ఒకవైపు అయోధ్యలో చారిత్రక రామమందిరం ప్రారంభోత్సవ ఏర్పాట్లతో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబి నగరంలో కూడా చరిత్ర సృష్టించబోతోంది. అబుదాబిలో మొట్టమొదటి హిందూ దేవాలయం ప్రారంభం కానుంది. ఈ ఆలయ ప్రారంభానికి భారతదేశ ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించడం జరిగింది. అందుకు ఆయన కూడా ఒప్పుకున్నారు.
అబుదాబిలోని BAPS హిందూ దేవాలయం, భారతదేశం వెలుపల అతిపెద్ద దేవాలయాలలో ఒకటిగా, పశ్చిమ ఆసియాలో అత్యంత అద్భుతమైన హిందూ దేవాలయంగా ఏర్పాటు చేయడం జరిగింది. అబుదాబిలోని ఈ హిందూ దేవాలయం ప్రముఖ స్వామి మహారాజ్, BAPS స్వామినారాయణ్ సంస్థ, మహంత్ స్వామి మహారాజ్ యొక్క ఆధ్యాత్మిక సాధువుల ఆశీర్వాదం ద్వారా ప్రేరేపించబడింది. ఈ ఆలయాన్ని భారతదేశంలోని నైపుణ్యం కలిగిన కళాకారులు మాత్రమే నిర్మించారు. ఈ ఆలయం కేవలం దేవాలయంగా మాత్రమే కాకుండా అబుదాబిలో సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శక్తివంతమైన ప్రదేశంగా కూడా పేరు పొందుతుంది. అబుదాబిలో మొదటి హిందూ దేవాలయాన్ని ఫిబ్రవరి 14, 2024న ప్రారంభించనున్నారు.
ఈ వేడుక గొప్ప ఆధ్యాత్మికత, విశ్వాసం కలగలిసినది ఉండనుందని హిందూ మందిర్ ప్రతినిథులు అంటున్నారు. ఆలయ అధిపతి బ్రహ్మవిహారీదాస్ స్వామి పర్యవేక్షణలో ప్రాణం పోసుకుంటున్న ఈ ఆలయం వచ్చే నెల ఫిబ్రవరి 18 నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది. అలాగే ఫిబ్రవరి 15న స్వామి మహరాజ్ సమక్షంలో ప్రజా సమర్పణ సభ జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే భక్తులు మందుగానే ఫెస్టివల్ ఆఫ్ హార్మోనీ వెబ్సైట్కి వెళ్లి రిజస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఆలయ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం
- అబుదాబి యొక్క BAPS హిందూ దేవాలయం మధ్యప్రాచ్యంలో చారిత్రక చిహ్నంగా ఉద్భవించనుంది.
- ఈ ఆలయం భారతదేశంలో నిర్మించిన సాంప్రదాయ రాతి దేవాలయాల వలె రూపొందించబడింది.
- ఈ ఆలయం గులాబీ రంగు ఇసుకరాయితో నిర్మించబడింది. దీని రూపకల్పన శిల్పశాస్త్రం, సంస్కృత గ్రంథాల వాస్తుశిల్పం ఆధారంగా తయారు చేయడం జరిగింది.
- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఈ ఆలయం సాంప్రదాయ, ఆధునిక వాస్తుకళల మిశ్రమంగా నిర్మించబడింది.
- UAEలోని 7 ఎమిరేట్స్కు ప్రాతినిధ్యం వహించే ఆలయంలో 7 గోపురాలు నిర్మించబడ్డాయి.
- ఈ 7 గోపురాలే కాకుండా, ఆలయం దాని వైభవాన్ని పెంచే 5 అలంకారమైన గోపురాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం శిఖరం ఎత్తు 108 అడుగులు ఉంటుంది.
- సందర్శకుల కేంద్రం, ప్రార్థన గది, ప్రదర్శనలు, ప్రత్యేక అభ్యాస ప్రదేశం, పిల్లల కోసం ఆట స్థలం, వివిధ థీమ్ల ఆధారంగా తోటలు, తాగునీటి సౌకర్యం, ఫుడ్ కోర్ట్, బుక్, గిఫ్ట్ షాప్ వంటి వాటిని కూడా ఆలయంలో నిర్మించబడ్డాయి.
- దీపావళి, గోవర్ధన్ పూజ మొదలైన అన్ని రకాల హిందూ పండుగలు ఈ ఆలయంలో నిర్వహిస్తారు. అందువల్ల పండుగల సమయంలో ఈ ఆలయం ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.
- ఈ ఆలయం భారతదేశం, UAE మధ్య సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది.
- UAEలో నిర్మించిన BAPS హిందూ దేవాలయం యొక్క తలుపులు అన్ని మతాల వారికోసం తెరవబడతాయి.
అబుదాబిలోని ఈ అద్భుతమైన ఆలయానికి ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ అహ్యాన్ స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ ఆలయం 14 ఫిబ్రవరి 2024న ప్రారంభించబడుతుంది. అబుదాబిలోని మొదటి హిందూ దేవాలయాన్ని భారతదేశ ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. 27 ఎకరాల స్థలంలో ఈ ఆలయం విస్తరించనుంది.



Click it and Unblock the Notifications











