దేశంలోని గొప్ప పర్యాటక ప్రదేశాల్లో ఒకటి గోవా. ఈ ప్రదేశం అందమైన బీచ్లకు ప్రసిద్ధి. సహజ అందాలకు పేరుగాంచింది. ఈ ప్రాంతం ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన అందమైన బీచ్ డెస్టినేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడి అద్భుతమైన బీచ్లు, అందమైన లొకేషన్లు, వాటర్ స్పోర్ట్స్ కార్యకలాపాలు, సంస్కృతి సంప్రదాయాలు, రుచికరమైన ఆహారం, చారిత్రక కట్టడాలు, పార్టీలు, విందులు, వినోదాలు.. ఇలాంటివన్నీ ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఎంతగానో ఆకట్టకుంటాయి. అందుకే చాలామంది విహారయాత్రలు ప్రణాళికలు వేసినప్పడు గోవా ఆ జాబితాలో ముందుంటుంది. ఈ ప్రదేశం ప్రతి ఒక్కరికీ నచ్చే టూరిస్ట్ స్పాట్గా పేరొందింది. గోవా వెళ్లాలనుకునేవారికోసం ఏపీఎస్ఆర్టిసి ప్రత్యేక బస్సు సర్వీసును అందుబాటులోకి తెచ్చింది.
గోవా టూర్ వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) బస్ సర్వీస్ను అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలేంటో చూసేద్దాం...
ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి గోవాకి ఆర్టీసీ స్పెషల్ లగ్జరీ బస్ సర్వీస్ను నడిపేందుకు సిద్ధమయ్యింది. టూరిజం డిపార్ట్మెంట్ తరహాలోనే పర్యటకుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీస్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సర్వీస్లను టూరిస్టులు, ప్రయాణికులు ఉపయోగించుకోవాలని ఆర్టీసీ కోరుతోంది. పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ గత కొంత కాలంగా ఈ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది.

గోవా పర్యాటకానికి సూపర్ లగ్జరీ సర్వీసులు..
కొత్త మార్గాలు, ఆధ్యాత్మిక పర్యటక కేంద్రాలకు నిత్యం కొత్త సర్వీసులను, ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ ఇప్పుడు టూరిస్టు ప్రాంతాలకు కూడా ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. సీజన్ ప్రకారం ఆధ్యాత్మిక ప్రాంతాలకు, పర్యాటకు ప్రదేశాలకు ఆర్టీసీ సర్వీసులను తీసుకెళుతుంది. ప్రయాణికుల డిమాండ్ను బట్టీ ఒకటి, రెండు, మూడు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తుంది.
అలాగే ఏసీ, సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్, ఆర్డినరీ సర్వీస్లను పర్యాటకుల కోసం నడుపుతోంది. ఇప్పటికే తమిళనాడులోని అరుణాచలం పుణ్యక్షేత్రానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏసీ, సూపర్ లగ్జరీ బస్ సర్వీస్లను అందుబాటులోకి తీసుకొచ్చిన ఏపీఎస్ఆర్టిసి ఇప్పుడు ఏకంగా గోవా పర్యాటకానికి సూపర్ లగ్జరీ సర్వీసులను ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
నేటి నుంచే బస్సు సర్వీసులు..
సత్తెనపల్లి నుంచి గోవాకు ప్రత్యేక బస్ సర్వీస్ నేటి నుంచి అంటే జూన్ 25 (మంగళవారం)న అందుబాటులోకి రానుంది. ఈ బస్సు సర్వీసులో భాగంగా మంగళవారం రాత్రి 8 గంటలకు సత్తెనపల్లి నుంచి గోవాకు బస్ బయలుదేరుతుంది. తిరిగి అదే బస్సు జూన్ 29న గోవా నుంచి బయలుదేరి జూలై 2వ తేదిన సత్తెనపల్లికి చేరుకుంటుంది. సత్తెనపల్లి నుంచి గోవా ట్రిప్లో భాగంగా అక్కడి వివిధ ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రసిద్ధిచెందిన పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అందులో అగోడా ఫోర్ట్, చపోరా ఫోర్ట్, బామ్ జీసస్ బాసిలికా, చర్ఛ్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్, నార్త్, సౌత్ గోవాలోని బీచ్లు, పశ్చిమ కనుల్లోని అందమైన జలపాతాలు మరెన్నో. వీటన్నింటిని సందర్శించేయొచ్చు.
ఇక వీటికి రెండు వైపుల టిక్కెట్టు ధరను ఏపీఎస్ఆర్టిసి రూ. 7500 గా నిర్ణయించింది. పర్యాటకులు ఇతర పూర్తి సమాచారం కోసం.. టిక్కెట్లు బుక్ చేసుకోవాలనుకునేవారు ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ను సంప్రదించగలరు. ఇతర వివరాల కోసం సత్తెనపల్లి ఆర్టీసీ డిపోను కూడా సంప్రదించొచ్చు. ఈ అవకాశాన్ని పర్యాటకులు సదర్వినియోగం చేసుకోవాలని ఆర్టిసీ అధికారులు కోరారు.



Click it and Unblock the Notifications













