ఏటా ఈ సీజన్లో శబరి అయ్యప్ప దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా బయలుదేరుతారు. అయితే, కేరళ ప్రభుత్వం ఈ ఏడాది అయ్యప్ప భక్తులకు ఊహించని షాక్ ఇచ్చింది. అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనంపై అక్కడి పినరయ విజయన్ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈసారి ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న భక్తులకు మాత్రమే శబరిమల దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ నిర్ణయానికి ముందే ఈ ఏడాది శబరిమల అయ్యప్ప భక్తులు తమ దర్శనం కోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచిస్తూ వచ్చింది. కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయ్యప్ప భక్తులకు పెద్ద షాక్ లాంటిదే అని చెప్పొచ్చు.
కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఏటా ఇక్కడి దైవక్షేత్రానికి అనేక రాష్ట్రాల నుంచి మండల పూజలు, మకరజ్యోతి సమయంలో లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు. అలాంటి సందర్భాలలో రోజుకు 1,20,000 మందికి పైగా శబరిమలకు అయ్యప్ప భక్తులు చేరుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
దేశంలోని అన్ని ప్రాంతాల నుంచీ భక్తులు పెద్ద ఎత్తున వచ్చి, అయ్యప్పను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అటు అయ్యప్ప దీక్ష ఎంతో నిష్టతో కూడుకున్నది. అందుకే, మాలాధారణ చేసిన భక్తులు శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారు.

మకరవిళక్కు సీజన్ నేపథ్యంలో..
అయితే, గత మండల సీజన్లో భక్తుల తాకిడి పెరగడంతో అక్కడి దేవస్థానం బోర్డు వారిని నియంత్రించడంతో విఫలమైంది. అయ్యప్ప భక్తులకు కనీస వసతులు కల్పించలేకపోయింది. దీంతో దేవస్థానం బోర్డుపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెళ్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో సమస్య పునరావృతం కాకుండా ఈ ఏడాది మండల పూజలు, మకరవిళక్కు ఉత్సవాల సమయంలో స్పాట్ బుకింగ్లను దేవస్థానం బోర్డు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరో నెల రోజుల్లో మకరవిళక్కు సీజన్ ప్రారంభం కానుండడంతో కేరళ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. తీర్థయాత్రల ఏర్పాట్లపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో దీనికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
రోజుకు 80 వేల మందికి మాత్రమే..
ఒక రోజుకు గరిష్ఠంగా 80 వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతి కల్పించింది. అంతేకాదు, వర్చువల్ క్యూ బుకింగ్ సమయంలో భక్తులు తమ ప్రయాణ మార్గాన్ని కూడా ఎంపిక చేసుకునే అకాశం ఇచ్చారు. అలాగే, దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లకు సన్నాహాలు మొదలుపెట్టింది. అటవీ మార్గంలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుండడంతోపాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే, శబరిమలకు వెళ్లే మార్గంలో రోడ్లు, దాని చుట్టూ పార్కింగ్ నిర్వహణ పనులపై ప్రత్యేక దృష్టిసారించినట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక అతిథి గృహ నిర్మాణం అందుబాటులోకి వచ్చిందని, మరొకటి త్వరలోనే పూర్తవుతుందని స్పష్టం చేశారు. మరి, శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు.



Click it and Unblock the Notifications













