భారతీయులకు వీసా మినహాయింపు ఇచ్చిన దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పడు తాజాగా వీసా ఫ్రీ దేశాల జాబితాలో మరో దేశం చేరింది. అదే ఇరాన్. అయితే, ఈ దేశం కొన్ని షరతులను విధించింది. ఫిబ్రవరి 4 నుంచి భారతీయ పర్యాటకులు 15 రోజులపాటు వీసా లేకుండానే ఇరాన్ను సందర్శించొచ్చు. వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించడానికి అనుమతి ఇస్తున్నట్లు ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఇటీవలే ప్రకటించడం జరిగింది. అయితే, వీటికి నాలుగు షరతులు వర్తిస్తాయని రాయబార కార్యాలయం తెలిపింది.
వీసా లేకుండానే ప్రయాణాలకు అనుమతి ఇచ్చిన ఇరాన్ ప్రభుత్వం కొన్నిషరతులను విధించింది. ఈ మేరకు ఇరాన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో ఆ వివరాలను వెల్లడించింది. సాధారణ పాస్పోర్ట్లు కలిగిన భారతీయులు ప్రతి ఆరు నెలలకొసారి వీసా లేకుండా ఇరాన్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. గరిష్టంగా 15 రోజులు మాత్రమే ఇరాన్లో బస చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇది కేవలం విమానప్రయాణాల ద్వారా వచ్చే ప్రయాణికులకు మాత్రమే వర్తించనుంది. భారతీయ పర్యాటకులకు కూడా ఈ షరతులు వర్తించనున్నాయి.
అయితే ఎక్కువ రోజుల పాటు ఇరాన్ను సందర్శించాలనుకునేవారు మాత్రం భారత్ లో ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయం నుండి అవసరమైన వీసాలను పొందాలని తెలిపింది. డిసెంబరు నెలలో భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, జపాన్, సింగపూర్, మలేషియాతో సహా 32 ఇతర దేశాల కోసం కొత్త వీసా-రహిత ప్రోగ్రామ్ను ఇరాన్ ఆమోదించడం జరిగింది.

ప్రపంచ దేశాల పర్యాటకులను ఆకర్షించడమే ముఖ్య లక్ష్యం...
ఇరాన్ సాంస్కృతిక వారసత్వం, పర్యాటకం, హస్తకళల మంత్రి ఎజ్జతోల్లా జర్ఘామి ఈ సందర్భంగా మాట్లాడారు. ఇరాన్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ప్రపంచ దేశాల నుండి ఎక్కువ మంది పర్యాటకులను, సందర్శకులను ఆకర్షించడం వారి ముఖ్య లక్ష్యమని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో నెలకొని ఉన్న ఇరానో ఫోబియా ను అంతం చేయాలని, అందుకే ఈ దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
సాధారణ పాస్పోర్ట్లను కలిగి ఉన్న వారు ఆరు నెలలకోసారి వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తామని, గరిష్టంగా 15 రోజులు ఉండవచ్చని ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. '15 రోజుల వ్యవధిని పొడిగించడం సాధ్యం కాదని కూడా పేర్కొనడం జరిగింది. 'పర్యాటక ప్రయోజనాల కోసం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ భూభాగంలోకి ప్రవేశించే వ్యక్తులకు మాత్రమే ఈ షరతులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
గతంతో పోలిస్తే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది...
కొన్ని నివేదికల ప్రకారం...2022లో ఇరాన్ విదేశీ పర్యాటకుల రాక అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 315% పెరిగిందని చెప్పుకోవచ్చు. 2021లో 990,000 నుండి 2022లో దాదాపు 4.1 మిలియన్ల మంది పర్యాటకులు ఇరాన్ను సందర్శించినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మంత్రి ఎజ్జతోల్లా జర్ఘామి మాట్లాడడం జరిగింది. 2023లో భారతదేశం నుండి ఇరాన్ వచ్చే ప్రయాణికుల సంఖ్య పెరిగిందన్నారు.
2023 మొదటి ఆరు నెలల్లో 31,000 మంది భారతీయులు ఇరాన్ను పర్యటించినట్లు తెలుస్తోంది. 2022లో ఈ సంఖ్య పెరిగిందని తెలిపారు. చాలా మంది విదేశీ యాత్రికులు పర్యాటకం, వాణిజ్యం, వైద్యం మరియు తీర్థయాత్రల కోసం ఇరాన్ను సందర్శిస్తున్నట్లు మంత్రి వివరించారు.



Click it and Unblock the Notifications











