దేశంలో ప్రసిద్ధిచెందిన ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో గోవా పేరు ముందుంటుంది. ఎందుకంటే, ఇక్కడి అందమైన బీచ్లను చూసేందుకు చాలామంది వెళ్తుంటారు. ఒక్క బీచ్లే కాదు.. ఇక్కడ ప్రసిద్ధిచెందిన పర్యాటక ప్రదేశాలు మరెన్నో దాగి ఉన్నాయి. అయితే, హైదారాబాద్ నుంచి గోవాకు వెళ్లాలనుకునేవారికి సౌత్ సెంట్రల్ రైల్వే ఓ తీపికబురును అందించింది. ఇక నుంచి గోవాకు నేరుగా ట్రైన్స్ అందుబాటులోకి రానున్నాయి. సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్ టు వాస్కోడిగామా రైలు సర్వీసును దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అయితే, ఎప్పటి నుంచో ఈ రైలు తీసుకురావాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. ఎట్టకేలకు ఈ లైన్కు ట్రైన్ నడిపేందుకు గ్రీన్సిగ్నల్ అందింది.
ఈ ట్రైన్ అక్టోబర్ 6వ తేదిన సికింద్రాబాద్ నుంచి ప్రారంభం కానుంది. అయితే, ఈ ట్రైన్ వారంలో రెండు రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ఈ ట్రైన్ టైమింగ్స్ ఏంటీ..? ఏఏ స్టేషన్లలో ఆగుతుందో వాటి వివరాలను చూసేద్దాం..

ట్రైన్ టైమింగ్స్ ఇవే..
సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా వెళ్లే ఈ ట్రైన్ బుధ, శుక్రవారాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఉదయం 10.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా చేరుకుంటుంది. ఇక, వాస్కోడిగామా నుంచి సికింద్రాబాద్ కు గురు, శనివారాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఆగే స్టేషన్లు..
సికింద్రాబాద్ టు వాస్కోడిగామా వెళ్లే ట్రైన్ కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్హెమ్, మడగావ్ వంటి స్టేషన్లలో ప్రయాణికుల కోసం ఆగుతుంది. ఇక, ఇందులో ఫస్ట్ ఏసీకోచ్, 2ఏసీకోచ్, 3 ఏసీకోచ్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైన్ టిక్కెట్లు బుకింగ్ నేటి (4వ తేదీ) నుంచే అనుమతి ఉంటుంది. అక్టోబర్ 6వ తేదీ ట్రైన్ మాత్రం ఉదయం 11.45 గంటలకు ప్రారంభమయ్యి, మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు అక్కడికి చేరుకుంటుంది.

తెలుగు రాష్ట్రాల వారే..
ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోవాను ఏటా సుమారు 80 లక్షల మంది స్వదేశీ పర్యాటకులు సందర్శిస్తుంటారు. అయితే, ఈ పర్యాటకుల్లో 20 శాతం మంది తెలుగు రాష్ట్రాలవారే కావడం విశేషం. గోవాకు నేరుగా ట్రైన్లో వెళ్లే సౌకర్యం లేక సొంత వాహనాలు, ప్రత్యామ్నాయ మార్గాల్లో పర్యాటకులు గోవా చేరుకుంటున్నారు. ప్రస్తుతం వారానికి ఒక రైలు 10 బోగీలతో నడుస్తోంది.
అది కూడా సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్ చేరుకుని, అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 బోగీలతో కలిపి గోవాకు వెళ్తుంది. వీటితో పాటు కాచిగూడ టు యలహంక మధ్య వారానికి నాలుగు రోజులు నడిచే ట్రైన్కు గోవాకు వెళ్లే 4 కోచ్లను కలిపేవారు. ఇక, ఈ 4 కోచ్లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ టు గోవా మధ్యన తిరిగే ట్రైన్కు కలిపి నడిపేవారు. దీంతో ప్రయాణికులు చాలా అవస్థలు పడేవారు. బై వీక్లీ ట్రైన్ తో ఆ కష్టాలకు ముగింపు పలికినట్లే అని ప్రయాణికులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.



Click it and Unblock the Notifications













