తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి యాదాద్రి ఆలయం. శ్రీలక్ష్మినర్సింహస్వామిని దర్శించుకుని కోర్కెలు కోరితే.. కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే నిత్యం ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. యాదాద్రి ఆలయాన్ని సందర్శించే భక్తులకు ఓ ముఖ్య గమనిక. తాజాగా ఈ ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి ఈ పుణ్యక్షేత్రంలో సెల్ఫోన్ నిషేదించినట్లు వెల్లడించారు.
ప్రధాన ఆలయంలో సెల్ఫోన్ నిషేధిస్తున్నట్లు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఈవో కీలక ఆదేశాలు జారీ చేసారు. ఇకనుంచి, వీవీఐపీల నుంచి కిందిస్థాయి సిబ్బంది, భక్తులకు ఎవరికీ సెల్ఫోన్ అనుమతి లేదని ఆలయ ఈవో అన్నారు.
యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణం చేపట్టిన అనంతరం లక్ష్మీ నర్సింహుడిని దర్శించుకునే వారి సంఖ్య మరింతగా పెరుగుతోంది. టిటీడి తరహాలో యాదగిరిగుట్ట ఆలయంలో కూడా అనేక నిబంధనలు అమలు చేయడం జరుగుతుంది. ఇక, ఇప్పడు కొత్తగా యాదాద్రి ప్రధానాలయంలోకి సెల్ఫోన్లను నిషేధిస్తూ ఆలయ ఈవో భాస్కర్రావు ఉత్తర్వులను జారీ చేశారు.

వీఐపీలు అయినా సరే..ఇదే నిబంధన..
ఇప్పటి వరకు ఈ నిబంధన సాధారణ భక్తులకు మాత్రమే అమలు ఉండేదని, తాజాగా ఈవో జారీ చేసిన ఆదేశాలతో వీవీఐపీలు మెుదలుకొని, ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు, పోలీసులు, మీడియా, అవుట్ సోర్సింగ్ సిబ్బందికీ కూడా ఈ నిబంధన వర్తించనుందని తెలిపారు. ఎవరైనా ప్రధాన ఆలయంలోకి సెల్ఫోన్ తీసుకెళ్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆలయ ఈవో వెల్లడించారు.
ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. ఓ పక్క ఆలయ అధికారులు ఇలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుంటే మరోపక్క ఆలయంలో వ్యాపారుల దోపిడీ మరింత పెరుగుతోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక కొబ్బరికాయ, ఓ చిన్న తులసి మాలకు కలిపి, రెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ దోపిడిపై తక్షణమే ఆలయ ఈవో స్పందించాలని వారు కోరుతున్నారు.



Click it and Unblock the Notifications













