శ్రీ ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయ మహత్యం !
ముందుగా తెలుగు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు శ్రీరామనవమి ఉత్సవాలను భద్రాచలంలో నిర్వహించేవారు. రాష్ట్రం ఆంధ్ర, తెలంగాణ గా 2014 జూన్ 2 న విడిపోయిన తర్వాత భద్రాచలం తెలంగాణ లోకి వెళ్లిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం శ్రీ రామ నవమి ఉత్సవాలను అధికారికంగా జరుపుకోవటానికి ఆలయాలు కనిపించలేదు. అప్పుడే ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది ఒంటిమిట్ట.
ఒంటి మిట్ట లో అంతగా ఏముంది ??
ఒంటిమిట్ట లో ప్రసిద్ధి గాంచిన దేవాలయాల్లో ఒకటైన రాములవారి ఆలయం ఉన్నది. ఇక్కడున్న రామాలయాన్ని కోదండరామ స్వామి రామాలయం అంటారు. ఒంటిమిట్ట కడప జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రం. ఈ క్షేత్రం కడప నుంచి రాజంపేట వెళ్లే మార్గంలో 25 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి నుండి 115 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
ఇది కూడా చదవండి : కడప - విభిన్న సంస్కృతుల నిలయం !
ఒంటిమిట్ట లోని శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయం దాని విశిష్టతకు, మహిమలకు పేరుగాంచినది. ఇక్కడ ప్రచారంలో ఉన్న శ్రీ ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయ మహత్యం గుర్తుకు తెచ్చుకుంటే నిజంగా ఆశ్చర్యం కలగకమానదు. ఈ క్షేత్రానికి గల మరోపేరు ఏకశిలానగరం. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుంచి భద్రాచలం విడిపోయిన తర్వాత ఒంటిమిట్టని 'ఆంధ్రా భద్రాచలం' గా పిలుస్తున్నారు ప్రజానీకం. కోదండరాముల వారి ఆలయ గోపుర నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం పట్టు వస్త్రాలను, తలంబ్రాలను సమర్పించి, ప్రత్యేక కార్యక్రమాలనూ నిర్వహిస్తారు.
కోదండరామ స్వామి ఆలయం ఎలా చేరుకోవాలి ?
కోదండరామ స్వామి ఆలయానికి చేరుకోవడానికి అన్నివిధాలా రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
విమాన మార్గం
విమానంలో వచ్చేవారు కొత్తగా పునరుద్ధరించబడిన కడప విమానాశ్రయంలో దిగి, అక్కడి నుంచి ఏదైనా ప్రవేట్ లేదా ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించి చేరుకోవచ్చు. కడప విమానాశ్రయం కొత్త కాబట్టి విమాన సర్వీసులు ఇంకా అంతగా అందుబాటులో లేవు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయం 112 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
రైలు మార్గం
ఒంటిమిట్ట లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఇక్కడి నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రధాన ఆలయానికి సులభంగా కాలినడకన గానీ లేదా షేర్ ఆటోలో గానీ ఎక్కి చేరుకోవచ్చు. అలాగే భాకరపేట్ రైల్వే స్టేషన్ (7 కి.మీ), కడప రైల్వే స్టేషన్ (25 కి.మీ) మరియు తిరుపతి రైల్వే స్టేషన్ (106 కి.మీ) లు ఒంటిమిట్ట కు చేరువలో ఉన్నాయి.
రోడ్డు మార్గం
ఒంటిమిట్ట కు రోడ్డు మార్గం చాలా సులభంగా ఉంటుంది. కడప నుండి ప్రతి రోజు అరగంటకోసారి ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు తిరుగుతుంటాయి. కడప 7 రోడ్ల కూడలి వద్ద కానీ లేదా కడప ప్రధాన బస్ స్టాండ్ నుండి కానీ లేదా కడప పాత బస్ స్టాండ్ నుండి కానీ ప్రభుత్వ బస్సులు ఎక్కొచ్చు. తిరుపతి, అనంతపురం, కడప, కర్నూలు తదితర ప్రధాన పట్టణాల నుండి ఏపి ఎస్ ఆర్ టీ సి బస్సులు అందుబాటులో ఉన్నాయి.
చిత్ర కృప : Kamesh Meduri
ఆలయ ప్రశస్తి
ఒంటిమిట్ట క్షేత్రంలోని కోదండరాముల వారి ఆలయంలో విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించినాడు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే శిలలో రాముడు, సీతాదేవి మరియు లక్ష్మణులను ఇక్కడ చూడవచ్చు. అందుకే ఏకశిలా నగరం అన్ని పేరొచ్చింది. మీకొక సందేశం వచ్చి ఉండాలె ..! ఆ .. గుర్తొచ్చింది కదూ ..! ఆంజనేయుని విగ్రహం. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండరు. దేశంలో ఆంజనేయ స్వామి లేకుండా రాముల వారు ఉన్న ఆలయం ఇదొక్కటే.
చిత్ర కృప : vasudev reddy
రామ తీర్థం
రాముడు అరణ్యవాసం చేసేటప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించాడని రామాయణంలో పేర్కొనబడింది. ఓరోజున సీతాదేవికి దప్పిక వేసిండట. అప్పుడు రాములవారు ఆ దప్పికను పోగొట్టటానికి తన బాణాన్ని ఎక్కుపెట్టి పాతాళ గంగను పైకి తెప్పించాడట. ఆది తాగి సీతాదేవి తృప్తి చెందినదిగా ఇతిహాసాల్లో చెప్పబడింది. అదే రామ తీర్థం గా నేడు పిలువబడుతున్నది.
చిత్ర కృప : vasudev reddy
ఆలయ గోపురాలు
కోదండరామ స్వామి ఆలయానికి మూడు ప్రధాన గోపురద్వారాలు ఉన్నాయి. ఆ గోపురాల ద్వారా లోనికి వెళితే విశాలమైన మైదానం ఉంటుంది. ఆలయ ముఖద్వారం ఎత్తు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించారు. ఈ మండపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి.
చిత్ర కృప : seeta dutta
శిల్ప సంపద
ఆలయ స్థంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు. రామాయణ, మహాభారతంలోని కథలు మరియు దశావతారములు వటపత్రశాయి, వారధికి గుండ్రాళ్లు ఆంజనేయస్వామి వేస్తున్న దృశ్యం, లక్ష్మణమూర్ఛ, సీతాదేవికి ఆంజనేయస్వామి అంగుళీకమును చూపించే దృశ్యం, గోవర్ధనగిరి ఎత్తే దృశ్యం, మరియు శ్రీ కృష్ణ కాళీయమర్దనం, పూతన అనే రాక్షసిని సంహరించుట వంటి శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి.
చిత్ర కృప : anilkumarr_pk
ఆలయ విశేషాలు
చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు. ఇక్కడే ఆంధ్రా వాల్మీకి గా పేరుపొందిన వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో వ్రాశాడు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల - రథం ఉన్నాయి.
చిత్ర కృప : Saimanohar Pondalur
ఇమాంబేగ్ బావి
ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి. ఇమాంబేగ్, 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నభీకాన్ ప్రతినిథి. ఇతను ఒంటిమిట్ట కోదండరామున్ని పరీక్షించగా రాముని మహిమలను ప్రత్యక్షంగా చూసి స్వామి భక్తుడిగా మారిపోయాడు. కోదండరాముని కైంకర్యానికి ఒక బావిని కూడా తవ్వించాడని చరిత్ర చెబుతుంది. అదే ఇప్పుడు ఇమాంబేగ్ బావి గా పిలువబడుతున్నది.
చిత్ర కృప : vasudev reddy
ఆశ్చర్యం కలిగించే మహిమలు
ఆంధ్ర వాల్మీకి వావికొలను సుబ్బారావుకు స్వప్నంలో బైరాగులు కనపడటం, సహజ పండితుడు బమ్మెర పోతన రచిస్తున్న పద్యంలో చరణాలు గుర్తుకు రాక నిలిపి వేయగా శ్రీరాముడు ప్రత్యక్షమై పూర్తి చేయడం, ఇమాంబేగ్ పిలిస్తే కోదండరాముడు 'ఓ' అని పలకడం, తూర్పువైపునకు ఉన్న సీతారామ లక్ష్మణమూర్తులు మాల ఓబన్న అనే భక్తుని కోసం పశ్చిమైపునకు మరలడం వంటి కథనాలు కోదండ రాములవారి మహిమలుగా ఇక్కడ చెప్పబడుతున్నాయి.
చిత్ర కృప : Rk Rao
గొప్ప ఆలయాల్లో ఇది ఒకటి
చరిత్ర మధ్యయుగాల్లో మన దేశాన్ని దర్శించిన ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ తాను చూసిన గొప్ప ఆలయాల్లో ఇది ఒకటిగా అభివర్ణించాడు. కవి బమ్మెర పోతన, ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది కోదండరాముడికే. ఆ కవి విగ్రహాన్ని ఇప్పటికీ ఆలయంలో దర్శించవచ్చు.
చిత్ర కృప : Kanheya Behera
పూజలు,ఉత్సవాలు
ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. సీతారాములవారి కళ్యాణం నిజంగా చూడముచ్చటగా ఉంటుంది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు, కళ్యాణం, రథోత్సవం జరుగుతాయి. నవమినాడు పోతన జయంతి నిర్వహించి కవులను సత్కరిస్తారు.
చిత్ర కృప : Satyanath Venkata Rajamahanti
ముక్తి పొందిన మహనీయులు
స్వామి వారిని చూసి ముక్తి పొందిన మహనీయులు అయ్యల రాజు తిప్పరాజు, అయ్యల రాజు రామభద్రుడు, బమ్మెర పోతన, తాళ్ళపాక అన్నమాచార్యులు, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, ఉప్పు గుండూరు వెంకటకవి, వరకవి మరియు జానపదల కథల ప్రకారం ఒంటుడు, మిట్టుడు.
చిత్ర కృప : vasudev reddy
ఇది కూడా చదవండి : బ్రహ్మం గారి మఠం వద్ద అద్భుత గుహలు !