శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. శబరిమలకు ప్రత్యేక బస్సులను భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఏపీఎస్ఆర్సిటిసి మూడు రకాల ప్యాకేజీలను నిర్ణయించింది. ఇందులో భాగంగానే 5, 6, 7 రోజుల ప్యాకేజీలను ప్రకటించింది.ఈ ప్యాకేజీలో ఇంద్ర, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులు ఉన్నాయి. ఆ ప్యాకేజీ వివరాలేంటో చూసేద్దాం..
అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, ఈ టూర్ ప్యాకేజీలు విశాఖపట్నం రీజియన్ విశాఖపట్నం నుండి శబరిమల వరకు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఆర్టీసీ విశాఖపట్నం నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఈ ఏడాది కూడా మూడు రకాల ప్యాకేజీలను ఆర్టిసి భక్తుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఆయా ప్యాకేజీలను బట్టీ బస్సులు ప్రయాణించే మార్గంలో ఉన్న ఆలయాల సందర్శనలో వ్యత్యాసం ఉంటుంది. భక్తులు సందర్శించడానికి ఎంచుకున్న దేవాలయాల ఆధారంగా వారి అవసరాలను తీర్చేందుకు ఈ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఆర్టిసీ అందిస్తోన్నప్యాకేజీ వివరాలివే..
ఐదు రోజుల ప్యాకేజీ..
ఏపీఎస్ఆర్టిసీ అందిస్తోన్న ఐదు రోజుల టూర్ ప్యాకేజీలో విజయవాడ, మేల్మరువాటూరు, ఎరుమేలి, పంబ మీదుగా ప్రయాణం చేసి సన్నిధానం చేరుకుంటుంది. ఇక, తిరుగు ప్రయాణంలో శ్రీపురం, కాణిపాకం, తిరుపతి, విజయవాడలను ఈ ప్యాకేజీ కవర్ చేస్తుంది. ఈ ప్యాకేజీలో ఒక్కొక్కరి టిక్కెట్ ధర రూ.6,600 (సూపర్ లగ్జరీ) చెల్లించాల్సి ఉంటుంది. అదే అల్ట్రా డీలక్స్ అయితే రూ. 6,600 చెల్లించాలి. ఇంద్ర అయితే రూ.8,500 గా నిర్ణయించారు.

ఆరురోజుల ప్యాకేజీ..
ఆర్టిసీ అందిస్తోన్న ఆరు రోజుల టూర్ ప్యాకేజీలో విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవానీ, పళని, ఎరుమేలి, పంబ మీదుగా శబరిమల చేరుకుంటారు. ఇక, తిరుగు ప్రయాణంలో తిరుపతి, శ్రీ కాళహస్తి, విజయవాడ, అన్నవరం ఆలయాల దర్శనం చేసుకుంటారు. ఈ ప్యాకేజీలో భాగంగా ఒక్కొక్కరికి టిక్కెట్ ధర రూ. 7,000 (సూపర్ లగ్జరీ), ఉంటుంది. అదే అల్ట్రా డీలక్స్ అయితే రూ. 7,000 చెల్లించాలి. ఇంద్ర అయితే రూ. 9,000 ఉంటుంది.
ఏడురోజుల ప్యాకేజీ..
ఏడు రోజుల ప్యాకేజీలో విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవానీ, పళని, ఎరుమేలి, పంబ మీదుగా శబరిమల చేరుకుంటారు. ఇక, తిరుగు ప్రయాణంలో మదురై, రామేశ్వరం, తిరుపతి, శ్రీ కాళహస్తి, విజయవాడ, ద్వారపూడి, అన్నవరంలలో దర్శనం చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీలో భాగంగా ఒక్కొక్కరి టిక్కెట్ ధర రూ. 7,600 (సూపర్ లగ్జరీ) ఉంటుంది. అదే అల్ట్రా డీలక్స్ అయితే, రూ.7,600 ఉంటుంది. ఇంద్ర అయితే రూ.10,000 గా నిర్ణయించారు.

ఒరిస్సా నుంచి ప్రత్యేక సర్వీసులు..
ఇందులో భాగంగా అయ్యప్ప భక్తులకు సేవలందించడంలో అనుభవం ఉన్న, రూట్ తెలిసిన నిష్ణాతులైన డ్రైవర్లు మాత్రమే ఈ బస్సులను నడుపుతారు. కాబట్టి భక్తులు అధైర్యపడనవసరం లేదు. విశాఖపట్నం ప్రాంతం నుంచే కాకుండా పొరుగున ఉన్న ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా ప్రత్యేక ప్యాకేజీలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగా నౌరంగ్పూర్, కోరాపుట్, జైపూర్ నుంచి ఈ ప్యాకేజీలు ఉన్నాయి. 2003 నుండి ఏపీఎస్ఆర్టీసీ విశాఖపట్నం రీజియన్ ద్వారా నిర్వహించబడుతున్న శబరిమల ప్రత్యేక బస్సులు ప్రయాణికుల్లో మంచి ఆదరణ పొందుతున్నాయి.



Click it and Unblock the Notifications













