దేశంలోని క్లీనెస్ట్ సిటీల్లో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ఏడోసారీ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 2023 ఏడాదికి గాను 'స్వచ్ఛ సర్వేక్షణ్' అవార్డుల్లో గుజరాత్ లోని సూరత్ తో కలిసి ఇండోర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక, మూడో స్థానంలో నవీ ముంబై ఉంది. ఇక టాప్ టెన్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు సిటీలు ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. విశాఖపట్నం నాల్గవ స్థానం దక్కించుకోగా, విజయవాడ ఆరవస్థానం, తిరుపతి ఎనిమిది, హైదరాబాద్ 9వ స్థానాల్లో నిలిచాయి.
మున్సిపాలిటీల్లో స్వచ్ఛతను మెరుగు పర్చేందుకు కేంద్రం ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో ర్యాంకులను ప్రకటిస్తోంది. 2016 ఈ ర్యాంకులను ప్రవేశపెట్టడం ప్రారంభించింది. ఆ ఏడాది ఇండోర్ 25 ర్యాంకులో నిలవగా, తాజాగా 2023వ ఏడాదికి సంబంధించిన ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఇందులో వరుసగా ఏడోసారి కూడా ఇండోర్ నంబర్ వన్ ర్యాంకు సాధించి, దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది.

గురువారం నాడు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని భారత్ మండపంలో 'స్వచ్ఛ సర్వేక్షణ్' అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేయడం జరిగింది. క్లీన్ సిటీస్, క్లీనెస్ట్ కంటోన్మెంట్, సఫాయిమిత్ర సురక్ష, గంగా టౌన్స్, బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్ కేటగిరీలలో టాప్ త్రీలో నిలిచిన సిటీలకు అవార్డులను అందజేశారు. నేషనల్ లెవల్లో 24, జోనల్ లెవల్ లో 20, స్టేట్ లెవల్ లో 54 విభాగాల్లో కలిపి మొత్తం 110 అవార్డులను ప్రకటించారు.
లక్ష లోపు జనాభా కలిగిన సిటీల కేటగిరీలో సస్వాద్ (మహారాష్ట్ర), పటాన్ (చత్తీస్ గఢ్), లోనావాలా (మహారాష్ట్ర) మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకోగా, మధ్యప్రదేశ్ లోని మోవ్ క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డుగా ఎంపికయ్యింది. క్లీనెస్ట్ గంగా సిటీల్లో వారణాసి, ప్రయాగ్ రాజ్ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. గురువారం అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ్-2023 డాష్ బోర్డును కూడా రాష్ట్రపతి ముర్ము ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో రాష్ట్రాలు, అర్బన్ లోక్ బాడీస్ పనితీరును ప్రశంసించడం జరిగింది.
9వ స్థానంలో నిలిచిన భాగ్యనగరం...
లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో పరిశుభ్రమైన నగరంగా భాగ్యనగరం 9వ స్థానంలో నిలిచింది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి మరో మూడు అవార్డులు కూడా రావడం జరిగింది. లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న కేటగిరీల్లో దక్షిణాదిలో మొత్తం నాలుగు అవార్డులకు గాను మూడు తెలంగాణకే దక్కడం విశేషం. ఇందులో 15--25 వేల మధ్య జనాభా ఉన్న కేటగిరీలో గుండ్లపోచంపల్లి పరిశుభ్రమైన సిటిగా నిలిచింది. 25--50 వేల మధ్య జనాభా ఉన్న కేటగిరీలో నిజాంపేట్, 50 వేల నుంచి లక్ష లోపు జనాభా ఉన్న కేటగిరీలో సిద్దిపేట నగరాలకు అవార్డులు దక్కాయి. ఈ అవార్డులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఆయా జిహెచ్ఎంసీ పరిధిలోని అధికారులకు అందజేశారు. ఇందులో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ సోమ భారత్, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ మంజుల అవార్డులను అందుకోవడం జరిగింది.



Click it and Unblock the Notifications












