మేడారం జాతర ... ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతర. ఇది అటవీ ప్రాంతమైన మేడారంలో నాలుగు రోజుల పాటు గిరిజనులు జరుపుకొనే జాతర. రాష్ట్రంలోని భక్తులే కాక దేశం లో ఉన్న వివిధ రాష్ట్రాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొంటారు. కోటి మందికి పైగా పాల్గొనే ఈ జాతర విశేషాలు ఒకసారి గమనిస్తే ...
ఇది కూడా చదవండి : వరంగల్ ... కాకతీయుల రాజధాని !
మేడారం అనే గ్రామం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా కి 110 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో కొండల్లో, కోనల్లో ఉంటుంది. భారతదేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర గా ఖ్యాతి గడించిన మేడారం జాతర గిరిజన సంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మేడారం జాతర ని సమ్మక్క - సారక్క జాతర అని కూడా పిలుస్తారు. ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ జాతర ని గిరిజనులు నాలుగు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు.
వనదేవతలు
సమ్మక్క - సారక్క లను భక్తులు కష్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్న వారిని ఆడుకొనే ఆపద్భాంధవులుగా, వనదేవతలుగా పూజిస్తారు.
చిత్ర కృప : Harini B
ఎలా చేరుకోవాలి ?
వరంగల్ కు హన్మకొండ కు మధ్య దూరం 8 కిలోమీటర్ల ఉంటుంది. హన్మకొండ నుండి మేడారం దాదాపు 95 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం వరకు ప్రభుత్వ బస్సులు తిరుగుతుంటాయి. ప్రస్తుతం జరుగుతున్న ఈ మేడారం జాతర ఉత్సవాలకు నేరుగా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ బస్ స్టాండ్ ల నుండి బస్సులు ఏర్పాటుచేశారు.
చిత్ర కృప : satish lal andhekar
గత చరిత్ర
కోయ గిరిజనుల ఉనికికోసం పోరాడి వీర మరణం పొందిన సమ్మక్క-సారలమ్మ జాతర ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్రుడు కాలం నుంచి కొనసాగుతున్నట్లు స్థలపురాణాలు చెబుతున్నాయి. ఆ కాలంలో మేడారం ప్రాంతాన్ని పడిగిద్దరాజు పరిపాలించేవారు.
చిత్ర కృప : satish lal andhekar
గత చరిత్ర
పడిగిద్దరాజు కాకతీయుల సామంతరాజు. ఇతని సతీమణి సమ్మక్క. వీరి సంతానం సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. ఓసారి మేడారం ప్రాంతంలో అనావృష్టి ఏర్పడింది. దీంతో ప్రజలు పన్నులు కట్టలేని స్థితికి వచ్చారు. పగిడిద్దరాజు తాను కప్పం కట్టలేనంటూ చేతులేత్తేశాడు. దాంతో ప్రతాపరుద్రుడు అతనిపై సైనికులను పంపాడు.
చిత్ర కృప : satish lal andhekar
గత చరిత్ర
పగిడిద్దరాజు అతని కుమార్తెలు, అల్లుడు గోవిందరాజు కలిసి కాకతీయ సైన్యాన్ని మేడారం సరిహద్దులోని సంపెంగ వాగు వద్ద ఢీ కొట్టి పోరాడి వీరమరణం పొందారు. కుమారుడు జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాటి నుంచి సంపెంగ వాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి గాంచింది.
చిత్ర కృప : satish lal andhekar
గత చరిత్ర
తన కొడుకు, కుమార్తె మరణించారన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది. ఈటెలు, బళ్ళాలతో కాకతీయసైన్యాలను పరుగెత్తించి ... పరుగెత్తించి అంతం చేసింది. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యములోనే అదృశ్యమైనది. తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడి గా మారిపోయాడు.
చిత్ర కృప : satish lal andhekar
మేడారం సందడి
మేడారం జాతర సందడి సుమారు పది రోజుల ముందు నుంచే మొదలవుతుంది. సారలమ్మ పూజారులు కన్నెపల్లిలోని గుడి వద్ద అమ్మ వారిని పూజించి సమ్మక్క దేవతపూజారులైన సిద్దబోయిన వారింటికి వస్తారు. సమ్మక్క పూజారులు చిలుకల గుట్ట వద్దకు వెళ్ళి దేవతను కుంకుమ భరిణ రూపంలో తీసుకువస్తారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు 10 రౌండ్లు తుపాకీ కాల్పులు జరిపి దేవతను గద్దెకు తీసుకు వస్తారు. భక్తుల మొక్కుబడుల అనంతరం తిరిగి దేవతలు వనప్రవేశం చేస్తారు.
చిత్ర కృప : satish lal andhekar
మొదటి రోజు
జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు.
చిత్ర కృప : satish lal andhekar
రెండవ రోజు
రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపములో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్టించే సమయములో భక్తులు పూనకంతో ఊగిపోతారు.
చిత్ర కృప : satish lal andhekar
మూడవ రోజు
మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు.
చిత్ర కృప : satish lal andhekar
నాలుగవ రోజు
నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యద్ద స్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యముగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత.
చిత్ర కృప : satish lal andhekar
బెల్లం నైవేద్యం
తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారము(బెల్లము) నైవేద్యముగా సమర్పించుకుంటారు.
చిత్ర కృప : satish lal andhekar
సర్వమతాల కలయిక
కేవలం గిరిజనులే కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవములో పాల్గొంటారు సుమారు కోటికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర ఈ జాతర ఆసియా లోనే అతి పెద్ద జాతర గా ప్రసిద్ధి చెందినది.
చిత్ర కృప : satish lal andhekar