కర్నాటక రాష్ట్రంలో ఉడుపి క్రిష్ణ దేవాలయానికే కాక మంచి వంటకాలకు కూడా ప్రసిద్ధి. ఉడుపి పేరుతో ఉడుపి ఆహారాలు అనేకం తయారు చేస్తారు. నేటికి ఉడుపి హోటళ్ళు చాలా చోట్ల వివిధ ప్రదేశాలలో కనపడుతూంటాయి. నోరూరించే ఈ శాకాహార వంటకాలను మధ్వ మతం వారు తయారు చేస్తారు.వీరు క్రిష్ణుడి దేవాలయానికి ఎన్నో తరాలనుండి వివిధ వంటలు చేసి నైవేద్యంగా అర్పిస్తున్నారు. ఉడుపి పట్టణం బెంగుళూరుకు 400 కిలోమీటర్లు, మంగుళూరుకు 54 కిలో మీటర్ల దూరంలో ఉంది.
ఉడుపి పట్టణం హిందువుల ఆరాధ్య దైవం శ్రీక్రిష్ణుడికి ప్రధానంగా చెపుతారు. ఇక్కడే పొరుగుననే ఉన్న యల్లూరు లో మరో దేవాలయం భగవంతుడు శివుడికి కూడా ఉంది. ఇది సుమారు వేయి సంవత్సరాల క్రిందటిదని చెపుతారు. 13వ శతాబ్దంలో మతాచార్యుడు మధ్వాచార్య ఇక్కడ ఉడుపి క్రిష్ణ మఠం స్ధాపించారు.
ఈ దేవాలయంలో దేముడికి నైవేద్యం కొరకు గాను తయారు చేసే ఆహార పదార్దాలను బ్రాహ్మణులు ఎంతో నియమ నిష్టలతో తయారు చేస్తారు. ఈ వంటకాలు క్రమేణా ప్రసిద్ధి చెంది కర్నాటక రాష్ట్రంలోనే కాక, దేశం యావత్తూ ప్రసిద్ధి గాంచాయి. వీరు తయారు చేసే దోశలు నేటికి ఎంతో ఇష్టంగా అన్ని ప్రాంతాలలో తినబడుతున్నాయి.
స్ధానిక ఇతిహాసాలు పరిశీలిస్తే....స్ధానిక చరిత్ర మేరకు చంద్రుడికి 27 నక్షత్రాలు భార్యలుగా వివాహం చేసుకున్నారు. వెంటనే చంద్రుడు క్షీణించాడు. చివరకు అందరికి పెద్ద దిక్కు అయిన శివుడిని చంద్రుడు, నక్షత్రాలు కలసి ఒక లింగంగా తయారు చేసి పూజలు చేశారు. ఇప్పటికి ఈ లింగాన్ని మీరు ఉడుపిలో చూడవచ్చు. ఈ రకంగా ఈ పట్టణం ప్రసిద్ధి చెందింది. ఉడు ...అంటే భగవంతుడని, పా...అంటే నక్షత్రాలని సంస్కృతంలో చెపుతారు.
ఉడుపి లో క్రిష్ణ దేవాలయం గురించి అనేక కధలున్నాయి. ఒక స్ధానిక కధ మేరకు 16వ శతాబ్దంలో తక్కువ కులాలకు చెందిన కనకదాస అనే భక్తుడు క్రిష్ణుడి దర్శనం కోరాడని, అయితే అతడిని దేవాలయంలోకి అనుమతివ్వలేదని దానికిగాను కనకదాస దేవాలయానికి ఉన్న చిన్న కిటికీ నుండి లోపలికి చూశాడని, అయితే అతనికి క్రిష్ణుడి వీపు భాగం మాత్రం కనపడిందని, అపుడు క్రిష్ణుడు తానే ముందుకు తిరిగి అతడికి దర్శన మిచ్చాడని చెపుతారు.