వారణాసిలో అత్యాధునిక హంగులతో క్రికెట్ స్టేడియం..
భారత్లో క్రికెట్కు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ కు ఉన్నఆదరణ దృష్ట్యా నేటితరం యువకులు క్రికెట్నే కెరియర్గా ఎంచుకుంటున్నారు. క్రికెట్ చూసే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటున్నది. ఈ క్రమంలో దేశంలో క్రికెట్కు ఉన్న డిమాండ్కు తగ్గట్టు.. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు, హంగుల కొత్త స్టేడియాల నిర్మాణంపై కేంద్రం దృష్టి సారించింది. ప్రపంచంలోని పురాతన నగరాల్లో ఒకటైన కాశీలో క్రికెట్ స్టేడియం నిర్మించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే దేశంలో చాలానే క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. వీటికి భిన్నంగా కొత్త కొత్త హంగులతో, ఆధునాతన సౌకర్యాలతో వారణాసి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించనున్నారు. ఇప్పటి వరకూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చాలా వినూత్నంగా ఈ స్టేడియం నిర్మాణానికి 'శివుడి' థీమ్ను తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రండి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

ఈ 23న శంకుస్థాపన..
వారణాసిలో ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను నిర్మించబోతున్నారు. దీనికి సెప్టెంబర్ 23న ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఈ స్టేడియంను రెండేళ్లలో పూర్తిచేయాలనుకుంటున్నారు. ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ మ్యాచ్లు కూడా ఇక్కడ నిర్వహించబడతాయి. బాబా విశ్వనాథ్ నగరమైన వారణాసిలో నిర్మించబడుతున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం థీమ్ భోలేనాథ్ ఆధారంగా ఉంటుంది. ఢమరుకం ఆకారంలో ప్రవేశ ద్వారం, త్రిశూలం ఆకారంలో ఫ్లడ్ లైట్ పోల్స్, ఇలా ప్రతీ అంశంలో శివతత్వం ఉండే విధంగా నిర్మించనున్నారు. 30వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం ఉన్న స్టేడియంలో ఏడు పిచ్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిబంధనల ప్రకారం అత్యాధునిక స్టేడియం నిర్మించనున్నారు. 2025 డిసెంబర్ నాటికి ఈ స్టేడియం పూర్తి కానుంది. శివుడికి సంబంధించిన సంగీత వాయిద్యం ఆకారంతోపాటు గంగా ఘాట్ మెట్లను పోలిన ప్రేక్షకుల గ్యాలరీ ఉంటుంది.

రూ. 451 కోట్లతో స్టేడియం నిర్మాణం..
వారణాసిలోని రాజా తలాబ్లో ఉన్న గంజరి ప్రాంతంలో ఈ అంతర్జాతీయ స్టేడియంను నిర్మించనున్నారు. రూ. 451 కోట్లతో ఈ స్టేడియాన్ని నిర్మించనున్నారు. స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ లీగ్లు జరుగుతాయి. అంతేకాకుండా రానున్న కాలంలో ఐపీఎల్ మ్యాచ్లు కూడా ఇక్కడే నిర్వహించనున్నారు. దీని వల్ల స్టేడియంలో అన్ని సౌకర్యాలు ఉండేలా చూడడున్నారు. సెప్టెంబర్ 23న ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా జరిగే ఈ శంకుస్థాపనకు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, బీసీసీఐకి చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్న, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, సెక్రటరీ జే షా సహా కీలక వ్యక్తులు కూడా ఈ కార్యక్రమంలో హాజరుకానున్నారు. కాన్పూర్, లక్నో తర్వాత ఉత్తరప్రదేశ్లో మూడవ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని వారణాసిలో నిర్మిస్తున్నారు. ఎల్ అండ్ టీ సంస్థ ఈ స్టేడియం డిజైన్ను రూపొందించింది.
ఇన్ని ఎకరాల్లో స్టేడియం..
వారణాసిలో నిర్మించనున్న ఈ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం 30.86 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ స్టేడియంలో దాదాపు 30 వేల మంది కూర్చోవచ్చు. దీంతో పాటు డే నైట్ మ్యాచ్లకు కూడా స్టేడియాన్ని సిద్ధం చేశారు. స్టేడియం చేరుకునే ప్రతి మార్గాన్ని విశాలంగా,అందంగా తీర్చిదిద్దనున్నారు. ట్రాఫిక్ లేకుండా ప్రజలు ఈ స్టేడియాన్ని చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.



Click it and Unblock the Notifications













