సికింద్రాబాద్ నుంచి గోవా ట్రిప్ ప్లాన్ చేసున్నారా? అయితే, మీ కోసమే ఈ సమాచారం. సికింద్రాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు వారంలో రెండుసార్లు నడిచే రైలు రాబోతోంది. ఇది నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటి వరకూ పది కోచ్లతో వారానికి ఒక రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్కు వెళ్లాక అక్కడ తిరుపతి, తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 కోచ్లతో కలిపి కొత్త రైలుకింద గోవాకు వెళ్లేది. ఇప్పుడు ఆ బాధ లేకుండా నేరుగా సికింద్రాబాద్ నుంచే ప్రయాణం మొదలు పెట్టొచ్చు. మరెందుకు ఆలస్యం ఆ కొత్త రైలు విశేషాలు ఏంటో తెసుకుందామా?!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు రైల్వేశాఖ సికింద్రాబాద్ నుంచి వారానికి రెండు సార్లు గోవా రైలు నడపనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్ప్రెస్ రైలు (17039/17040) పట్టాలెక్కబోతోంది. ఇప్పటి వరకూ వారానికి ఒక రైలు 10 కోచ్లతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్కు, అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 కోచ్లతో కలిపి మరో కొత్త రైలుగా గోవాకు వెళ్లాల్సి వచ్చేది. దీంతోపాటు కాచీగూడ - యలహంక మధ్యన వారానికి 4 రోజులు ప్రయాణం చేసే మరో రైలుకు గోవాకు వెళ్లే 4 కోచ్లను లింక్ చేసేవవారు. ఈ 4 కోచ్ లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ - గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి పంపేవారు.

సీట్లు దొరక్క ఇబ్బందులు
అయితే, ఇలా బ్రేక్ జర్నీల కారణంగా సికింద్రాబాద్ - గోవా మధ్య రైళ్లన్నీ ప్రయాణికులతో రద్దీగా మారిపోయేది. కనీసం నిలబడి ప్రయాణం చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయేది. చాలా మంది రిజర్వేషన్లు ఉన్నప్పటికీ సీట్లు దొరక్క ఇబ్బందులు పడేవారు. దీనికి పరిష్కార మార్గం చూపాలంటూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విన్నవించారు. కిషన్ రెడ్డి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర రైల్వేశాఖ స్పందించింది. ఈ ప్రాజెక్ట్పై తాము సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న ప్రయాణికుల సమస్య పరిష్కారం అయినట్లే అని భావిస్తున్నారు.
ఎక్కడెక్కడ ఆగుతుందంటే..
సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనపై కేంద్రమంత్రి బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరనుంది. వాస్కోడగామా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణమవుతుంది. సికింద్రాబాద్ నుంచి మొదలయ్యే ఈ రైలుకు కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్డెమ్, మడగావ్ జంక్షన్లలో స్టాప్లను కేటాయించినట్లు సమాచారం.



Click it and Unblock the Notifications













