మహారాష్ట్రలోని ఈ అద్భుతమైన హిల్ స్టేషన్ను సందర్శించండి
మీరు కుటుంబసమేతంగా రానున్న రోజుల్లో టూర్ ప్లాన్ చేయాలనుకుంటే మాత్రం మహారాష్ట్రలోని ఈ అద్భుతమైన హిల్ స్టేషన్లను మీ జాబితాలో తప్పకుండా చేర్చుకోండి. ఎందుకంటే, మీ విహారానికి అదనపు ఆకర్షణగా ఈ హిల్ స్టేషన్లు నిలుస్తాయనడంలో సందేహమే లేదు. అంతేకాదు, భారతదేశంలోని అందమైన మరియు అత్యంత అభివృద్ధి చెందిన నగరాలలో మహారాష్ట్ర ఒకటి. ప్రతిరోజు లక్షలాది మంది దేశ, విదేశీ పర్యాటకులు ఈ రాష్ట్రాన్ని సందర్శిస్తుంటారు.
ఉదాహరణకు, పంచగని, మహాబలేశ్వర్ మరియు లోనావాలా మొదలైన హిల్ స్టేషన్లను సందర్శిస్తూనే ఉంటారు. అయితే, ఇక్కడ సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో చాలా తక్కువ మందికి తెలిసిన జవహర్ హిల్స్టేషన్లో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అక్కడకు నిత్యం పరిమిత సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. మీరు ఒక్కసారి సందర్శించిన తర్వాత ప్రతిసారీ వెళ్లేందుకు ఇష్టపడే ఈ హిల్ స్టేషన్ విశేషాలు తెలుసుకుందాం.
హనుమాన్ పాయింట్, జవహర్ హిల్ స్టేషన్
సుమారు 518 మీటర్ల ఎత్తులో ఉన్న అందమైన పర్యాటక ప్రాంతం జవహర్ హిల్ స్టేషన్. ఇది ముంబయికి 180 కిలోమీటర్ల దూరంలో థానేలో ఉంది. ఇక్కడి హనుమాన్ పాయింట్ చాలా అందమైన సహజ పర్యాటక ప్రదేశం. ఈ పాయింట్ నుండి జవహర్ కొండల అద్భుతమైన దృశ్యాన్ని చూసిన తర్వాత మీ మనస్సు పులకించకతప్పదు. చుట్టూ పచ్చదనాన్ని చూసిన తర్వాత మరో ప్రపంచంలో విహరిస్తోన్న అనుభూతి కలుగుతుంది. ఈ ప్రదేశానికి ఒక చారిత్రక నేపథ్యం ఉన్నట్లు ప్రచారంలో ఉంది. దాని ప్రకారం హనుమంతుడు ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నాడని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి హనుమాన్ పాయింట్ అని పేరు పెట్టారట.
జై విలాస్ ప్యాలెస్
జవహర్ రాచరిక చరిత్రను దగ్గరగా చూడాలంటే ఖచ్చితంగా జై విలాస్ ప్యాలెస్ని సందర్శించాలి. ఎత్తయిన కొండపై ఉన్న ఈ ప్యాలెస్ పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంది. ఈ ప్యాలెస్ నుండి అన్ని వైపులా పచ్చదనం కనిపిస్తుంది. ఈ చారిత్రాత్మక ప్యాలెస్ను రాజా యశ్వంత్ రావ్ ముక్నే నిర్మించారు. దీన్ని క్లాసికల్ స్టైల్లో నిర్మించినట్లు చెబుతారు. అన్నివైపులా సొరంగ మార్గాలతో నిర్మించబడిన ఈ కట్టడం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.
కల్మండవి జలపాతం
కల్మండవి జలపాతం జవహర్ హిల్ స్టేషన్కు చేరువగా ఉన్న అందమైన ప్రదేశం. ఈ ప్రదేశాన్ని చాలా మంది సందర్శకులు కల్మండవి జలపాతం అని కూడా పిలుస్తారు. దాదాపు 100 మీటర్ల ఎత్తు నుంచి జాలువారే నీటి దృశ్యాన్ని చూసిన వారు ఎవ్వరైనా ఆ అనుభూతిని ఫీల్ అవ్వకుండా ఉండలేరు. ఈ ప్రదేశం చుట్టూ పచ్చదనం కూడా పర్యాటకులను ఆహ్లాదపరుస్తుంది.
అంతేకాదు, జవహర్ దగ్గరలోని చాలా ప్రదేశాలు రాత్రి సమయంలో వీక్షణకు ప్రసిద్ధి పొందాయి. మరీ ముఖ్యంగా సూర్యాస్తమయ సమయం ఇక్కడ గడిపేందుకు ఎక్కువమంది ఆసక్తి కనబరుస్తారు. హనుమాన్ పాయింట్, జై విలాస్ ప్యాలెస్ మరియు కల్మండవి జలపాతం కాకుండా, మీరు సందర్శించేందుకు చాలా ప్రదేశాలే ఉన్నాయి. ఉదాహరణకు, కొండ దిగువన ఉన్న సన్రైజ్ పాయింట్, భోపట్ఘర్ కోట మరియు దబద్బా జలపాతం వంటి ఉత్తమ ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు.