగా జరుపుకొంటారు. అదే సమయంలో క్రిస్మస్ సందర్భంగా తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో విహారయాత్రకు ప్లాన్ చేస్తూ ఉంటారు.
సహజసిద్ధమైన ప్రకృతి నడుమ ప్రశాంతమైన క్షణాలను గడిపేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తారు. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ జరుపుకోవాలని ప్లాన్ చేస్తుంటే, ఈ హిల్ స్టేషన్లను మీ ప్రయాణపు జాబితాలో చేర్చడం మర్చిపోవద్దు.
ఔలి
ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉంది ఔలి. స్థానిక భాషలో ఔలి అంటే పర్వతాలతో నిండిన మైదానాలు అని అర్థం. ప్రసిద్ధ ఔలి నుండి జోషిమఠ్కు ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడకు చేరుకునేందుకు ప్రయాణీకులు చేసే ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభూతులను చేరువ చేస్తుంది. కేబుల్ కార్ రైడ్ ద్వారా చేసే ఆరు కిలోమీటర్ల ప్రయాణం..
ప్రకృతి పరచిన పచ్చని తివాచీపై గగన విహారపు పరిమళాలు విరభూసే అనుభూతిని అందిస్తుంది. కేబుల్ కార్ రైడ్ ద్వారా 15 నిమిషాల్లో జోషిమఠ్ చేరుకోవచ్చు. డిసెంబర్ నుండి మార్చి వరకు ఔలి సందర్శనా ఎంతో అద్భుతంగా ఉంటుంది. సుందర ప్రకృతి దృశ్యాలతోపాటు ఇది ఔలి మతపరమైన ప్రదేశాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ప్రసిద్ధ శంకరాచార్య మరియు జోషిమఠ్ ఇక్కడి ప్రధాన సందర్శనీయ ప్రదేశాలుగా పేరుగాంచాయి. మీరు మీ స్నేహితులతో కలిసి క్రిస్మస్ సందర్భంగా ఔలిని సందర్శించవచ్చు.
ఖజ్జియార్
పచ్చని పర్వతాలతో చుట్టబడిన ఖజ్జియార్ హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఉంది. ఈ గ్రామం ప్రకృతి అందాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయనే చెప్పాలి. గ్రామంలో ఉన్న ఒక సరస్సు ఇక్కడి అందాలను రెట్టింపు చేస్తోంది. ఇక్కడి సహజసిద్ధ ప్రకృతి అందాల ఆధారంగానే ఖజ్జియార్ను మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. ఖజ్జియార్లో పారాగ్లైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. పారాగ్లైడింగ్లో ఎలాంటి అనుభవం లేనివారు సైతం ఇక్కడ ఈ సాహస క్రీడలో పాల్గొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు ఇక్కడి నిర్వాహకులు.
ఇందుకోసమే ప్రత్యేకించి ఏటా ఈ సీజన్లో పర్యాటకులు వస్తుంటారు. ఇందుకోసమే ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం పారాగ్లైడింగ్ పండుగను కూడా నిర్వహిస్తోంది. మీరు క్రిస్మస్ వేడుకల ఆనందాన్ని రెట్టింపు చేయాలనుకుంటే స్నేహితులతో ఖజ్జియార్కు ఈ సీజన్లో వెళ్లవచ్చు.
ఘన్సాలీ
దేవతల భూమిగా చెప్పుకునే ఉత్తరాఖండ్లో అనేక ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వారిలో ఘన్సాలీ కూడా ఉంది. ఈ అందమైన పర్యాటక ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని టెహ్రీ గర్వాల్ జిల్లాలో ఉంది. ఘన్సాలీ పవిత్ర నదిగా భావించే భిలంగనా ఒడ్డున ఉంది. మరోవైపు అక్కడ దట్టమైన అడవి సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తోంది.
ఈ నది ఒడ్డున నెలకొని ఉన్న హనుమాన్ దేవాలయాన్ని స్థానిక ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ప్రతి సంవత్సరం హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఘనంగా జాతరను నిర్వహిస్తారు. ఇందుకోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఘన్సాలీ హనుమాన్ ఆలయానికి వస్తుంటారు. ఈ సీజన్లో మీరు మీ స్నేహితులతో క్రిస్మస్ సందర్భంగా ఘన్సాలీ పర్యాటక అందాలను వీక్షించవచ్చు.