ఒడిశాలోని పూరీ యాత్రకు సిద్ధమవుతోన్న భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల సౌకర్యార్థం 315 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. జులై 6 నుంచి జులై 19 వరకు పూరీ జగన్నాథుడి రథయాత్ర మహోత్సవాలు జరగనున్న నేపథ్యంలో లక్షలాది భక్తులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు.
వారి రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దీంతోపాటు పూరీ రైల్వేస్టేషన్ పరిధిలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఇప్పటికే ఓ ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం.
రూట్ మ్యాప్ సిద్ధం..
దేశంలోని ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటిగా భక్తులు విశ్వసించే పూరీ ఆలయం వాస్తవ సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తోంది. ఎంతో కన్నుల పండువగా జరిగే జగన్నాథుని రథయాత్రలో దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు పాల్గొంటారు. జీవితంలో ఒక్కసారైనా సరే పూరీలో జరిగే ఈ రథయాత్రలో పాల్గొని తరించాలని అనుకోనివారు ఉండరు అంటే అది అతిసయోక్తికాదు. అలాంటి పూరీ జగన్నాథుడి రధయాత్రకు రైల్వే శాఖ రూట్ మ్యాప్తో సిద్ధమవుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 315 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించింది.

ఈ అంశంపై ఇప్పటికే రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒడిశా సీఎం మోహన్చరణ్ మాఝితోపాటు డిప్యూటీ సీఎంలు కనకవర్ధన్ సింగ్ దేవ్, ప్రభాతి పరిడలకు సమాచారం అందించారు. ఒడిశాలోని బాదం పహాడ్, రూర్కెలా, బాలేశ్వర్, సోనేపుర్, దస్పల్లా, జునాగఢ్ రోడ్, సంబల్పుర్, కేందుజుహర్గఢ్, పారాదీప్, భద్రక్, అనుగుల్; గుణుపుర్ నుంచి ప్రత్యేక రైళ్లు ప్రారంభమవుతాయని ఈస్ట్ కోస్ట్ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇలా ఒడిశాలోని అన్ని ప్రధాన పట్టణాల మీదుగా రైళ్లు నడిచేలా అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. సంధ్యా దర్శన్, బహుదా యాత్రకు వచ్చే భక్తుల కోసం కూడా ప్రత్యేక రైళ్లను నడిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈస్ట్కోస్ట్ రైల్వేతోపాటు దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి కూడా కొన్ని ప్రత్యేక రైళ్లను నడిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

భక్తుల సౌకర్యార్థం 15 వేల మంది..
ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంతోపాటు వేడుకలు జరిగే రోజుల్లో భక్తులకు పలు సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఈస్ట్కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ ఫకువాల్ మాట్లాడుతూ.. మహోత్సవాల సమయంలో పూరీ రైల్వే స్టేషన్ రద్దీగా మారే అవకాశముంది. ఈ నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయనున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఆశ్రయం కల్పించేందుకు వీలుగా రైల్వేశాఖ తరఫున సుమారు 15 వేల మందిని కేటాయించనున్నట్లు తెలిపారు.
జగన్నాథుని సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి గుండిచా మందిరానికి మూడు వేర్వేరు రథాల్లో చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆషాడ శుక్లపక్షమి హరిశయన ఏకాదశి రోజున నిర్వహించే అపురూప ఘట్టం కోసం భక్తులు ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అదే రోజున అధిత మొత్తంలో రైళ్లను నడిపేందుకు రైళ్వే అధికారులు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.



Click it and Unblock the Notifications













