ఈ వారం పది రోజుల్లో రైలు ప్రయాణం చేయాలని ప్లాన్ చేసుకున్నారా? అయితే, మీలాంటివారి కోసమే ఈ అలర్ట్. దక్షిణ మధ్య రైల్వే ఈరోజు(జూన్ 23) నుంచి ఆగస్టు 11 వరకూ పలు రైళ్లను రద్దు చేయనుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయవాడ డివిజన్ నిడదవోలు-కడియం మధ్య ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి.
ఈ కారణంగా రోజు నుంచి నుంచి ఆగస్టు 11 వరకు పలు కీలకమైన రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ అధికారి వెల్లడించారు. వీటిలో రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి ఎక్స్ప్రెస్లు వంటి రైళ్లు ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆధునికీకరణ పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు.
ఈరోజు నుంచి ఆగస్టు 10 వరకు..
రద్దు చేయబడిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఈరోజు నుంచి ఆగస్టు 10 వరకు మచిలీపట్నం-విశాఖ (17219), విశాఖ-మచిలీపట్నం (17220) ఎక్స్ప్రెస్, గుంటూరు-రాయగడ (17243), విశాఖ-లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్ప్రెస్ రద్దయ్యాయి. ఈనెల 24 నుంచి ఆగస్టు 11 వరకు రాయగడ-గుంటూరు (17244), లింగంపల్లి-విశాఖ (12806) జన్మభూమి ఎక్స్ప్రెస్లను రద్దు చేస్తున్నట్లు అధికారలు ప్రకటించారు.

రేపటి నుంచి ఆగస్టు 9 వరకు..
అలాగే, రేపటి నుంచి ఆగస్టు 9 వరకు తిరుపతి-విశాఖ (22708) డబుల్డెక్కర్ ఎక్స్ప్రెస్ పట్టాలెక్కదు. దీంతోపాటు 24 నుంచి ఆగస్టు 10 వరకు రాజమహేంద్రవరం-విశాఖ (07466) ప్యాసింజర్, విశాఖ-రాజమహేంద్రవరం (07467) ప్యాసింజర్, గుంటూరు-విశాఖ (17239) సింహాద్రి, విశాఖ-గుంటూరు (17240) సింహాద్రి, విజయవాడ-విశాఖ (12718) రత్నాచల్ ఎక్స్ప్రెస్, విశాఖ-విజయవాడ (12717) రత్నాచల్ ఎక్స్ప్రెస్, గుంటూరు-విశాఖ (22702) ఉదయ్ ఎక్స్ప్రెస్, విశాఖ-గుంటూరు (22701) ఉదయ్ ఎక్స్ప్రెస్, విశాఖ-తిరుపతి (22707) డబుల్డెక్కర్ ఎక్స్ప్రెస్లు అందుబాటులో ఉండవు.
కీలక రైళ్ల రద్దుతో ఆందోళన..
రత్నాచల్, జన్మభూమి లాంటి కీలకమైన రైళ్లు సైతం రద్దవ్వడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మరీ ముఖ్యంగా విశాఖపట్నం, హైదరాబాద్ నగరాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ మార్గంలో నిత్యం వేలాదిగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పుడు తాజా రైల్వే అధికారుల ప్రకటనతో అలాంటివారికి ఇబ్బందులు తప్పేలాలేవు.
ఇదే అదునుగా ప్రయివేటు ట్రావెల్స్ ధరలు పెంచేస్తాయని, వాటిని నియంత్రించాలని కోరుతున్నారు. అలాగే, ఈ తేదీల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ బస్సు సర్వీసుల సంఖ్య పెంచాలని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే టూర్ ప్లాన్ చేసుకున్నవారు మీ ప్రయాణపు జాబితాలో ఈ రైళ్లు ఉంటే మాత్రం.. మీ ప్రణాళికలను మార్చుకోక తప్పదండోయ్.



Click it and Unblock the Notifications












